- సబ్సిడీయేతర సిలిండర్ ధర భారీగా పెంపు
- పన్నులతో కలిపి విజయవాడలో రూ.50
- గత రేటుతో పోలిస్తే రూ.148 మేర పెరుగుదల
- సబ్సిడీ వదులుకున్న వారి గుండెల్లో గుబులు..
- పెంచిన ధరకు అనుగుణంగా పెరిగిన సబ్సిడీ
అమరావతి : అలా ఢిల్లీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయో లేదో.. ఇలా సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది! ఢిల్లీలో రూ.144.50 మేర పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. దీంతో అక్కడ 14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర 858.5కు పెరిగింది. ఏపీలో అన్ని పన్నులతో కలిపి రూ.148.50 మేర పెరిగిన సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.741.50 నుంచి ఏకంగా రూ.889.50కి చేరింది. గత కొద్ది నెలల్లో కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ల ధర పెంచడం ఇది వరుసగా ఆరోసారి. ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ సిలిండర్ల ధరలపై గ్యాస్ కంపెనీలు సమీక్ష నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్ ధరవరలకు అనుగుణంగా ధరను నిర్ణయిస్తాయి.
ఈ క్రమంలో సెప్టెంబరు నుంచి సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెరుగుతూ పోతోందే తప్ప తగ్గట్లేదు. కానీ.. ఫిబ్రవరి 1న నిర్ణయించాల్సిన ధరపై మాత్రం ఎందుకో(?) గ్యాస్ కంపెనీలు మౌనంగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఉన్నట్టుండి ఇంత భారీగా భారం మోపాయి. అయితే, సిలిండర్ ధరలతో పాటు సబ్సిడీని కూడా పెంచడం ద్వారా వినియోగదారులకు కేంద్రం ఒకింత ఊరటనిచ్చింది. సబ్సిడీ సిలిండర్లను వాడే వారికి పెరిగిన ధరతో కలిపి రూ.330 వరకు రాయితీగా దక్కనుంది. గ్యాస్ సిలిండర్ ధర రూ.741.5గా ఉన్నప్పుడు (ఫిబ్రవరి 11 వరకూ) సబ్సిడీగా వచ్చే రూ.183ను మినహాయిస్తే సిలిండర్ ధర రూ.558.5గా ఉండేది. ఇప్పుడు సబ్సిడీ పెరిగినా.. రూ1.50 మేర అదనపు భారం పడనుంది. సిలిండర్ ధరల పెంపు ద్వారా కేంద్రం పేదలకు వ్యతిరేకంగా క్రూరమైన నిర్ణయం తీసుకుందని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆరోపించారు. ప్రజల జేబులు ఖాళీ అయ్యేలా మోదీ సర్కారు గ్యాస్ ధరలు పెంచుతోందని కాంగ్రెస్ మండిపడింది.
వారికి వణుకే..
సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెరిగినా.. ఏడాదికి 12 లోపు సబ్సిడీ సిలిండర్లను వాడేవారికి ఇబ్బంది లేదు. కానీ.. ప్రధాని మోదీ పిలుపు మేరకు సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నవారు మాత్రం పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్నారు. ఏపీలో గ్యాస్ సబ్సిడీ వదులుకున్నవారి సంఖ్య 2.4 లక్షవరకు ఉంది. ఇందులో కొందరు స్వచ్ఛందంగా వదులుకుంటే.. మిగిలిన వారు సాంకేతిక కారణాలతో సబ్సిడీ పొందలేకపోతున్నారు. పెరిగిన ధరలు వీరిపై తీవ్ర భారాన్ని మోపనున్నాయి. వీరికే కాదు.. సబ్సిడీ పొందేవారిలో కూడా కొందరికి ఇప్పటికే 12 సిలిండర్ల (ఏడాదికి) కోటా పూర్తయిపోయి ఉంటుంది. అలాంటివారు పూర్తిమొత్తం చెల్లించాల్సిందే.
ఆరునెలలుగా పెరగడమే తప్ప..
నెల పెరుగుదల (రూపాయల్లో)
సెప్టెంబరు 16
అక్టోబరు 13.50
నవంబరు 56.50
డిసెంబరు 34
జనవరి 21
ఫిబ్రవరి 148.50
Courtesy Andhrajyothi