విజయవాడ: కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల పైనా పడింది. కరోనా వైరస్ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రచారం, పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సమూహంలా చేరే అవకాశాలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.
అయితే ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ, నామినేషన్లు ఏవీ రద్దు కాబోవని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు విజేతలేనని, వారు కొనసాగుతారని స్పష్టతనిచ్చారు. ఏకగీవ్రంగా ఎన్నికైన వారు ఎన్నికల్లో గెలిచిన వారితో కలిసి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి కొనసాగుతుందన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ నిలిపివేత మాత్రమేనని, రద్దు కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు.