- ఇంటర్నెట్ సౌకర్యమూ లేదు
- 36శాతం మందికి పుస్తకాలు లేవు
- ఎన్సీఈఆర్టీ సర్వేలో వెల్లడి
కరోనా వైరస్ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. నష్టపోయిన విద్యా కాలాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అనునుమతిస్తున్నప్పటికీ, దేశంలో 27 శాతం మందికి స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్(ఎన్సీఈఆర్టీ)… ఆన్లైన్ తరగుతుల నిర్వహణ తీరుపై దేశవ్యాప్తంగా 34,000 మందిని సర్వే చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎ్సఈ అనుబంధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సర్వేలో తమ అనుభవాలను వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ సర్వే చేసిన మొత్తం విద్యార్థుల్లో సుమారు 27 శాతం మంది వద్ద స్మార్ట్ఫోన్లు లేవు. ఉన్న కొద్ది మందికీ వాటిని వినియోగించే విధానంపై సరైన అవగాహన లేదు. ఆన్లైన్ తరగతుల మధ్యలో అంతరాయం ఏర్పడటం, విద్యుత్ పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మరో 28 శాతం మంది తెలిపారు.
టీచర్లలో కొరవడిన ఆన్లైన్ బోధనానుభవం
కొంత మంది ఉపాధ్యాయుల్లో ఆన్లైన్ బోధనలో సరైన అనుభవం లేకపోవడం విద్యార్థుల్లో అభ్యసన ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఆన్లైన్ బోధనకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాల కొరత కారణంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు స్మార్ట్ఫోన్లనే ప్రధాన సాధనంగా ఎంచుకున్నట్లు సర్వే తేల్చింది. చాలా ప్రాంతాల్లో విద్యార్థులు పాఠ్య పుస్తకాల కొరతను ఎదుర్కొన్నారు. 36శాతం మంది వద్ద సరైన పుస్తకాలు కూడా లేవు. ఎన్సీఈఆర్టీ వెబ్సైట్లో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్న విషయం చాలా మంది విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం.
అర్థంకాని గణితం, సైన్స్ పాఠాలు
అన్నిటికంటే మరో ప్రధాన సమస్య ఆన్లైన్లో గణితం పాఠాలు అర్థం కాకపోవడం. మేథ్స్లో ఉండే కాన్సెఫ్ట్స్, ఫండమెంటల్స్ అర్థం కావాలంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య ప్రత్యక్ష బోధనే సరైన మార్గం. ఆన్లైన్లో అది లోపించడంతో చాలా మంది విద్యార్థులు పాఠాలు వినడం పూర్తయిన వెంటనే కలిగే అనుమానాలను నివృత్తి చేసుకోలేకపోతున్నారు. పాఠాలు పూర్తయిన తరవాత వాట్సా్పలో వచ్చే ఫొటోలను చూసి నోట్సు రాసుకోవడం విద్యార్థుల కళ్లకు ఇబ్బందిగా మారుతోందని కొంత మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
సైన్స్ పాఠాల విషయంలోనూ విద్యార్థులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లేబరేటరీల్లో ప్రయోగాత్మకంగా నేర్పించాల్సిన కాన్సె్ఫ్టలను ఉపాధ్యాయులు ఆన్లైన్లో అర్థమయ్యేలా బోధించలేకపోతున్నారు. మరో వైపు ఆన్లైన్ విద్య పాఠశాల స్థానాన్ని భర్తీ చేయదనే అభిప్రాయాలు సర్వేలో వ్యక్తం అయ్యాయి. పాఠశాలలోని తరగతి గదుల్లో నేర్చుకుంటున్న విద్యకు, ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నదానికి చాలా వ్యత్యాసం ఉంటున్నట్లు స్పష్టమైంది. ఆన్లైన్ బోధన సందర్భంగా తలెత్తే సందేహాలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియకపోవడం, పాఠాలు చెబుతున్నప్పుడు నోట్సు రాసుకోకుండా అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వే వెల్లడించింది.
Courtesy Andhrajyothi