వడ్డీ రేటు తగ్గిస్తే పెట్టుబడులు పెరగటానికి దారి తీస్తుందనీ, దానితో సమిష్టి డిమాండ్ పెరిగి ఉత్పత్తి, ఉద్యోగితలు పెరుగుతాయనే ఆలోచనతో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటును తగ్గించాన్న విధాన నిర్ణయం తీసుకుంది. దానితో డిపాజిట్దార్లకు ఇచ్చే వడ్డీని కూడా తగ్గించ వలసి ఉంటుంది.
మొత్తం మీద దీనితో ప్రతికూల ఆదాయ పంపిణీ జరుగుతుంది. సమాజాన్ని మొత్తంగా తీసుకున్నప్పుడు కార్మిక వర్గం నుంచి మధ్య తరగతి దాకా పెన్షన్ నిధులకు చెందిన మొత్తాలను సమకూర్చిన వారితో సహా అప్పు ఇచ్చినవారి ఆదాయం ఉత్పాదక రంగంలో పెట్టుబడులు వచ్చినా, రాకున్నా కార్పొరేట్ రంగానికి తరలుతుంది. కాబట్టి వడ్డీ రేటును తగ్గిస్తే ఆదాయ పంపిణీ కార్మిక వర్గం, మధ్య తరగతి ప్రజల (అప్పులు ఇచ్చినవారు) నుంచి కార్పొరేట్ రంగానికి (అప్పు తీసుకునేవారు) అనుకూలంగా మారుతుంది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు నామమాత్రపు రేట్లను కూడా దాటి ప్రతికూల మార్గం పట్టాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో ఇటువంటి దృగ్విషయం మనకు కనపడదు. నగదును వాడే ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను కుదించ టానికి పరిమితులు ఉంటాయి. ఎందుకంటే వడ్డీతో ప్రమేయం లేకుండా ప్రజలు తమ వద్ద నగదును ఉంచుకుంటే వారికి బ్యాంకుల లోను, ఇతర ఆర్థిక సంస్థలలోను సున్నా కంటే ప్రతికూలమైన వడ్డీ రేటుతో డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ డిపాజిటర్లకు ప్రతికూలమైన వడ్డీ రేటు కాకుండా సానుకూలమైన వడ్డీ రేటు ఇవ్వాలంటే వడ్డీ రేట్లను కుదించటానికి బ్యాంకులకు పరిమితులుంటాయి. అయితే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక కార్యకలాపాలను పునరుత్తేజపర్చటానికి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో వడ్డీ రేట్లను కుదిస్తున్నారు.
ఒకవేళ ప్రభుత్వాలు విత్త సంబంధిత చర్యలను చేపట్టగలిగితే వడ్డీ రేట్లను కుదించవలసిన అవసరం ఉండేదే కాదు. కానీ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విత్త లోటును (యూరోపియన్ యూనియన్ దేశాలకు స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతం పరిమితి విధించారు), పెట్టుబడిదారులపై పన్ను విధించటాన్ని (కార్మికులపై పన్నులను వేస్తే అది సమిష్టి డిమాండ్ను విస్తృతం చేయటానికి సహాయ పడదు) అంగీకరించనందునే విత్త సంబంధిత చర్యలను ప్రభుత్వాలు తీసుకోవు. అందువల్లనే సమిష్టి డిమాండ్ను బలోపేతం చేయటానికి ద్రవ్య విధానమే అంతిమంగా మిగిలిన ఏకైక సాధనం అయింది.
భారత దేశంలో కూడా నిరాశా, నిస్ప ృహలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంకు ఐదు సార్లు వడ్డీ రేటు తగ్గించినా ఫలితం ఏమీ కనపడటం లేదు. అంతిమంగా ప్రభుత్వం కొన్ని విత్త సంబంధిత చర్యల్ని తీసుకోవటానికి సిద్ధపడి కార్పొరేట్ పన్ను రాయితీలను ప్రకటించింది. ఇది వాస్తవంలో నష్టాన్ని మోసుకు వస్తుంది. అలా ఇచ్చిన రాయితీల కారణంగా తగ్గిన ఆదాయాన్ని ఎంత వరకైతే కార్మికులపై పన్నులు వేసి పూడ్చుతారో (లేక వారికి చేస్తున్న బదిలీలను తగ్గిస్తారో) ఆ మేరకు సమిష్టి డిమాండ్ కుదింపునకు గురవుతుంది.
ఐరోపా లోను, ఇతర చోట్లా ద్రవ్య విధాన సాధనం పూర్తిగా మొద్దుబారింది. ‘కొన్ని దేశాలలో బలహీనమైన వృద్ధి, మిగిలిన దేశాలలో అసలు వృద్ధి లేకపోవటమో లేక వృద్ధి రేటు ప్రతికూలంగా ఉండటమో జరుగుతుండ టంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘ఏక కాలంలో స్తబ్దత’ ఏర్పడిందని ఫైనాన్షియల్ టైమ్స్ (అక్టోబర్ 14) కూడా రాసింది.
కార్పొరేట్ పెట్టుబడి వడ్డీ రేట్లకు స్పందించదనే వాస్తవం ద్రవ్య విధాన సాధనాన్ని మొద్దుబారేలా చేసింది. మార్కెట్ పెరుగుదల ఉన్నప్పుడు ఆశించినంతగా నికర పెట్టుబడులు వస్తాయి. మార్కెట్లో స్తబ్దత నెలకొన్నదనే భావన వుంటే వడ్డీ రేటు ఎంతగా తగ్గించినా, అంటే కార్పొరేట్ రంగం ఫైనాన్స్ కోసం చేసే వ్యయాన్ని ఎంతగా తగ్గించినా నికర పెట్టుబడులు ఏమాత్రం రావు. అయితే ద్రవ్య విధాన నిర్ణేతలు వడ్డీ రేట్లను తగ్గించటం వల్ల ఏర్పడే ఆస్తుల ధరల బుడగలతో మరో విధమైన ఉపయోగం ఉందని అనుకుంటుండవచ్చు. సదరు బుడగ వల్ల ఆస్తులను కలిగివున్నవారు ఎంతగా సంపన్నులం అయ్యామని (బుడగ పతనం దాకా) అనుకుంటున్నారో అంతగా వారు బహిరంగంగా కనిపించే వ్యయం చేస్తారు. ఆ విధంగా సమిష్టి డిమాండ్కు ప్రేరకంగా మారతారు.
అయితే ఇలా చేసే ఊహ ప్రమాదకరమైంది. ఒకవేళ సంపద పెరిగిందనే భావన వల్ల వినిమయం పెరుగు తుందనుకుంటే అందుకు సమయం పడుతుంది. అంతే కాకుండా 2008లో సంభవించిన సంక్షోభం తరువాత వాస్తవ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాల స్థాయి పెంచ టానికి ప్రేరకంగా ఆస్తుల బుడగ మార్గం ప్రభావశీలతను కోల్పోయింది. ఏమైనప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను పెంచటానికి ప్రేరకంగా సంక్షేమ పథకాలపై ప్రభుత్వ వ్యయాన్ని మరింతగా పెంచటం వంటి చర్యలతో పోల్చినప్పుడు ఇదేమాత్రం ఆచరణీయం కాదు.
2006 నుంచి ‘ప్రధాన ఆర్థిక సూచికలు’గా భావిస్తున్న సూచికలు అట్టడుగు స్థాయికి చేరటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకున్న కాలం మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగమనంలో ఉన్నదన్న వాస్తవం సుదీర్ఘ కాలం వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి సూచిక. ప్రస్తుత భయాందోళనలకు కారణమైన స్తబ్దత, మాంద్యం ఆ సంక్షోభం పర్యవసానాలే. నిజానికి అంతర్జాతీయ ద్రవ్యసంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. ‘2019లో 90 శాతం ప్రపంచంలో వృద్ధి మందగమనంలో ఉంటుందని మేం అనుకుంటున్నాము’ అని ఆమె ప్రకటించారు. ఇప్పటి దాకా సంక్షోభానికి ఆవల వున్న జర్మనీ లాంటి దేశం ప్రస్తుతం మాంద్యం పరిస్థితి ఎదుర్కొంటోంది.
ప్రస్తుత మందగమనానికి అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంబంధమైన ఘర్షణ కారణమని బూర్జువా వ్యాఖ్యాతలు పేర్కొంటు న్నారు. లాభాకాంక్షతో పెట్టుబడులు పెట్టడంలో జంతు స్వభావం పోటీ పడడంతో ఈ పరిస్థితి వచ్చిందని వీరు అంటున్నారు. ఈ మాంద్యాన్ని ద ఎకనామిక్ టైమ్స్ పత్రిక ‘పడిపోతున్న ఆర్థిక స్థైర్యానికి చిహ్నం’గా అభివర్ణించింది.
అయితే సంక్షోభాన్ని వ్యవస్థీకృతంగాను, పర్యవసానంగా సుదీర్ఘమైనదిగాను కాకుండా కేవలం ఘటనలుగా వివరించే ప్రయత్నం రెండు ప్రధాన విషయాలను విస్మరిస్తుంది. 2008 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందనేది మొదటిది. నిజానికి ప్రపంచం లోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని నేలపై ఎగిరిపడే బంతితో పోల్చటం సరైనదే. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధిత ఘర్షణలు సంభవించటం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సుదీర్ఘ సంక్షోభానికి ప్రతిబింబమే అనేది రెండవది. ట్రంప్ అనుసరిస్తున్న క్రియాశీలక రక్షిత విధానం అమెరికాకు చేరుతున్న దిగుమతులను తగ్గించి అమెరికాలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి పెంచటానికి, ఇతర దేశాలను ఒత్తిడి చేసి అమెరికా సరుకులకు మార్కెట్ను అందించటానికి ఉద్దేశింపబడిందే.
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యద్ధానికి, పర్యవసానంగా ‘ఆర్థిక స్థైర్యం పడిపోవటానికి’ కారణమైన వర్తమాన సంక్షోభం మూలాలు ట్రంప్ మొరటు ధోరణిలో లేవు. ఆదాయ అసమానతల తీవ్రతను ఘోరంగా పెంచే ధోరణులు నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాయి. ప్రత్యేకమైన దేశాల లోను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోను ఉండే సమిష్టి డిమాండ్ స్థాయిని ఈ ధోరణుల వైరుధ్య పూరితంగా ప్రభావితం చేస్తాయి. అమెరికాలో అనేక ప్రభావశీలమైన బుడగల పరంపర కారణంగా 2008కి ముందు కాలంలో ఈ వైరుధ్యపూరిత ప్రభావం అదుపులో ఉంది. అయితే అవి పతనం కావటంతో నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో గల అధికోత్పత్తి అనే మౌలిక ధోరణి బయటకు వచ్చింది.
అటువంటి సంక్షోభం ముందుగా అత్యంత అధిక విలువలను ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులను దెబ్బ తీస్తుంది. అమెరికా, యూరో జోన్ దేశాలు ఈ సంక్షోభానికి మొదటి సమిధలుగా మారాయి. తూర్పు, దక్షిణ ఆసియా దేశాలలో తక్కువ వేతనాలు ఉండటం వల్ల ప్రపంచంలోని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కార్యకలాపాలను ఔట్సోర్స్ చేయటం జరిగింది. ఈ దేశాలు సంక్షోభాన్ని మొదట్లో తట్టుకున్నట్టే కనపడ్డాయి. అయితే సంక్షోభం కొనసాగటం, ఇతర దేశాలను దెబ్బ తీసైనా లాభపడాలనే ట్రంప్ అనుసరిస్తున్న విధానం వల్ల నేడు మనం ప్రపంచ వ్యాప్తంగా నిజమైన మాంద్యం దిశగా పయనిస్తున్నాం. దీనితో తీవ్రమైన వర్గ పోరాటాల, బలమైన సామాజిక మార్పుల శకం ఆరంభం అవుతుంది.
– ప్రభాత్ పట్నాయక్