ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. లక్షలాది మంది కరో నా కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయి సమాజం విషాదంలో మునిగి ఉన్నది. కరోనా అవనిపై మానవాళి ప్రాభవాన్నే ప్రశ్నిస్తున్నది. ఈ నేపథ్యంలో సమస్త మానవాళికి ఈ సంఘర్షణ పరిస్థితులు ఇచ్చే సంకేతాలను ఓ మంచి సందేశంగా భావించాలి.
ఈ భయోత్పాత పరిస్థితుల్లో మనిషి ఎదురుపడినా, ఆత్మీయంగా కాకుండా అనుమానంగా చూసే అనూహ్య స్థితి కొనసాగుతున్నది. నిత్యం అనవసరపు అత్యాశలతో జీవనపోరాటంలో తీరిక లేకుండా గడిపే సగటు మనిషికి లాక్డౌన్ కారణం గా కొంతైనా సమయం దొరికింది. దీన్ని అరుదైన అవకాశంగా భావించి ఎవరికివారు, వారి జీవనగమనాన్ని గురించి ఆలోచించుకోవాలి. మనిషికి శారీరక ఆరో గ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. కసరత్తులు చేసి శారీరకంగా దృఢంగా ఉండి కూడా మానసికంగా సరైన ఆలోచన చెయ్యలేనివాళ్ళ జీవనం ఆనందంగా సాగే అవకాశాలు తక్కువ. జీవితంలో ఉన్నతస్థానాలకు చేరి కూడా, ఆకస్మికంగా వచ్చిన ఆటంకాలను అధిగమించే మానసిక బలం లేక జీవితాలను అర్ధంతరంగా ముగించుకునేవారున్నారు. కాఫీ డే యజమాని వి.జి.సిద్ధార్థరెడ్డి, బ్రిటానిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వీనిత్ విగ్, అంగడ్ పాల్, రాజ్ ట్రావెల్స్ వరల్డ్ ఫౌండర్ లలిత్సేట్ మొదలగువారు మానసిక కుంగుబాటుతోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా, చిత్తశుద్ధితో మహమ్మారిని కట్టడి కోసం పనిచేస్తున్నాయి.
ఈ కరోనా వల్ల పర్యావరణానికి అను కోని మేలు జరిగింది. ప్రపంచదేశాలు పారిస్ ఒప్పందం ద్వారా ఏర్పర్చుకున్న నిబంధనలు, లక్ష్యాలు మరో రూపంలో నెరవేరింది. పర్యావరణ సమతుల్యత ఏర్పడింది. అదేవిధంగా ఈ మహమ్మారి అంతరించిన తర్వాత దేశంలో ఆర్థిక సమతుల్యత కూడా కొంతవరకైనా జరిగి పేదవాళ్లు లేని సమాజం అవతరణ జరిగితే బాగుండు అనిపిస్తున్నది. మనం వివిధస్థాయిల్లో మన నడవడికను, ఆలోచనా విధానాన్ని సమీక్షించుకోవాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒకరంటే ఒకరికి ప్రేమ, అనుబంధం ఆత్మీయతలుండాలి. వ్యక్తిగత అహంకారం, ఆధిపత్య ధోరణి, తమ మాటే నెగ్గాలనే పట్టుదల లేకుండా ఉండాలి.
ఈ విశ్రాంత సమయంలోనే అందరూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అసంతృప్తి, ఆందోళనలుంటే ఆనందంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లల ఆసక్తి, వారి నిజమైన ప్రతిభా పాటవాలను అంచనా వేయాలి. వారి అభిరుచులతో సంబంధం లేకుండా శక్తికిమించిన గమ్యాలను నిర్దేశించి వారిని ఒత్తిడికి గురిచేయవద్దు. ఆశావహ దృక్పథంతో, మనోధైర్యంతో క్లిష్ట సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.
Courtesy Namasthe Telangana