- ప్రతికూలతలు వివరించాం
- కాస్మోపాలిటన్ హంగులు అనుకూలం
- తుఫాన్లు వస్తే నేనేం చేయగలను
- అమరావతి రైతులకు న్యాయం చేయాలి
- విశాఖ వద్దనడం’పై జీఎన్ రావు వివరణ
- వాట్సాప్ మెసేజ్ చదివిన వైనం
హైదరాబాద్ : ‘విశాఖ నగరానికి ప్రతికూలతలు ఉండటం నిజం. తీరప్రాంతం కోతకు గురవుతుండటం వాస్తవం. అందుకే, రాజధానిని విశాఖపట్నం కోర్ ఏరియాలో కాకుండా, దూరంగా పెట్టాలని చెప్పాం’’ అని నిపుణుల కమిటీకి కన్వీనర్గా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు తెలిపారు. ‘విశాఖలో కొత్తగా, భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించడం వాంఛనీయం కాదు’ అని తమ నివేదికలో స్పష్టంగా చెప్పిన ఆయన… ఈ అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో మీడియా ముందుకు వచ్చారు.
తుఫాన్లు అన్ని ప్రాంతాల్లో వస్తాయి. తీరం కోతకు గురవుతుంది. నేనేం చేయగలను? ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని… విశాఖ ప్రాంత పరిధిలో సముద్రానికి దూరంగా కార్యనిర్వాహక రాజధాని నిర్మించాలని సూచించాం’’ అని తెలిపారు. రాజధానితో విశాఖపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు కదా అని ప్రశ్నించగా… ‘విశాఖ నగరం లోపల కాదు! సముద్రానికి దూరంగా రాజధాని పెట్టాలన్నాం. ఒత్తిడి తగ్గాలంటే అదొక్కటే మార్గం’ అని జీఎన్ రావు తెలిపారు. 13 జిల్లాలను నాలుగు జోన్ల కింద విభజించి, సీనియర్ ఐఏఎస్లను జోనల్ కమిషనర్లుగా నియమించి, ఆయా జిల్లాల పరిధిలోని యంత్రాంగంపై పర్యవేక్షణ చేయిస్తే ప్రయోజనం ఉంటుందని నివేదికలో చెప్పామన్నారు.
విశాఖ ప్రాంత అభివృద్ధి మండలి పరిధిలో ప్రభుత్వ భూములున్నాయని, కాస్మోపాలిటన్ నగరం కాబట్టే విశాఖకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. పెట్రో కారిడార్, విశాఖ కారిడార్ వంటివి కలిసి వస్తాయన్నారు. విశాఖ మాత్రమే ప్రాంతీయ అసమానతలు సరిచేయగలదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘అన్ని ప్రాంతాలకూ ప్రతికూలతలున్నాయి. వాటిని నివేదికలో పొందుపరిచాం. కాస్మోపాలిటన్ నగరం కాబట్టే విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి సిఫారసు చేశాం’’ అని వెల్లడించారు.
రైతులకు న్యాయం చేయాలి
అమరావతిలో శాసనసభ ఉంటుందని, ప్రస్తుత భవనాలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించుకోవచ్చునని జీఎన్ రావు తెలిపారు. అక్కడి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం న్యాయం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘అమరావతిలో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతాల్లో మేలిరకం భూములున్నాయి’’ అని తెలిపారు.
అన్నీ కరెక్టే రాశారు!
కానీ… శీర్షిక మార్చాల్సింది
విలేకరుల సమావేశంలో జీఎన్ రావు తన సెల్ఫోన్కు వచ్చిన వాట్సాప్ మేసేజ్ను చదివి వినిపించారు. ‘సెల్ఫోన్లో ఉన్నదే చదవమన్నారా? ఇంకేమైనా విషయాలున్నాయా? అని ప్రశ్నించగా… ‘నాకు హైదరాబాద్లో కార్యాలయం లేదు. ఏపీకి ఫోన్ చేసి… సిబ్బందికి డిక్టేట్ చేసిన వివరాలే చదువుతున్నా’ అని బదులిచ్చారు. ‘ఆ కాపీ ఇస్తారా? ఫార్వర్డ్ చేస్తారా? అని అడగ్గా… ‘నాకిక్కడ కార్యాలయం లేదు. ఇంకేం అడగొద్దు. వదిలేయండి’ అని బదులిచ్చారు. నివేదిక తయారీలో మీపై ఏమైనా ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా… ‘వాళ్లంతా పెద్దపెద్దవాళ్లు. కమిటీలో ఉన్నది చిన్నవాళ్లు కాదు. 40, 50 ఏళ్ల అనుభవం ఉన్నవారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చినవారు’ అని తెలిపారు. సందేహాల నివృత్తికోసం విలేకరులు మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా జీఎన్రావు అసహనం ప్రదర్శించారు. చివర్లో… ‘ఐటెమ్ బాగా రాశారు. నివేదికలో నేను చెప్పినవే రాశారు. అన్నీ కరెక్టే! హెడ్డింగ్ మార్చితే బాగుండు’ అని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో అనడం కొసమెరుపు.
Courtesy Andhrajyothi