హైదరాబాద్ మహానగర గ్రంథా లయ సంస్థ ఆధ్వర్యంలో 85 పౌర గ్రంథాలయాలు నడుస్తుండగా, 259 ఉద్యోగాలు ప్రభుత్వం చేత అనుమతి పొంది ఉండగా, కేవలం 97 మంది మాత్రమే పనిచేస్తు న్నారు. మిగతా 162 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 646 గ్రంథ పాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నవి.
ఒక దేశ పురోగతిని అడ్డుకోవాలంటే ఆ దేశ యువతరానికి గ్రంథాలయాలు అందు బాటులో లేకుండా చేస్తే చాలు. అంతటి బృహత్తర శక్తి గ్రంథాలయాలకు ఉన్నది. 6,40,000 వేల గ్రామాలు, 136 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 2011 అధికారిక లెక్కల ప్రకారం 70,817 పౌర గ్రంథాలయాలు ఉన్నాయి. సరాసరిన 11,500 గ్రామజనాభాకు ఒక గ్రంథాలయం, 80,000 పట్టణ జనాభాకు ఒక గ్రంథాలయం ఉన్నదన్నమాట. యునెస్కో నియమావళి ప్రకారం ప్రతి 5000 వేల జనాభాకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి అనే నియమం ఉన్నది. ఆ లెక్కన మన దేశంలో 136 కోట్ల జనాభా కాబట్టి దాదాపు 2,60,000 పౌరగ్రంథాలయాలు ఉండాలి. అంటే ప్రస్తుతం మన దేశంలో 1,89,183 గ్రంథాలయాలు తక్కువ ఉన్నాయి.
ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే అమెరికాలోని పౌర గ్రంథాలయాలను 95.6% ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అమెరికా తన తలసరి ఆదాయం 35.96 డాలర్లును గ్రంథాలయాలకు కేటాయిస్తున్నది. యూరోపియన్ దేశాలలో 80 శాతం మంది ప్రజలు గ్రంథాలయాలను వినియోగించుకుంటే, వారి తలసరి ఆదాయంలో 30 డాలర్లను వాటికి కేటాయిస్తున్నారు. ఫిన్లాండ్ 30 పౌండ్లు, ఆస్ట్రేలియా 44.4 డాలర్లు, హాంకాంగ్ 12 పౌండ్లు తలసరి ఆదాయంలో గ్రంథాలయాలకు కేటాయిస్తున్నవి. వెనుకబడిన దేశమైన నైజీరియా కూడా ఐదు రూపాయలు (లేదా 4 సెంట్లు) కేటాయిస్తుండగా, భారతదేశం మాత్రం 0.7 పైసలు మాత్రమే గ్రంథాలయాలకు కేటాయిస్తున్నది.
భారత దేశంలో 19 రాష్ట్రాలకు గ్రంథాలయ చట్టాలు చేయబడ్డాయి. దీని ద్వారా చట్టబద్ధంగా గ్రంథాలయాలకు రావలసిన బడ్జెట్ కేటాయింపులు, గ్రంథాలయాల స్థాపన, విధి విధానాలు ఉంటాయి. భారతదేశంలో మెట్టమెదటి గ్రంథాలయ చట్టం 1948 మద్రాస్ రాష్ట్రం, రెండవ గ్రంథాలయ చట్టం 1955 మన హైదరాబాదు రాష్ట్రానిదే కావడం గర్వకారణం.
ఎ.సి. నెల్సన్ ఆర్గ్ మార్గ్ సర్వే ప్రకారం అత్యధిక గ్రంధాలయాలు గల రాష్ట్రం మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ కలిపి 15,938 గ్రంథాలయాలు. కేరళ 8,600 గ్రంథాలయాలతో రెండవ స్థానంలోను; గుజరాత్ 6,714 గ్రంథాలయాలతో మూడవ స్థానంలోను, మహా రాష్ట్ర 3,888 గ్రంథాలయాలతో నాలుగవ స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మూడు వేల పైచిలుకు గ్రంథాలయాలు ఉన్నాయి.
భారతదేశంలో కేవలం కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, గోవా, తెలంగాణ.. ఈ ఆరు రాష్ట్రాలలో మాత్రమే గ్రంథాలయ పన్నును ప్రజల నుండి వసూలు చేస్తున్నారు. వాటిలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 8% (రూపాయికి 8 పైసలు), కేరళ 5%, గోవా 1.67%, కర్ణాటక 6%, తమిళ నాడు 105% టాక్స్ పన్ను రూపంలో స్థానిక సంస్థలు, ప్రజల నుంచి గ్రంథాలయాల అభివృద్ధి కోసం వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ రాష్ట్రానికి దేశంలోని రెండో గ్రంథాలయ చట్టం తెచ్చిన ఖ్యాతి ఉన్నది. 2006-–07 నుండి 2014 ఈ కాలంలో ఆస్తి రూపంలో వసూలు చేసిన పన్నులు 5,327 కోట్ల రూపాయలు. అందులో గ్రంథాలయాలకు పన్ను రూపంలో రావాల్సిన వాటా 384 కోట్ల రూపాయలు. కాని హైదరాబాదు మహా నగర సంస్థ 2006–-13 వరకు గ్రంథాలయ సెస్సు 339 కోట్లు వసూలు చేసి కేవలం 39కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చింది.
హైదరాబాద్ మహానగర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 85 పౌర గ్రంథాలయాలు నడుస్తుండగా, 259 ఉద్యోగాలు ప్రభుత్వం చేత అనుమతి పొంది ఉండగా, కేవలం 97 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా 162 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే 646 గ్రంథ పాలకుల పోస్టులు ఖాళీగా ఉన్నవి.
దేశంలోనే మొట్టమొదటిసారిగా 565 గ్రంథాలయాలను 1985-–86 కాలంలో ఏర్పాటు చేసిన ఘనత ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలలో 1986–-87 కాలంలో నూతన గ్రంథాలయాల పై నిషేధం విధించారు. అదే విధంగా 1988లో నూతన గ్రంథాలయ సిబ్బంది పైనా నిషేధాన్ని విధించారు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఒకటే. గ్రంథపాలకుల లేమి, నిధుల లేమితో గ్రంథాలయాలు యాతన పడుతున్నాయి.
పౌర గ్రంథాలయాలలో నేటి పాఠకుల అభిరుచికి అనుగుణంగా పుస్తకాలు లేవు అనేది ప్రధానమైన విమర్శ. అనేక పౌర గ్రంథాలయాలలో స్థల సమస్య ఎక్కువ. అలనాటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన ఈ గ్రంథాలయాలు నేటి పెరిగిన జనాభా అవసరాలను తీర్చలేకున్నాయి. పుస్తకాలకు, మారుతున్న కాలానుగుణంగా వచ్చిన కంప్యూటర్ పరికరాలకు తగిన స్థలం లేకుండా ఇరుకైన గదుల్లో స్థలాభావంతో కాలం వెళ్ళబుచ్చుతున్నవి.
కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలో నడిచే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ/పౌర గ్రంథాలయాలకు సహాయ సహకారాలను అందిస్తున్నది. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ 2013-–14 కాలంలో రూ.406 కోట్లను, 2014-–15 కాలంలో రూ.385 కోట్లను, 2015–-16 కాలంలో రూ.415 కోట్లను, దేశంలో ఉన్న పౌర గ్రంథాలయాల ఉన్నతి కోసం, పురోగతి కోసం ఇచ్చింది. ఇంతవరకు ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా 34 వేల గ్రంథాలయాలకు లబ్ధి చేకూర్చింది. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టర్ చక్రబర్తి చెపుతున్న దాని ప్రకారం- ఈ సంస్థ ఏమేమి సదుపాయాలను, నిధులను (పక్కా భవనాలకు, పర్నిచర్కు, సెమినార్లకు), వనరులను, గ్రంథ పాలకులకు తర్ఫీదును, ఉచిత పుస్తకాలను.. మొదలైన అవకాశాలను కల్పిస్తున్నదో, ఎంత బడ్జెట్ కేటాయింపులు ఉన్నవో, ఇటువంటి విషయాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రంథ పాలకులకు గాని, గ్రంథాలయ సంస్థల గాని, రాష్ట్రాలకు గాని అవగాహన లేదు. ఉన్నా వారికి కేటాయించిన బడ్జెట్ తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించిన దాఖలాలు లేవు.
గ్రంథాలయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. గ్రంథాలయాలను జాతీయ సంపదగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం గ్రంథాలయాలకు జాతీయ స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాలి. ఆ నిధులు సరిగా అమలు అవుతున్నాయా లేదో చూసేందుకు స్వతంత్ర కమిటీని నియమించాలి. జాతీయ స్థాయిలో వందేళ్ళు దాటిన 300 పైచిలుకు గ్రంథాలయాలను కాపాడేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి.
డా. రవి కుమార్ చేగొని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం
(నేడు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు)