అది కొవిడ్ ఆస్పత్రి! అప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి ఐదురోజులుగా చికిత్స పొందుతున్న ఒక రోగికి ర్యాపిడ్ కిట్తో పరీక్ష చేశారు. ఫలితం ‘నెగెటివ్’ వచ్చింది! ఇదేమి చిత్రం అంటూ వైద్యులు ముక్కున వేలేసుకున్నారు.
మరో చోట! పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ర్యాపిడ్ కిట్తో పరీక్ష చేశారు. ఫలితం ‘పాజిటివ్’ వచ్చింది. డాక్టర్లతోపాటు ఆ వ్యక్తి కూడా బెంబేలెత్తిపోయాడు!
ఫటాఫట్మంటూ పది నిమిషాల్లో కరోనా ఫలితం తేల్చేస్తాయనుకున్న ‘ర్యాపిడ్ కిట్’ల పని తీరు ఇది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు! బెంగాల్, రాజస్థాన్లోనూ ర్యాపిడ్ కిట్లు పనితీరులో విఫలమయ్యాయి. దీంతో… రెండు రోజులపాటు వీటిని వాడొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
- పాజిటివ్ వ్యక్తికి ‘నెగెటివ్’
- ఏ లక్షణాలూ లేకున్నా పాజిటివ్
- తికమకగా వచ్చిన ఫలితాలు
- నమ్మలేమంటున్న వైద్యులు
- నేటి నుంచి ఏపీలో ‘ర్యాపిడ్’కు రెడీ
- రెండు రోజులు ఆపాలన్న ఐసీఎంఆర్
- రాజస్థాన్లో చైనా కిట్ల కలకలం
- 4 శాతం కచ్చితత్వమే నమోదు
- బెంగాల్లోనూ తప్పుడు ఫలితాలే
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఆస్పత్రి స్థాయిలో ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పుడు పలు చిత్రాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ కొరియా నుంచి లక్ష కిట్లు తెప్పించామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే! బుధవారం నుంచి వీటిని క్షేత్రస్థాయిలో ర్యాండమ్గా ఉపయోగించాలని నిర్ణయించారు. దీనికి ముందే కొన్ని జిల్లాల్లో వైద్యాధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కిట్లను ఉపయోగించారు. అప్పటికే కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్న ఒక రోగి దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. అతనికి పరీక్షించి చూస్తే రిపోర్టు నెగెటివ్గా చూపించింది. కరోనా లేని మరో సాధారణ రోగికి కూడా అదే విధంగా పరీక్షించారు. అతనికి కరోనా ఉన్నట్లు చూపించింది. దీంతో ఈ కిట్ల కథ ఏమిటో అర్థం కావడం లేదని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో జరిపే ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, వాటిని విశ్వసించడం ఎలా అన్నది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది.
ఇది మరీ ప్రమాదం…
ప్రయోగాత్మక పరీక్షలోనే విఫలమైన ర్యాపిడ్ కిట్లను నమ్ముకుంటే కొంప కొల్లేరవుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కిట్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మరోసారి ‘పీసీఆర్’ పద్ధతిలో పరీక్ష చేసి నిర్ధారణ చేసుకుంటారు. నెగెటివ్ వస్తే మాత్రం వదిలేస్తారు. కానీ… పాజిటివ్ ఉన్న వ్యక్తికి ‘నెగెటివ్’ అని చూపిస్తే అంతే సంగతులు. ర్యాపిడ్ కిట్లో తనకు నెగెటివ్ వచ్చింది కదా అని విచ్చలవిడిగా తిరిగితే… మరికొందరికి వైరస్ సోకుతుంది. ఈ నేపథ్యంలో నిక్కచ్చి ఫలితాలు ఇవ్వని ర్యాపిడ్ కిట్లను నమ్మలేమని వైద్యులు పేర్కొంటున్నారు.
రాజస్థాన్, బెంగాల్లో ఇలా…
రాజస్థాన్కు ఐసీఎంఆర్ 30వేల ర్యాపిడ్ కిట్లను ఉచితంగా పంపింది. మరో పది వేల కిట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.540 (పన్నులు కాకుండా) చొప్పున కొనుగోలు చేసింది. ఇవన్నీ చైనాలో తయారైనవి. కరోనా ‘హాట్స్పాట్’లుగా గుర్తించిన ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 90 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వస్తాయని భావించగా… కేవలం 5.4 శాతం కచ్చితత్వమే కనిపించింది. దీంతో… ఈ కిట్లు వృథా అని నిర్ధారించారు. సోమవారం నుంచే వీటి వినియోగాన్ని నిలిపివేసి… ఐసీఎంఆర్కు సమాచారం పంపించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. ఇక పశ్చిమ బెంగాల్కు జాతీయ కలరా, అంటు వ్యాధుల పరిశోధన సంస్థ (నీసెడ్) ద్వారా 15 రోజుల కిందట ర్యాపిడ్ టెస్టు కిట్లు అందాయి. ఈ కిట్లలో లోపాలున్నట్లు గుర్తించి… వాటిని వెనక్కి రప్పించారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐసీఎంఆర్-నీసెడ్ అధికారి ఒకరు తెలిపారు.
2 రోజులు నిలిపి వేయండి:ఐసీఎంఆర్
రాజస్థాన్ ఫిర్యాదు నేపథ్యంలో ఐసీఎంఆర్ అప్రమత్తమైంది. ‘‘ర్యాపిడ్ కిట్లపై ఆదివారం ఒక రాష్ట్రం నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఇప్పటికి మూడు రాష్ట్రాలతో చర్చించాం. పీసీఆర్తో పోల్చితే ర్యాపిడ్ కిట్ల ఫలితాలు బాగా తేడాగా ఉన్నాయి. అందువల్ల… రెండు రోజులు ఈ కిట్లను ఉపయోగించవద్దు. మా బృందాలు ఈ కిట్లను పరీక్షించిన తర్వాతే అవి వాడదగ్గవో కాదో చెబుతాం’’ అని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ రామన్ ఆర్.గంగాఖేడ్కర్ సోమవారం ప్రకటించారు.
Courtesy Andhrajyothi