కొవిడ్ కొమ్ములు వంచుతున్న వయోవృద్ధులు
మహమ్మారి బారిన పడినా ధైర్యంగా పోరాటం
75 ఏళ్లు దాటినవారూ ఆరోగ్యంగా ఇళ్లకు
హైదరాబాద్, అమరావతి: ఇంట్లో పెద్ద వయసు వారెవరికైనా జబ్బు చేస్తే ఆందోళనే. ప్రమాదకరమైనదని తెలిస్తే మరింత దిగులు. అసలు తన వద్దకు ఎవరూ కనీసం పలకరించడానికి కూడా రారని గ్రహిస్తే రోగి మానసికంగా కుంగిపోతారు. ప్రస్తుతం కొవిడ్ బాధితులు ఇదే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో ఒంటరిగా ఉండడం దుర్భరంగా అనిపిస్తోందని వారు చెబుతున్నారు. యువ, మధ్య వయస్కులు స్మార్ట్ఫోన్ కాలక్షేపంతో గడిపేస్తుంటారు. వయోవృద్ధులకు మాట్లాడే తోడు కావాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో తమకు తామే ధైర్యం చెప్పుకోవాల్సిన స్థితి.
జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను చవిచూసిన తాము.. ఈ క్లిష్ట పరిస్థితులను సవాలుగా స్వీకరించామని, తమ ధైర్యమే రక్షగా నిలిచిందని చెబుతున్నారు కొవిడ్ నుంచి కోలుకున్న వృద్ధులు. తాము మళ్లీ తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరామంటే అందుకు వైద్యసిబ్బంది సేవలే కారణమంటూ కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 70 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికులు కరోనా మహమ్మారిని ఎదిరించి విజయం సాధించారు. అటువంటి వృద్ధుల స్ఫూర్తిదాయక విజయగాథలివి..
* తెలంగాణలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 70 ఏళ్లు పైబడినవారు సుమారు 3.2 శాతం మంది.
* వీరిలోనూ 70-79 ఏళ్ల మధ్యవయస్కుల్లో 80.8 శాతం మంది, 80-89 ఏళ్ల వయసు వారిలో 83.3 శాతం మంది కోలుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈమె పేరు బి.మోహనమ్మ. వయసు 105 ఏళ్లు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు. వారి ప్రాంతంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే, ఇంట్లో ఆమె ఒక్కరికే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జులై 13న కర్నూలు జీజీహెచ్లో చేర్చారు. ఆమె మనోధైర్యంతో 12 రోజుల్లోనే వ్యాధిని గెలిచి… ఇంటికి చేరుకున్నారు. ‘ఆసుపత్రిలో ఉన్నప్పుడు నాకు తొలి నుంచీ అలవాటైన ధ్యానం, ప్రాణాయామం బెడ్పైనే చేశా. వైద్యులు, నర్సులు ‘భలే ధైర్యంగా ఉన్నావ’ని ప్రశంసించేవారు. ప్లేగు వ్యాధి ప్రభావాన్ని నేరుగా చూసినదాన్ని. చిన్నతనం నుంచీ కొర్రలు, జొన్న సంగటి, రాగి ముద్ద తినడం అలవాటు. కాలం మారడంతో ఇప్పుడు ఒకపూట వరి అన్నం తింటున్నా. ఆహారపు అలవాట్లు, ధ్యానం, ప్రాణాయామం వల్ల కరోనా నుంచి కోలుకున్నానని చెప్పగలను’ అని తెలిపారు మోహనమ్మ. ‘రోజూ ఇంట్లో ఓపిక ఉన్నంత వరకు అమ్మ కనీసం ఆరగంటసేపు నడుస్తుంది. ఆమె క్రమశిక్షణ మా అందరికీ ఆదర్శం’ అని ఆమె కుమారుడు జయదాస్(62) చెప్పారు.
మనో బలంతో మరో జన్మ
హైదరాబాద్కు చెందిన ఆమె వయసు 80 ఏళ్లు. ఇంట్లో కొడుకు, కోడలు, మనవలతో హాయిగా వెళ్లిపోయేది కాలం. ఒకరోజు జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా వచ్చిందన్నారు. ఐసీయూలో ఉంచారు. అక్కడంతా వింత వాతావరణం. పిలుద్దామన్నా కానరాని మనుషులు.. అప్పుడప్పుడూ సిబ్బంది వచ్చినా, ముసుగులతో ఉండేవారు. డాక్టరెవరో, నర్సులెవరో తెలియదు. మాట్లాడితే తప్ప పురుషులో మహిళలో కూడా తెలియదు. దూరం నుంచే పలకరించి ధైర్యం చెప్పేవారు. అప్పుడప్పుడూ ఆమె కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో దూరం నుంచే మాట్లాడించేవారు. ‘ఇంతకు ముందు ఆసుపత్రిలో ఉంటే పక్కనే ఉండే మీరు ఇప్పుడెందుకు రావడం లేద’ంటూ నిలదీసేవారామె. ఎవరూ తన వద్దకు రాలేరనే విషయాన్ని గ్రహించాక.. తనకు తానే ధైర్యం తెచ్చుకున్నారు. అక్కడికి వచ్చే వారితో చొరవగా మాట్లాడుతూ, తనకు తానే కాలక్షేపాన్ని సృష్టించుకున్నారు. ఆహారం రుచించకపోయినా… బలవంతంగానైనా తినేవారు. ఆమె మనో బలమే గెలిచింది. కొద్దిరోజుల్లోనే పూర్తిగా కోలుకొని ఇంటికి చేరింది.
జూన్ 19న నాకు జ్వరం వచ్చింది. జూన్ 24న కొవిడ్ పరీక్ష చేయిస్తే పాజిటివ్ వచ్చింది. గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో బాగా చూసుకున్నారు. కానీ నాకు మాత్రం నా బిడ్డ, అల్లుడితో మాట్లాడాలని ఉండేది. అక్కడి సిబ్బంది రోజూ వీడియో కాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడించేవారు. దీంతో కొంత ధైర్యం వచ్చింది. ‘75 ఏళ్ల జీవితంలో అన్నీ చూసిన వాణ్ని. భయమెందుకు?’ అనే మొండి ధైర్యంతో ఉన్నా. 10 రోజుల చికిత్స తర్వాత కోలుకోవడంతో ఇంటికి పంపించారు.
-కె.తిరుపాల్రెడ్డి, హైదరాబాద్
అమ్మ మాకే ధైర్యం చెప్పేది
మా అమ్మ (అన్నపూర్ణ చెరుకూరి, హైదరాబాద్)కు 87 ఏళ్లు. మొదట డయేరియా వచ్చింది. రెండు రోజులైనా తగ్గకపోవడంతో.. జూన్ 25న ఆసుపత్రిలో చేర్పించాం. పరీక్షల్లో కొవిడ్ అని నిర్ధారణ అయ్యింది. ఆక్సిజన్ 84 శాతానికి పడిపోయింది. ఐసీయూలో ఉంచి, ఆక్సిజన్ అందించారు. 18 రోజుల చికిత్స అనంతరం అమ్మ కోలుకుంది. ఐసీయూలో మరొకరు దగ్గరికి వచ్చి ఆహారం తినిపించే పరిస్థితి ఉండదు. దీంతో ఆమె అక్కడున్న 13 రోజులూ ద్రవాహారంతోనే గడిపింది. ఎప్పుడు వీడియోకాల్ చేసినా, సానుకూలంగానే మాట్లాడేది. మాకే ధైర్యం చెప్పేది.
– గాంధీ, విశ్రాంత అధికారి
Courtesy Eenadu