- వాదనలకు దిగిన ఇద్దరు సీఎంలు
- జోక్యం చేసుకుని సర్ది చెప్పిన కేంద్ర మంత్రి
- పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై కేసీఆర్ ఆగ్రహం
- తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి
- ఎక్కడ అనుమతులున్నాయని ప్రశ్నించిన జగన్
- ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యాయమా అని పెదవివిరుపు
- కృష్ణా ప్రాజెక్టులపై కేంద్ర పర్యవేక్షణ ఉండాలి
- ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలన్న కేంద్రం
- సరేనన్న ఇద్దరు ముఖ్యమంత్రులు
- రాష్ట్రాలు కోరితే గోదావరిపై ట్రైబ్యునల్ ఏర్పాటు
- గోదావరి-కృష్ణా బోర్డుల పరిధి ఖరారుకు నిర్ణయం
- కృష్ణా బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు తరలింపు
- గంటలపాటు సాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
హైదరాబాద్, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం వాడివేడిగా సాగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పలుమార్లు పరస్పరం విమర్శలకు దిగినట్లు సమాచారం. దీంతో, ఆయా సందర్భాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి.. ‘‘ఈ పద్ధతేం బాగోలేదు. ఇలా అయితే ఎలా ముందుకెళ్లగలం? ఏదైనా అంశంపై ముందు నేను మాట్లాడిన తర్వాత మీరు మీ వాదనలు చెప్పండి’’ అని సూచించినట్లు తెలిసింది. కాగా.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) సమర్పించడానికి ఇద్దరు సీఎంలూ అంగీకరించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నుంచి, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ నుంచి.. ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో.. కృష్ణా, గోదావరి నదీ జలాలపై హక్కులు, వాటాల గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను, వాదనలను వినిపించారు. సమావేశంలో ఎజెండా అంశాల వారీగా కాకుండా ఖరారు చేసిన నాలుగు ఎజెండాలపై కేంద్రం ఒకేసారి తన అభిప్రాయాలను సీఎంల ముందు ఉంచింది.
కేంద్రం తన అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. కృష్ణ, గోదావరి నదీ జలాల పంపిణీకి ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయకుండా మీరు ఏది చేసినా వృథానే. అన్ని సమస్యలకు ట్రైబ్యునళ్ల ఏర్పాటే పరిష్కారం’’ అని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించి, పట్టు పట్టారు. ఏ ఎజెండాపై చర్చిస్తున్నా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గుర్తు చేశారు. దీంతో ఈ అంశంపై వినతి పత్రం పంపిస్తే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. ఆ లేఖను బుధవారమే పంపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై జగన్ ఏమీ మాట్లాడలేదని తెలిసింది.
కాగా.. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులతోపాటు కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులనూ కేంద్రమే స్వాధీనం చేసుకుని వాటిని నిర్వహించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఇరు రాష్ట్రాలకూ నీటివినియోగంలో సమన్యాయం జరుగుతుందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తిని తీర్చలేని పరిస్థితి ఎదురవుతుందని, అందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఇది సాధ్యపడకపోతే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, సాగర్ కుడి కాలువను ఆంధ్రకు స్వాధీనపరచాలని కోరినట్లు తెలిసింది.
అనుమతులే లేవు..
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడానికి ఏపీ ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకే ఏ అనుమతులూ లేవని, అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి ఏపీ సీఎం జగన్.. ‘‘అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది’’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
దీనికి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ ఉన్నాయని, ఆ ప్రాజెక్టు నది బేసిన్లో ఉందని, కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్ బయటికి నీళ్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇలాగైతే… తాము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తామని అన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న షెకావత్.. న్యాయం, నిబంధనలు రెండు రాష్ట్రాలకూ సమానమేనని, చట్ట ప్రకారమే అన్నీ జరగాలని పేర్కొన్నట్లు తెలిసింది.
డీపీఆర్లివ్వండి..
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వాదనలు విన్న కేంద్ర మంత్రి.. ప్రాజెక్టుల డీపీఆర్లు అందిస్తే తాము అన్నీ పరిశీలిస్తామని వారికి సూచించారు. అందుకు ఏపీ ముఖ్యమంత్రి అంగీకరించారు. దాంతో కేసీఆర్ కూడా ప్రాజెక్టుల డీపీఆర్లను సమర్పించడానికి అంగీకరించారు. కాగా.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య మండళ్ల పరిధిని ఖరారు యత్నాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు పరిధిని ఖరారు చేసినా ఏం లాభం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఆ అధికారం కేంద్రానికి ఉందని షెకావత్ అభిప్రాయపడడంతో బోర్డుల పరిధిని ఖరారు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది.
అలాగే గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు తరలించే నీటి కోటాపై కూడా అపెక్స్లో చర్చ జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పట్టిసీమ నుంచి తరలిస్తున్న గోదావరి నీటిలో 45 టిఎంసీలు తమకు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో.. ‘‘కొత్త ట్రైబ్యునల్స్ను ఏర్పాటు చేస్తున్నందున, ఈ నీటి వాటాలపై అవే నిర్ణయం తీసుకుంటాయి. నీటి కేటాయింపుల్లో రాష్ట్రాల మాదిరిగానే కేంద్రానికి కూడా ఏలాంటి అధికారం లేదు’’ అని కేంద్ర మంత్రి భేటీలో సూచించినట్టు తెలిసింది.
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు
కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డుల పరిధులు, అధికారాలను నిర్థారిస్తూ నోటిఫికేషన్ జారీకి నిర్ణయం బోర్డులకు అధికారాలను నిర్ధారిస్తూ నోటిఫికేషన్ను జారీ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే జగన్ ఇందుకు సానుకూలంగా స్పందించారు. మరో పక్క బోర్డులకు అధికారాలను అప్పగించే అధికారం కేంద్రానికి ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దాంతో బోర్డులకు అధికారాలను అప్పగించాలని అపెక్స్లో నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్, వాటి ఆధారంగా నిర్మించిన పలు ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది.
కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు ఏపీకి!
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన గోదావరి బోర్డును హైదరాబాద్ కేంద్రంగా, కృష్ణా బోర్డును విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో ఈ రెండు బోర్డులనూ హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇందుకు తెలంగాణ కూడా అంగీకరించడంతో అపెక్స్లో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు కృష్ణా బోర్డును త్వరలోనే ఏపీకి తరలించనున్నారు.
డీపీఆర్ల సమర్పణతో కొత్త చిక్కులు !
అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేర ఇరు రాష్ట్రాలూ తమ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) బోర్డులకు, కేంద్రానికి సమర్పిస్తే.. కొన్ని సాంకేతిక ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. కృష్ణా బేసిన్లో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. ఏపీ ప్రాజెక్టులకు కూడా ఇదే వర్తించనుంది.
ఇలా నీటి కేటాయింపులు లేకుండా, ప్రాజెక్టులను నిర్మించడానికి ఇటు బోర్డులు కానీ, అటు కేంద్రం కూడా చట్ట ప్రకారం అనుమతులను ఇచ్చే అవకాశం ఉండదు. దాంతో ఇవి అక్రమ ప్రాజెక్టులుగా గుర్తింపబడతాయి. అలాంటి ప్రాజెక్టులకు రుణాలు పొందడం ఇబ్బంది అవుతుంది. అలాగే కేంద్రం కానీ, బోర్డు కానీ కొర్రీలను వేయాలనుకుంటే.. వెంటనే ఈ ప్రాజెక్టులను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే ఇరు రాష్ట్రాలూ ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్టులకు సంబంఽధించిన డీపీఆర్లను బోర్డులకు సమర్పించలేదు.
ప్రాజెక్టుల డీపీఆర్ల సమర్పణ
ఈ నిర్ణయం మేరకు.. తెలంగాణ ఫిర్యాదు చేసిన రాయలసీమ లిప్టు వంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను ఏపీ ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఏపీ ఫిర్యాదు చేసిన.. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం మూడో టిఎంసీ, సీతారామ వంటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను తెలంగాణ ప్రభుత్వం బోర్డులకు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారు.
ప్రాజెక్టుల వారీగా కృష్ణా నదీ జలాల వినియోగంపై ట్రైబ్యునల్కు నిర్ణయాధికారం
ప్రస్తుతం కృష్ణా బేసిన్లో నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా లేవు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టిఎంసీల నీటిలో ఏపికి 512 టిఎంసీలు, తెలంగాణకు 299 టిఎంసీలను కేటాయించారు. ఇప్పుడు.. ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించడానికి వీలుగా ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ విషయంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలంటే.. ఈ కేసును ఉపసంహరించుకోవాల్సి ఉంది. అందుకు కేసీఆర్ అంగీకరించారు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.
గోదావరి జల వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు
గోదావరి బేసిన్లో జల వివాదాల పరిష్కారం, నీటి కేటాయింపుల కోసం కొత్తగా ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన ఏడాదిలోగా ట్రైబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ రేపే తమ వినతిని పంపుతామని చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం నిర్వహించడం ఇది రెండో సారి. అలా కాకుండా ఇకపై ఏటా దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. అలాంటిది దాని సామర్థ్యం పెంచడం ఏమిటి? కాళేశ్వరానికి అన్ని అనుమతులూ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు నది బేసిన్లో ఉంది. కానీ రాయలసీమ ప్రాజెక్టు ద్వారా నది బేసిన్ బయటికి నీళ్లు తరలిస్తున్నారు. ఇలాగైతే… మేము కూడా జూరాల దిగువలో భారీ బ్యారేజిని నిర్మించి, రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాం.
అనుమతులు లేకుండానే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులు చేపడుతున్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు లేవు. మాకో న్యాయం వాళ్లకో (తెలంగాణకు) న్యాయమా? తెలంగాణకు ఏ నిబంధన వర్తిస్తుందో మాకూ అదే వర్తిస్తుంది.
Courtesy Andhrajyothi