- 42 శాతం నుంచి 33 శాతానికి తగ్గింపు!
- మందగమనంతో పన్ను వసూళ్లు తగ్గుముఖం
- కేంద్ర పథకాల్ని రాష్ట్రాలూ వాడుకుంటున్నాయి
- తగ్గించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు
- 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర సర్కారు వినతి
- అదే జరిగితే రాష్ట్రాలకు పెను ప్రమాదమే
- అనేక ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం
కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు భారీగా తగ్గబోతున్నాయా? సామాజిక, ఆర్థిక రంగాల్లో భారీ మార్పులను తెస్తున్న కేంద్రం.. రాష్ట్రాలకు మరో పెద్ద ఝలక్ ఇవ్వనుందా? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది.
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రస్తుతం కేంద్ర పన్నుల్లో ఇస్తున్న వాటా శాతాన్ని గణనీయంగా తగ్గించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం మెమొరాండం ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం ఉమ్మడి సంచయం నుంచి రాష్ట్రాలకు బదలాయిస్తున్న 42 శాతం వాటాలో.. నిర్దిష్టంగా ఎంత మేరకు తగ్గించాలనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ, 33 శాతానికి తగ్గించాలని కోరినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. మరిన్ని నిధులివ్వాలని, వాటా పెంచాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్రం తగ్గించాలని కోరడం అనూహ్య పరిణామంగా చెబుతున్నారు.
ఇందుకేనా?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించడానికి.. జీడీపీ వృద్ధి భారీగా తగ్గడం, ఆర్థిక మందగమనం, తగ్గుతున్న పన్ను వసూళ్లను కారణాలుగా కేంద్రం చెబుతున్నట్లు తెలిసింది. ఈ సూచనను ఆర్థికసంఘం అంగీకరిస్తే అది రాష్ట్రాలకు శరాఘాతమే. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దదెబ్బే. ఎన్నికల హామీలను ప్రభుత్వాలు నెరవేర్చుకోలేని పరిస్థితి తప్పదు.
ఇచ్చినట్టే ఇచ్చి..
ఐదేళ్ల కిందటే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు భారీగా పన్నుల వాటాను పెంచింది. 32ు ఉన్న వాటాను ఏకంగా 42 శాతానికి పెంచిన కమిషన్ కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కోత విధించింది. 42 శాతాన్ని 50 శాతానికి పెంచాలన్నది రాష్ట్రాల తాజా డిమాండ్. కానీ కేంద్రం 13వ ఆర్థిక సంఘ పరిస్థితి నాటికే తిరోగమిస్తుందని ఆర్థిక నిపుణులు సైతం ఊహించలేదు. కేంద్రం చేసిన విజ్ఞప్తిని యథాతథంగా అంగీకరించబోమని ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ చెప్పారు. ‘‘బదలాయుంపు పరిమితి ఎంత అనేది అన్ని అంశాలనూ పరిశీలించి నిర్ణయిస్తాం. కేంద్రంతో పాటు 30 విజ్ఞాపనలు మా వద్ద ఉన్నాయి. అన్నీ చూసి సమతూకంతో ఓ నిర్ణయానికి వస్తాం’’ అని సింగ్ తెలిపారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్లకు కేంద్ర-రాష్ట్రాల పన్నుల వాటాను కమిషన్ నిర్ణయిస్తుంది.
దెబ్బ మీద దెబ్బ..?
ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరిచే అనేక చర్యలను కేంద్రం తీసుకొంటోందా.. అనే అభిప్రాయాలు కలుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు.. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎ్సఎ్స)పై సమీక్ష జరిపే బాధ్యతను కేంద్రం నీతి ఆయోగ్కు అప్పగించింది. నీతి ఆయోగ్ కమిటీ… సీఎ్సఎ్సలకు రాష్ట్రాలు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంటును బాగా పెంచేయాలని సిఫారసు చేసింది. దీంతో .. నేషనల్ హెల్త్ మిషన్ లాంటి పథకాలకు అప్పటిదాకా తమ వాటాగా 25 శాతం ఇస్తూండేవి. ఆ తరువాత ఇపుడు 40 శాతం ఇవ్వాల్సి వస్తోంది. ఇక సెస్లు, సర్ఛార్జిల వసూళ్లలో 2015లో 4.2 శాతం మాత్రమే కేంద్రానికి వెళ్లేది. అది కాస్తా ఇపుడు 15 శాతానికి పెరిగింది. ఈ మధ్యే కేంద్ర మరో బాంబు పేల్చింది. జాతీయ, సరిహద్దుల భద్రతను రాష్ట్రాలు కూడా భరించాలని, రక్షణ బాధ్యతను పంచుకోవాలని అంటూ పదిహేనో ఆర్థిక సంఘ పరిశీలనాంశాల్లో అది కూడా చేర్చింది. ఈ సీఎ్సఎ్సలకు నిధుల కోత, జాతీయ స్థాయిలో చేపట్టే సంక్షేమ పథకాలకు రాష్ట్రాలు కప్పం కట్టడం, జాతీయ భద్రతను కూడా రాష్ట్రాలే భరించడం.. ఇవన్నీ రాష్ట్రాలకొచ్చే నిధుల్లో కోతకు సంకేతాలు’’ అని ఓ విశ్లేషకుడు వివరించారు. ఇది గనక జరిగితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టడం కష్టమవుతుంది. ఆర్థిక సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదేనా లక్ష్యం..?
కేంద్రం అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ అమలు చేస్తోంది. ఇందులో కొన్ని రాష్ట్ర స్థాయుల్లో ఇప్పటికే అమలవుతున్నాయి. ఉదాహరణకు రైతులకు ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ లాంటిది. అటు కేంద్రం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారానూ, రాష్ట్రం నుంచి రైతు బంధు పథకం ద్వారానూ కూడా అన్నదాతకు డబ్బు అందుతోంది. దీనిని ఒకదానికే కుదించాలన్నది కేంద్ర యత్నంగా చెబుతున్నారు. వైద్య, విద్యారంగాల్లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలన్నింటినీ క్రోడీకరించి ఒక వ్యక్తికి ఒక వైపు నుంచే (కేంద్ర లేదా రాష్ట్రం) లబ్ధి చేకూరేట్లు చేయాలని కేంద్రం ఎప్పటినుంచో యోచిస్తోంది. ఆ దిశగానే ఇపుడు కదులుతోందని చెబుతున్నారు. సీఎ్సఎస్ పథకాల రద్దు త్వరలోనే పూర్తిస్తాయిలో జరగవచ్చని కూడా అంటున్నారు.
రాష్ట్రాలకు గడ్డుకాలమే..?
జీఎస్టీ వసూళ్లు, ఈ మధ్య కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి రాష్ట్రాలకు రాబోయేది ఆర్థిక గడ్డుకాలమేనని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో రాష్ట్రాల వస్తు సేవల పన్ను(ఎస్జీఎ్సటీ), కేంద్రం పన్నుల్లో వాటా బదలాయింపు కీలకమవుతాయి. 2019-20 బడ్జెట్ అంచనాలను ఈ రెండూ చేరుకోలేవని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయి. జీఎస్టీ వ్యవస్థ తెచ్చినందుకు (కేంద్రం) చెల్లిస్తున్న నష్టపరిహారంలో కూడా కోత పడిందని తెలిపాయి. ఇక కేంద్ర పన్నుల వాటాలో.. సెస్లు, సర్ఛార్జిలు లేవని, ఇవి కూడా ఉమ్మడిగా పంపిణీ కావాలని, అలా జరగకపోవడం వల్ల 42ు వాటా రావాల్సినది కేవలం 35-36ు నిధులే అందుతున్నాయని నిపుణులు వివరించారు.
–సెంట్రల్ డెస్క్
ఆగస్టు నుంచి ఆగిన జీఎస్టీ వాటా
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల నుంచి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం ఆలస్యంగా ఇస్తున్నది. దీని ప్రభావం రాష్ట్రాల బడ్జెట్ వ్యయంపై పడుతోంది. రాష్ట్రాల బడ్జెట్ వ్యయం గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కేవలం 8.7 పర్సంటేజీ పాయింట్లు మాత్రమే పెరిగిందని ఒక అధ్యయనంలో తేలింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి సగంలో.. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ప్రణాళిక వ్యయం ఆయా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల్లో కేవలం 37.6 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి కూడా లక్ష కోట్ల మార్కును దాటలేదు. 95,000 కోట్లకు దిగువనే ఉన్నాయు. పన్నేతర ఆదాయం వసూలు కూడా మందగించింది. తమకు ఇవ్వాల్సిన జీఎస్టీ వాటా నిధులను కేంద్రం ఆగస్టు నుంచి ఇవ్వకుండా తాత్సారం చేస్తుండడంతో రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్, కేరళ తదితర ఐదు రాష్ట్రాలు కేంద్రంపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించాయి.
Courtesy AndhraJyothy…