న్యూఢిల్లీ: పాలకుల నిష్పూచీ, అధికార గణం నిర్లక్షవైఖరితో దేశంలో అన్నదాతల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. బానిసత్వం నుంచి దేశానికి విముక్తి లభించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కర్షకుల కష్టాలు తీరడం లేదు. ప్రకృతి ప్రకోపాలు, మార్కెట్ మాయాజాలానికి తోడు పాలకుల అలక్ష్యం అన్నదాతల ఉసురుతీస్తోంది. సాగు జూదంలో సమిధలుగా మారుతున్న సాగుబడిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏటేటా దేశంలో వేల సంఖ్యలో రైతులు బలవన్మరణాలకు బలైపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2014-18 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 31,645 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 12,813 ఆత్మహత్యలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కర్ణాటక ఉంది. 4,634 మంది రైతులు బలవన్మరణాలతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆరో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ లో 1,655 రైతు ఆత్మహ్యలు నమోదయ్యాయి. దేశంలో నమోదలైన మొత్తం రైతు ఆత్మహత్యల్లో 99.51 శాతం 13 రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. 9 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత ఐదేళ్లలో అన్నదాతల ఆత్మహత్యలు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ పథకంగా విజయవంతంగా అమలవుతోందన్న మంత్రి.. రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆగడంలేదో చెప్పలేదు. ఈ పథకం ద్వారా 8,69,79,391 మంది లబ్ధిపొందారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని 69 రైతుల కాకుండానే ఇంతమందికి ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ పథకంలో పశ్చిమ బెంగాల్ ఇంకా చేరలేదని చెప్పారు.