బోర్డు మెంబర్లుగా అంబానీ,అరుణ్కపూర్?
12 మంది సభ్యులకుగాను ఏడుగురితో మమ
మాన్సాస్ భూములపై కార్పొరేట్ కన్ను పడింది. వేలాది ఎకరాల భూములు, వందలాది ఆలయాలు, రూ.కోట్ల విలువ చేసే స్థిరాస్తులు గల మాన్సాస్ (మహారాజా అలక్ నారాయణ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ సొసైటీ) బోర్డు మెంబర్లును ఏడుగురితో సరిపెట్టారు. అందులో అంబానీ ప్రతిపాదిత పేర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ల్యాండ్ సీలింగ్ యాక్టును ఎదుర్కొనేందుకు అప్పటి పివిజి రాజు 1958లో మాన్సాస్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా, విజ్ఞానం కోసం ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పారు. మాన్సాస్ బైలా ప్రకారం… ట్రస్ట్ చైర్మన్గా రాజాసాహెబ్ తన సంతానంలోని ఇద్దరి పురుషులను బోర్డు సభ్యులుగా నియమించుకునే అవకాశం ఉంది. వీరిని సంబంధిత కుటుంబ సభ్యులు ప్రతిపాదించాల్సి వుంటుంది. అనంతరం కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా విద్యావాప్తి కోసం, ప్రయోగశాలలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 1971-9-26 ఎమెండ్మెంట్ యాక్టు రూపొందించారు. దీని ప్రకారం చైర్మన్ కుటుంబంలోని ఇద్దరి వ్యక్తులతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మహారాజా కాలేజీ ప్రిన్సిపల్, మాన్సాస్ కరస్పాండెంట్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, బిషప్లు (చర్చి సీనియర్ ఫాదర్) బోర్డులో సాధారణంగా నామినేటెడ్ సభ్యులుగా ఎన్నికవుతారు. వీరంతా కలిసి మరో సభ్యుడిని అదనంగా ఎన్నుకోవచ్చు. దీనికి ప్రకారం మొత్తం 12మంది సభ్యులు ఉండాలి. కానీ, నిన్నమొన్నటి వరకు చైర్మన్గా వ్యవహరించిన అశోక్గజపతిరాజు ఈ నియమ నిబంధనలేవీ పాటించలేదు. తన రాజకీయ పలుకుబడితో తాను చైర్మన్గాను, తన కుమార్తె అధితి విజయలక్ష్మి గజపతిరాజు, ట్రస్ట్తో ఎటువంటి సంబంధం లేని టిడిపి సలహాదారుడు కుటుంబరావు, ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చైర్మన్ ఐవి రావును మాత్రమే సభ్యులుగా నియమించారు. సభ్యుల్లో ఒకరు తన కుమార్తె కాబట్టి మాన్సాస్ పరిపాలన ఏకపక్షంగా సాగింది. విద్యాసంస్థల్లో ఫీజులు పెరిగాయి. అన్ఎయిడెడ్ సీట్లు ఇష్టానుసారంగా పెంచారు. హాస్టళ్లల్లో సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. భూముల విక్రయాలకు అడ్డూ ఆపూలేకుండా పోయింది. మాన్సాస్కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు సైతం బయటకు తెలియని పరిస్థితి ఉండేది. ఇదంతా నాటి మాట.
ప్రస్తుతం ఎండోమెంట్ ఉత్తర్వుల ప్రకారం నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల నియామక జీవోను ఈనెల 3వ తేదీ అర్థరాత్రి జారీ చేయడం, చైర్మన్గా సంచయిత గజపతిరాజు హడావుడిగా బాధ్యతలు స్వీరించడం విదితమే. నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం కూడా గతానికి భిన్నంగా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బైలా ప్రకారం ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ కుటుంబీకుల్లో ఇద్దరికి బదులు ముగ్గురు సభ్యులుగా అవకాశం కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు అవకాశం కల్పించినప్పటికీ ప్రభుత్వ మహారాజ కాలేజీ ప్రిన్సిపల్, మాన్సాస్ కరస్పాండెంట్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, బిషప్ (చర్చి సీనియర్ ఫాదర్)లకు స్థానం కల్పించలేదు. జీవోలో జిల్లా పరిషత్, విజయనగరం కార్పొరేషన్ చైర్మన్ల సభ్యత్వం గురించీ ప్రస్తావించలేదు. పాలకవర్గంలో చైర్మన్, ముగ్గురు సభ్యులు రాజావారి కుటుంబానికి చెందినవారే. మిగిలిన నలుగురిలో ఎమ్మెల్యే, ఎంపీ అధికార పార్టీకి చెందినవారు. మిగిలిన ఇద్ద రిలో అరుణ్కపూర్, అపర కుబేరుడు అంబానీ, విజరు కే సొందిని పేరు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి మాన్సాస్ భూములపై కార్పొరేట్ కుబేరుల కన్నుపడిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
సంచయిత నియామకం చెల్లదు : టిడిపి
వైసిపి ప్రభుత్వం చీకటి జీవోలతో మాన్సాస్ చైర్మన్, కేంద్ర మాజీమంత్రి పూసపాటి అశోక్జగపతిరాజుపై కుట్రకు పాల్పడిందని టిడిపి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు కెఎనాయుడు, బొబ్బిలి చిరంజీవులు ధ్వజమెత్తారు. గురువారం టిడిపి కార్యాయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండించారు. మాన్సాస్, సింహాచలం దేవస్థానం భూములను కాజేసేందుకే సంచయిత గజపతిని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. మాన్సాస్ చైర్మన్గా ఆమె నియామకం చెల్లదని, న్యాయపోరాటం ద్వారా వైసిపి కుట్రను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోట వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, రాజకీయాలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Courtesy Prajashakti