– ఆ అధికారం యోగి సర్కారుకు ఉన్నదా..!
– ఆందోళనకారుల ఆస్తులను జప్తు చేయొచ్చా?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత ప్రదర్శన వెనుక హింసోన్మాదాన్ని సృష్టిస్తున్నదెవరు..? ఓ వర్గాన్ని టార్గెట్ చేసేలా అమిత్షా..మోడీ ద్వయం అంటుంటే…ఇటీవల పశ్చిమబెంగాల్లో రైలుపై రాళ్లదాడిలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ సర్కార్ తెచ్చిన సీఏఏ చట్టం, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలను తిప్పికొట్టడంలో బీజేపీకి తలబొప్పికడుతున్నది. మోడీ ట్విట్టర్ ద్వారా దేశ వ్యతిరేకులుగా ఓ వర్గాన్ని చిత్రీకరించటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీహార్లో శాంతియుత నిరసనకారులపై భజరంగ్ కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సంఫ్ు అనుకూలురు అరెస్టు కూడా అయ్యారు. శాంతియుత నిరసనలను హింసాత్మకంగా మారిస్తే.. తమకు అనుకూలమైన మెజార్టీ వర్గాన్ని తమ ఓటుబ్యాంకుగా మార్చుకునే దిశగా పావులు కదుపుతున్నది. ఈ హింసోన్మాదాన్ని రెచ్చగొట్టించి… వారి ఆస్తులను జప్తు చేస్తామంటూ నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు ఏఏ రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి..? అప్పటి బీజేపీ ప్రభుత్వాల పాలనలో నష్టాలు.. తీసుకున్న చర్యలేంటీ..?
లక్నో: దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. విధ్వంసమూ జరిగింది. డిసెంబర్ 20 నుంచి అక్కడ నిరసనల్లో 19 మంది చనిపోయారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై ‘ప్రతీకారం’ ఉంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఆందోళనకారులు కలిగించిన నష్టానికి పరిహారంగా వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పోలీసుల చర్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలో వందలాదిమందికి నోటీసులు కూడా అందాయి. అయితే, ఇలా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడినవారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయొచ్చా? ఆ అధికారం ప్రభుత్వాలకు ఉంటుందా?
హర్యానాలో
హర్యానాలో 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మొత్తం 30 మంది చనిపోయారు. ఈ విధ్వంసం కారణంగా ప్రభుత్వానికి రూ.1000 కోట్లకుపైగా నష్టం జరిగింది. ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్ల వరకూ పరిహారం చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. నిరసనకారులపై ప్రభుత్వం పెట్టిన కేసులు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. విధ్వంసానికి పరిహారంగా ఆందోళనకారుల నుంచి జరిమానాలేవీ వసూలు చేయలేదని హర్యానా ప్రభుత్వం తెలిపింది.
మధ్యప్రదేశ్లో
మధ్యప్రదేశ్లోని మందసోర్లో 2017లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఘర్షణల్లో 20కిపైగా వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. రైలు పట్టాలను తొలగించారు. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఆందోళనకారులెవరి నుంచీ విధ్వంసానికి పరిహారం వసూలు చేయలేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
డేరా ఆస్తుల జప్తు…
హర్యానాలోని పంచకుల కోర్టు 2017 ఆగస్టులో డేరా సచ్చా సౌధా బాబా రామ్ రహీంను లైంగికదాడి కేసులో దోషిగా తేల్చింది. అతడిని అరెస్టు చేయాలని ఆదేశించింది. రామ్ రహీంను అరెస్టు చేసేందుకు వెళ్ళిన పోలీసులను ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు. ఈ ఘర్షణల్లో జరిగిన ఆస్తి నష్టానికి ఆందోళనకారుల నుంచే పరిహారం వసూలు చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించింది. అయితే, నష్టపరిహారం కింద డేరా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. అయితే, ఆందోళనల్లో పాల్గొన్న వారి నుంచి పరిహారం వసూలు చేయలేదు. వారికి ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు.
గత 13 ఏండ్లలో రిజర్వేషన్ల కోసం గుజ్జర్ వర్గం అనేకసార్లు బంద్లు, రాస్తారోకోలు చేసిందనీ, వీటి వల్ల రైల్వేకు రూ.కోట్లలో నష్టం కలిగిందని జైపూర్కు చెందిన సీనియర్ పాత్రికేయుడు నారాయణ్ బారెట్ అన్నారు. వీటికి సంబంధించి పరిహారం వసూలు చేసినట్టుగా తమ వద్ద సమాచారం ఏదీ లేదని రాజస్థాన్ పోలీసులు తెలిపారు. ‘మొదట్లో ప్రభుత్వం దీన్ని శాంతి భద్రతల సమస్యగా భావించి పరిష్కరించాలనుకునేది. కానీ, ఇది పేదరికం, నిరుద్యోగం, అసమానతల నుంచి పుట్టిన సమస్య’ అని గుజ్జర్ ఉద్యమ తొలి దశలో ఉద్యమకారులకు నేతృత్వం వహించిన రూప్ సింగ్ అన్నారు.
ఈ ఉద్యమానికి సంబంధించి మొత్తం 781 కేసులు నమోదైనట్టు రాష్ట్రంలోని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) చెప్పారు. వాటిలో సుమారు 300 కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుందని అన్నారు. తీవ్రమైన నేరాలున్న కేసులు కొనసాగుతున్నాయని వివరించారు. అయితే, వారి నుంచి నష్టపరిహారం ఏదీ వసూలు చేయలేదని చెప్పారు.
నిర్ణయం కోసం కమిటీలు…
సీఏఏ నిరసనల సమయంలో జరిగిన విధ్వంసానికి నష్ట పరిహారం వసూలు చేయాలని యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది. ఆందోళనకారుల ఆస్తుల జప్తు విషయంలో సుప్రీం కోర్టు, వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల సూచనలు భిన్నంగా ఉన్నాయి. ఈ అంశంపై ఓ చట్టం చేయాలని కేంద్రానికి కూడా కోర్టులు సూచించాయి. హింసాత్మక ఆందోళనల్లో జరిగే ఆస్తుల నష్టాన్ని ఎలా పూడ్చవచ్చనే అంశంపై సలహాల కోసం సుప్రీం కోర్టు 2007లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, సీనియర్ న్యాయవాది ఫలీ నారీమన్లతో వేర్వేరుగా కమిటీలు వేసింది.
ఆందోళనకారుల ఆస్తుల జప్తు ప్రక్రియను ప్రభుత్వం చేపడితే… అది కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని కొందరు నిపుణులు అంటున్నారు. అంటే, విశ్రాంత న్యాయమూర్తిని ‘క్లెయిమ్ కమిషనర్’గా నియమించి, వారి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ చేపట్టాలి.
పోలీసుల విధ్వంసం మాటేంటి?
ఆందోళనకారుల నుంచి నష్ట పరిహారం వసూలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అందరికీ ఒక పాఠమని ఉత్తర్ప్రదేశ్ డీజీపీ ప్రకాశ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆస్తుల జప్తు ఏకపక్షంగా జరుగుతున్నదనీ, నిందితులకు న్యాయవ్యవస్థ ముందు నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉండాలని మాజీ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మాందర్ అన్నారు. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ చర్యల్లో సమానత్వం లోపించిందని అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ చర్యలు పారదర్శకంగా, సమానత్వంతో ఉండాలి. కాశ్మీర్లో జరిగే ఆందోళనలను ఒకలా.. ఇతర ప్రాంతాల్లో జరిగేవాటిని మరోలా చూడకూడదు. వర్గాలను బట్టి తేడాలు చూపడం సరికాదు’ అని అన్నారు. ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల విధ్వంసం వల్ల నష్టపోయినవారికి పరిహారం ఎవరి నుంచి వసూలు చేసి చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
(Courtesy: NT)