దేశంలో ఇంతవరకూ కరోనా సామూహిక వ్యాప్తి జరగడం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి జూన్ 11న ప్రకటించింది. తాము జరిపిన సర్వే ప్రకారం ఇప్పటి వరకూ 0.73 శాతం ప్రజలకు మాత్రమే వైరస్ సోకిందని, మరణాల రేటు 0.08 శాతం మాత్రమే ఉందని డాక్టర్ బలరాం భార్గవ ప్రకటించారు. ఆయన ఐసిఎంఆర్ కు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. దీనినిబట్టి ప్రభుత్వం కోవిడ్-19ని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ విజయవంతం అయ్యాయని డాక్టర్ భార్గవ ప్రకటించారు.
మే నెల మూడవ వారంలో దేశం లోని 83 జిల్లాలలో, 28,595 గృహాలలో, 26,400 మంది వ్యక్తులను ఐసిఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాతీయ వ్యాధుల నిరోధక కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్), ఆయా రాష్ట్ర వైద్య, ఆరోగ్య విభాగాలతో కలిసి సీరొలాజికల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వ్యక్తుల నుంచి సీరం (రక్తంలో ఉండే చీము వంటి భాగం) సేకరించి పరీక్షించడం జరుగుతుంది. సాధారణ ప్రజల్లో ఎంతమందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకి వుంటుందో అంచనా వేయడానికి ఈ సర్వే జరిపారు. మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే ఆ క్రిమిని చంపివేసే యాంటీబాడీస్ (రోగనిరోధక కణాలు) మన శరీరంలో పుడతాయి. అందుచేత సీరొలాజికల్ పరీక్షలో యాంటీబాడీస్ ఉన్నట్టు నిర్ధారణ అయితే, ప్రస్తుతం ఆరోగ్యవంతుడిగా ఉన్నా, ఆ వ్యక్తికి ఇంతకు ముందే కరోనా సోకిందని నిర్ధారించవచ్చు.
దేశంలో ఎంతమందికి కరోనా సోకినట్టు?
సర్వే ప్రకారం 0.73 శాతం ప్రజలకు కరోనా ఇన్ఫెక్షన్ సోకింది. 136 కోట్ల దేశ జనాభాలో 0.73 శాతం ఎంత? లెక్క వేస్తే సుమారు 99 లక్షలు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. ఇప్పటికి (జూన్ 12) కరోనా సోకినవారు 3,04,000 పైగా వున్నారని నిర్ధారించారు. ఐసిఎంఆర్ అంచనాలో (99 లక్షలు) ఇది కేవలం 3 శాతమే. ఇంత తక్కువగా కేసులున్నాయంటే ఐసిఎంఆర్ నివేదిక తప్పు చెప్పిందా? మరణాల రేటు 0.08 శాతం అని ఐసిఎంఆర్ చెప్పినదానికి తగ్గట్టు గానే 99 లక్షలలో 0.08 శాతం లెక్క వేస్తే 8,000 పై చిలుకు అవుతుంది. ఇప్పటికి సంభవించిన కోవిడ్ మరణాల సంఖ్యకు, ఐసిఎంఆర్ అంచనాకు తేడా లేదు. అందుచేత జరిగిన సర్వే వాస్తవ పరిస్థితికి దగ్గరగానే ఉందని స్పష్టం అవుతోంది. కాని కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటిస్తున్న సంఖ్య మాత్రం ఐసిఎంఆర్ అంచనాలో 3 శాతం మాత్రమే ఉంది. అంటే ప్రభుత్వం తక్కువ కేసులను మాత్రమే ప్రకటిస్తోంది.
మన దేశంలో అవసరమైనంత విస్తృతంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం లేదని, పరిమితంగా జరుపుతున్న పరీక్షలలో నిర్ధారించిన కేసులను మాత్రమే ప్రకటిస్తున్నారని స్పష్టం అయింది. ప్రతీ లక్ష జనాభాలో 100 నుండి 150 మంది మధ్య ప్రజలను రోజూ పరీక్షించాలి. ఇప్పుడు సగటున రోజుకు 1,25,000 నుంచి 1,50,000 మధ్య పరీక్షలు చేస్తున్నారు. అంటే ప్రతీ లక్ష జనాభాలో కేవలం 10 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారన్నమాట. అవసరమైనదానిలో పదో వంతు సంఖ్యలో మాత్రమే పరీక్షలు చేయడం వలన కరోనా సోకినట్టు బైటపడుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఇలా తక్కువ మోతాదులో పరీక్షలు చేస్తున్నా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అవసరమైన మోతాదులో గనుక పరీక్షలు జరిపితే, వాస్తవంగా దేశంలో ఎన్ని కరోనా కేసులున్నాయో బైట పడుతుంది.
కేసుల సంఖ్య పెరుగుతున్నా, పరీక్షల సంఖ్య మాత్రం పెరగడంలేదెందుకని అడిగితే, డా||భార్గవ పరీక్షలు జరపగల సామర్ధ్యం ఎక్కువగానే ఉన్నా, రాష్ట్రాలు ఆ పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవడం లేదని.. బాధ్యతను రాష్ట్రాల పైకి నెట్టివేశారు. అనేక విషయాలలో రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్న కేంద్రం పరీక్షల సంఖ్య పెంచమని ఎందుకు ఆదేశించలేకపోయింది? కేసుల సంఖ్యను తక్కువగా చూపించి, ఇదంతా తమ ఘనతేనని చెప్పుకోవాలనేదే కేంద్ర ప్రభుత్వ తాపత్రయంలా కనపడుతోంది.
ఒకపక్క అదుపులో ఉందంటూనే, సామూహిక వ్యాప్తి దశకు రాలేదంటూనే, మరో పక్క జాగ్రత్తలు కొనసాగించాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంలోనే కేంద్రం దొంగ నాటకం వెల్లడౌతోంది. గ్రామాల్లో కన్నా పట్టణాల్లో 1.09 రెట్లు ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, పట్టణాల్లోని మురికివాడల్లో ఈ ప్రమాదం 1.89 రెట్లు ఎక్కువ అని ఐసిఎంఆర్ రిపోర్టు హెచ్చరించింది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల అనుభవం కూడా ఈ హెచ్చరికను ధృవీకరిస్తోంది.
మరి ఈ హెచ్చరికకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకొంటోందా? ప్రజలను భౌతిక దూరం పాటించమని, మాస్క్లు ధరించమని, చేతులు కడుక్కోమని జాగ్రత్తలు చెప్పడంతోనే కేంద్రం తన బాధ్యత తీరిపోయిందని అనుకుంటోంది. పట్టణాల్లో మురికివాడల్లో ఎందుకీ ప్రమాదం ఎక్కువగా ఉందన్న విషయాన్ని పరిశీలిస్తే అక్కడ నివసించే ప్రజలు అత్యధిక భాగం రెక్కాడితే గాని డొక్కాడని పేదలు. వారి రోజువారీ బతుకులెలా గడుస్తాయి? లాక్డౌన్ కొంత సడలించారు గనుక వారంతా పనుల్లోకి పోతున్నారు (ఆ పనులు దొరికితే చాలు అనుకుంటున్నారు) అలా పనుల్లోకి పోయేవారంతా అన్ని సమయాల్లోనూ భౌతిక దూరం పాటించగలరా? రోజుకు 20, 30 సార్లు చేతులు శానిటైజర్ తోనో, సబ్బు తోనో కడుక్కోగలరా? కరోనా కన్నా భయంకరమైన ఆకలిని తట్టుకోడానికి వారు పనుల్లోకి పోతున్నారు. వారిని ఇళ్ళ వద్దే ఉంచడానికి వీలుగా ప్రతీ కుటుంబానికీ నెలకు రు.7,500 చొప్పున ఇవ్వాలని, ప్రతీ వ్యక్తికీ నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలని వామపక్షాలు, పలువురు ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు ఎన్నో మార్లు సూచించినా వాటినన్నింటినీ పెడచెవిన పెట్టింది కేంద్రం.
కరోనా సోకినవారిలో కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50 శాతం ఉందని, అదంతా తమ ఘనతేనని కేంద్రం చెప్పుకుంటోంది. కరోనా కు ఇంతవరకూ వ్యాక్సిన్ ను కనుగొనలేదు. ప్రస్తుతానికి వైద్యులు చేస్తున్నదల్లా సంరక్షణ మాత్రమే. ఆ సంరక్షణలో అన్నింటికన్నా కీలకం రోగనిరోధకశక్తిని పెంచడం. జనాలకి తినడానికి తిండి కూడా పెట్టడానికి నిరాకరిస్తూ, ఆ తిండిగింజల్ని ఎథనాల్ తయారీకి ఫ్యాక్టరీలకు మళ్ళిస్తూ రోగులు కోలుకోవడం తమ ఘనతగా చెప్పుకోవడమంటే ఈ కేంద్రం ఎంత సిగ్గుమాలిన రీతిన వ్యవహరిస్తోందో, తప్పుడు ప్రచారంలో ఎంత దిగజారిపోతున్నదో అర్ధం అవుతోంది.
తాను చేయవలసిన పనులను చేయదుకాని ఈ కేంద్రం రాష్ట్రాలకు మాత్రం సూచనలివ్వడానికి తయారు. వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని, మధుమేహం, గుండె జబ్బులు వంటివి ఉన్న వారిని, గర్భవతులను జాగ్రత్తగా చూసుకోవాలని, కట్టుదిట్టంగా జాగ్రత్తలన్నింటినీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చెప్పింది.
మొన్నటిదాకా వలస కార్మికుల అగచాట్లు చూశాం. వారి సంరక్షణ కోసం వీసమెత్తు కూడా చేయని మోడీ వారికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇప్పుడు ఇక మురికివాడల్లో నివసించే పేదల వంతు వచ్చింది. ఇప్పుడూ ఏమీ చేయకుండానే ఆ తర్వాత ఎప్పుడో ప్రగాఢ సానుభూతిని మరోసారి ప్రకటిస్తారేమో మరి.
మొత్తానికి దేశంలో కరోనా వ్యాప్తి ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకన్నా అనేక రెట్లు ఎక్కువ ఉందని ఐసిఎంఆర్ నివేదిక చెప్పకనే చెప్పింది. తగు సంఖ్యలో పరీక్షలు జరపకుండా…కేంద్రం కరోనా ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నదని కూడా ఆ నివేదికను బట్టి మనం నిర్ధారించవచ్చు. అటు కరోనా మీద, ఇటు కేంద్రం బాధ్యతా రాహిత్యం మీద…ఏకకాలంలో పోరాడాల్సి వుంటుందని ఆ నివేదిక మనకు చెప్పకనే చెప్తోంది.
ఎం.వి.ఎస్. శర్మ
Courtesy Prajasakti