- చైనా నుంచి యువతి వీడియో సందేశం
- ఉద్యోగ శిక్షణ కోసం వెళ్లి వూహాన్లో చిక్కుకున్న వైనం
నంద్యాల : నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత కొంచెం పెరిగింది. దీంతో నన్ను భారత్ రాకుండా చైనా అధికారులు అడ్డుకున్నారు. నన్ను ఎలాగైనా స్వదేశానికి రప్పించండి అంటూ ఉద్యోగ శిక్షణ కోసం చైనా వెళ్లిన ఓ యువతి కుటుంబసభ్యులకు వాట్సప్ సందేశాన్ని పంపించింది. దీంతో ఆమె తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే…ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం రేపుతున్న నేపథ్యంలో చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 58 మంది విద్యార్థులు తిరిగి రావాల్సి ఉంది.
వారిలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి కూడా ఉంది. విమానం ఎక్కే సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఈమె శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా ఉండటంతో కరోనా వైరస్ అనుమానిత కేసుగా భావించి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన యువతి తనను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని తన తల్లికి శనివారం వాట్సప్ ద్వారా వీడియో సందేశం పంపించింది. కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఈ యువతి తిరుపతిలో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్న చైనా కంపెనీ ఆప్టో-డి్సప్లే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, టీసీఎల్ ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించింది. ఆగస్టులో ఆరు నెలల శిక్షణ కోసం చైనా వెళ్లిన ఈమె ఈ నెల 15వ తేదీ తరువాత స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. యువతి తల్లితో కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆదివారం ఫోన్లో మాట్లాడారు. యువతిని త్వరగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Courtesy Andhrajyothi