– రోజుకు 28 మంది విద్యార్థుల ఆత్మహత్య
– గంటకు ఒక్కరు చొప్పున..
– ఉన్నత విద్యాసంస్థల్లోనూ ఘటనలు
– ఒత్తిడి, ఆందోళన, నైరాశ్యం తదితరాలే కారణాలు
– కౌన్సెలింగ్ అవసరం అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ/చెన్నై : ‘ ప్రతి రోజూ గొప్పగా జీవించండి. మీకు ఉన్నదే ఒక్కగానొక్క జీవితం’.. ఇవి గతేడాది జులై 2వ తేదీన ఆత్మహత్య చేసుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-హైదరాబాద్కు చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి 8 పేజీల తన చివరి లేఖలో ఉన్న పదాలు. ఈయనకు ఏం కష్టం వచ్చిందో గానీ మంచిగా చదువుకొని అటు తన తల్లిదండ్రులకు, ఇటు దేశానికి ఉపయోగపడాల్సిన వ్యక్తి చివరకు హాస్టల్ రూమ్లో విగతజీవిగా కనిపించాడు. విద్యార్థుల ఆత్మహత్యలు భారత్లో కొత్త కాదు, నిరంతరం ఎక్కడో చోట విద్యార్థి అనే భావిభారత పౌరుడు మృత్యుఒడికి చేరుకుంటున్నాడు. భారత్తో ప్రతిరోజుకు.. కాదు కాదు గంటకు ఒక విద్యార్థి అత్మహత్య చేసుకుంటున్నారు. వారిలో నెలకొంటున్న ఒత్తిడి కావచ్చు, లేదా వేధింపులు కావచ్చు, ఇతరత్రా కారణాలు కావచ్చు.. ఇలా ఏదైతేనేం చదువులతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు ఊపిరి తీసుకుంటున్నారు. యువత, విద్యార్థులే దేశాభివృద్ధికి కీలకం, వారిదే భవిష్యత్తు అని ఢంకాలు మోగించుకునే భారత్ వంటి దేశంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.
ఏడాదికేడాదికి పెరుగుదల
ప్రతి గంటకు ఒకరు చొప్పున, రోజుకు 28 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ఇటీవల తన తాజా నివేదికలో పేర్కొంది. ఏడాదికేడాదికి ఈ తరహా ఘటనలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2016లో 7,478గా ఉన్న ఈ సంఖ్య 2017 నాటికి 9,905కు చేరింది. 2018 సంవత్సరానికి 10,159 అత్మహత్యలు నమోదయ్యాయి.. ఈ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 2018లో అత్యధికంగా 1,448 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రోజుకు మహారాష్ట్రలో 4 ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఆ తరువాతి స్థానంలో 953 ఆత్మహత్యలతో తమిళనాడు, 862తో మధ్యప్రదేశ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 1999 నుంచి 2003 వరకూ ఉన్న ఐదేళ్ల కాలంలో 27,990 మంది విద్యార్థులు తమ ఉసురు తీసుకోగా, 2004-08 మధ్య కాలంలో 28,913 మంది ఆత్యహత్య చేసుకున్నారు. 2009-13 మధ్య కాలంలో 39,913 ఘటనలు చోటుచేసుకున్నాయి. 20014-18 మధ్య ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్కసారిగా 26 శాతం పెరుగుదలతో 46,554 మంది విద్యార్థులు తమ జీవితాలకు ముగింపు పలికారు.
విద్యావ్యవస్థ తీరుకు అద్దం
ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో చోటుచేసుకుంటున్న ఆత్యహత్యలు ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ తీరుకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సమాచారం మేరకు.. 2014-19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న 10 ఐఐటీల్లో 27 మంది విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ కాలంలో ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్యలతో మద్రాస్ ఐఐటీ మొదటి స్థానంలో ఉంది. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లి ఇక తమకు జీవితమే లేదన్నట్టుగా, బంధువులు, ఇతరులు ఏమి అనుకుంటున్నారో అన్న భావనతో తమ జీవితాలను వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారు. గతేడాది ఏప్రిల్లో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలైన అనంతరం వారంలోపే రాష్ట్రంలోని పలుచోట్ల 19 మంది విద్యార్థులు అత్మహత్యకు పాల్పడడం దేశంలోనే తీవ్రచర్చనీయాంశంగా మారింది. అంతకుముందు రెండేండ్ల క్రితం మధ్యప్రదేశ్లో జరిగిన విషాదకర ఘటనలో బోర్డ్ పరీక్షల ఫలితాలు విడుదలైన తరువాత ఒక్కరోజులోనే ఆరుగురు బాలికలతో సహా మొత్తం 12 మంది తమ జీవితాలను ముగించారు. పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ సెంటర్ల హబ్గా ఉన్న రాజస్థాన్లోని కోటా జిల్లాలో ప్రతి ఏడాది విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం సమాచారం మేరకు.. 2013-17 కాలంలో అక్కడ 58 అత్మహత్యలు జరిగాయి.
15-29 వయసున్న వారే అధికం
ప్రముఖ ‘ల్యాన్సెట్’ మ్యాగజైన్ 2012లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్లో 15-29 మధ్య వయసున్న విద్యార్థులు, యువతలోనే ఆత్మహత్య రేటు అధికంగా ఉంది. పురుషుల్లో ఆత్యహత్యలకు పాల్పడే వారిలో 40 శాతం మంది 15-29 మధ్య వయసు వారు కాగా, మహిళల్లో ఈ శాతం 60గా ఉంది. ఈ ఆత్మహత్యలపై ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ అధ్యక్షుడు మురుగేష్ వైష్ణవ్ మాట్లాడుతూ ‘ ఒత్తిడి, ఆందోళన, నైరాశ్యం, వ్యక్తిగత రుగ్మత, తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని చెప్పారు. ప్రతి 10 మందిలో నలుగురు విద్యార్థులు పలు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారని లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థ 2017లో విడుదల చేసిన సర్వేలో పేర్కొంది. ఈ సంస్థ 15-34 ఏండ్ల మధ్య వయసున్న వారిపై ఈ సర్వే నిర్వహించింది. ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు నైరాశ్యంతో ఉన్నారని, ఒంటరితనం ఫీలవుతున్నారనీ, తన సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నాడని, ఆత్యహత్య ఆలోచనలతో ఉన్నాడని తేల్చింది.
కౌన్సిలింగ్ అవసరం
న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్’కు చెందిన ప్రొఫెసర్ మహ్మద్ నజీర్ ఆలం మాట్లాడుతూ ఏదైనా కష్టం వచ్చిన సమయాల్లో విద్యార్థికి ధైర్యం చెప్పే వారు, అండగా ఉండే వారు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని అన్నారు. తల్లిదండ్రులు, ఇతరుల ఒత్తిడి కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయని ఆయన చెప్పారు. విద్యాపరమైన ఒత్తిడి ప్రధానాంశంగా ఉందని బెనారస్ హిందూ యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగాధిపతి ఎకె.జోషి అభిప్రాయపడ్డారు. ఒక స్థాయి వరకూ చదువుకున్న తర్వాత ఉద్యోగం విషయంలో విద్యార్థులు తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేని సందర్భంలో వారు తీవ్ర వేదనకు గురవుతారనీ, ఈ సమయంలో తనువు చాలించాలనే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. భయం కూడా ఈ ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణంగా ఉందని ప్రదీప్ కుమార్ సాహా అనే కోల్కతాకు చెందిన సైకియాట్రిస్టు తెలిపారు. ఏదైనా ఇలాంటి అంశాల్లో విద్యార్థులకు తగిన కౌన్సిలింగ్ అవసరమని, తద్వారా ఆత్మహత్యలను అరికట్టొచ్చని నిపుణులు అంటున్నారు.
Courtesy: NT