ఆ సేవలపై దీర్ఘకాలిక ఆంక్షలు సరికాదు
జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
జమ్మూ -కశ్మీర్లో ఆంక్షలను తక్షణం సమీక్షించాలని ఆదేశం
తమ తీర్పునకు అనుగుణంగా లేనివాటిని రద్దు చేయాలని నిర్దేశం
పౌరులకు హక్కులు, భద్రత కల్పించాల్సిన బాధ్యత కోర్టులదేనని వ్యాఖ్య
దిల్లీ: ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిబంధనల పేరుతో దీర్ఘకాలంపాటు ఆ సేవలను నిలిపివేయడం కుదరదని కుండబద్ధలు కొట్టింది.
జమ్మూకశ్మీర్లో ఆంక్షలను దీర్ఘకాలంపాటు కొనసాగించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది. అక్కడ విధించిన నియంత్రణలను తక్షణమే సమీక్షించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. తమ తీర్పునకు అనుగుణంగా లేని ఆంక్షలను రద్దు చేయాలంది. 370 అధికరణం రద్దు తర్వాత జమ్మూ -కశ్మీర్ వ్యాప్తంగా దీర్ఘకాలంగా ఫోన్లు, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, ‘కశ్మీర్ టైమ్స్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ ద్వారా చేసే భావప్రకటన, వృత్తి, వ్యాపారం, వాణిజ్యం కూడా రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం ప్రాథమిక హక్కు కిందకే వస్తాయని జస్టిస్ రమణ, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉద్ఘాటించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్సీ)లోని సెక్షన్-144ను పదేపదే విధించడం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని పేర్కొంది. ఈ సెక్షన్ కింద
జారీచేసే ఉత్తర్వులు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రజా జీవితంపై పరిమితులు విధించేలా ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని తప్పనిసరిగా బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఆంక్షలు ఎప్పుడూ పరిమితంగా, నైష్పత్తిక సూత్రాన్ని అనుసరించి ఉండాలని నిర్దేశించింది.
– వాటి జోలికి వెళ్లదలుచుకోలేదు
“ఇంటర్నెట్ ద్వారా భావప్రకటన, వృత్తి, వ్యాపారం చేసుకొనే స్వేచ్ఛ దేశ పౌరులందరికీ ఉంది. ఇందుకు – రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) రక్షణ కల్పిస్తున్నాయి. ఇలాంటి ప్రాథమిక హక్కులపై | విధించే ఆంక్షలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2), 19(6) లను, నైష్పత్తిక సూత్ర పరీక్షకు లోబడి ఉండటం తప్పనిసరి” అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. నిషేధాజ్ఞల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? లేవా? అనే విషయాల జోలికి న్యాయస్థానం వెళ్లదలుచుకోలేదని చెబుతూ ఆయన తీర్పు చదివారు. “భద్రత, పౌరుల స్వేచ్ఛ మధ్య సమతౌల్యం ఉందా? లేదా? అన్నది చూడటం వరకే మా పాత్ర పరిమితం. ప్రజల హక్కులకు భద్రత కల్పించడానికే మేం ఇక్కడున్నాం. కశ్మీర్ ఎంతో హింసను చవిచూసింది. కాబట్టి భద్రతను దృష్టిలో ఉంచుకొని మానవ హక్కులు, స్వేచ్ఛ మధ్య సమతౌల్యం పాటించడానికి శక్తివంచన లేకుండా మా వంతు కృషిచేస్తాం. స్వేచ్ఛ, భద్రత నిరంతరం ఒకదానితో మరొకటి తలపడుతుంటాయి. అయితే పౌరులకు హక్కులు, భద్రత కల్పించాల్సిన బాధ్యత కోర్టులదే” అని వ్యాఖ్యానించారు.
* జమ్మూ -కశ్మీర్లో తక్షణం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేని చోట్ల ప్రభుత్వ వెబ్ సైట్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థల సేవలు తక్షణం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తీర్పులోని మరిన్ని కీలకాంశాలు * ఇంటర్నెట్ ద్వారా భావ వ్యక్తీకరణ ఇటీవలి కాలంలో అత్యవసరంగా మారింది. సమాచార వ్యాప్తికి ఇదో ప్రధాన వనరు. * ఇంటర్నెట్ పై ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. . * వ్యాపారం, వాణిజ్యాలకు ఇంటర్నెట్ అత్యవసర సాధనం. కొన్ని వాణిజ్యాలు పూర్తిగా దానిపైనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇంటర్నెట్ ద్వారా చేసే వాణిజ్యం వినియోగం, లభ్యతలను పెంచుతోంది. * రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కింద ప్రసాదించిన భావ ప్రకటన, మాట్లాడే స్వేచ్ఛపై అవసరమైన సమయంలో పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే, అది ఆర్టికల్ 19(2)లోని నిబంధనలకు లోబడే ఉండాలి. * వ్యక్తుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు అధికారులు నైష్పత్తిక సూత్రాన్ని అనుసరించాలి. ఆ పరిమితులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనవై ఉండాలి. * నియంత్రణ చట్టాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వివిధ హక్కులపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. అందువల్ల మానవ హక్కుల విషయంలో వీటిని సాదాసీదాగా ప్రయోగించకూడదు. * ప్రస్తుతం అమల్లో ఉన్న టెంపరరీ సస్ఫెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ – పబ్లిక్ సేఫ్టీ) రూల్స్- 2017 కింద కాలానుగుణ సమీక్ష(పీరియాడిక్ రివ్యూ)గానీ, సేవల నిలిపివేతకు నిర్దిష్ట కాలపరిమితిగానీ లేదు. ఈ లోపాన్ని సరిదిద్దేంతవరకూ ఇందులోని రూల్-2(5) కింద ఏర్పాటయ్యే రివ్యూ కమిటీ వారానికోసారి సమీక్ష నిర్వహించాలి.
Courtesy Eenadu