– 2.5 లక్షల మంది పరిస్థితి దయనీయం
– చిన్న గదుల్లో కిక్కిరిసిపోయి జీవనం
గాంధీనగర్ : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన 2.5 లక్షల మంది ఒడిశా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉండే విధంగా వీరంతా కిక్కిరిసిన గదుల్లో నివసిస్తున్నారు. ఆదాయం లేకపోవడంతో.. సరైన ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ కార్మికుల్లో అధికులు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన వారు. వీరంతా సూరత్లోని వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. తమ ప్రాణాలను రక్షించాలంటూ ఒడిశా డిజాస్టర్ మైగ్రేషన్ మ్యాపింగ్ ఫర్ ఇంటర్వెన్షన్ (ఓడీఎంఎంఐ) అనే సామాజిక సంస్థకు మేసేజ్లు పంపిస్తున్నారు. ఓడీఎంఎంఐ సభ్యురాలు, పర్యావరణ కార్యకర్త ప్రఫుల్లా సమంత మాట్లాడుతూ.. గుజరాత్లోని సంబంధిత వ్యక్తుల ద్వారా..వారి దయనీయ పరిస్థితిని తెలియజేశారని చెప్పారు. ఈ అంశాన్ని ఒడిశా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
ఈ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వసతి అని సూరత్లోని లేబర్ కోర్టు న్యాయవాది పీతాంబర్ ప్రధాన్ అన్నారు. సాధారణంగా 12 మంది కార్మికులు కలిసి.. చిన్న చిన్న గదుల్లో ఉంటారని, పరిశ్రమల్లో షిప్టుల వారీగా పనిచేస్తారని, ఆ సమయంలో ఎక్కువ మంది గదుల్లో ఉండే అవకాశం ఉండదని చెప్పారు. లాక్డౌన్తో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని, భౌతిక దూరం పాటించడం అసాధ్యమని పీతాంబర్ ప్రధాన్ అన్నారు. ఈ సమయంలో తమలో ఒక్కరికి వైరస్ సోకినా.. పరిస్థితి చేయిదాటిపోతుందని కార్మికుల్లో ఒకరైన నిరంజన్ మహాపాత్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో గుజరాత్ ప్రభుత్వం తమకు పాఠశాలల్లో, కళాశాలల్లో వసతి సదుపాయం కల్పించాలని కోరారు.
Courtesy: NT