- ప్రతిపక్షాలను ఏకం చేసిన సోనియా
- పరీక్ష వాయిదాకు మళ్లీ సుప్రీంకెక్కుదాం: మమత
- కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలదీ అదే వైఖరి
- విద్యార్థుల గోడు మోదీ సర్కారుకు పట్టదు: సోనియా
- పరీక్ష నిర్వహణకే కేంద్రం మొగ్గు
- 14 లక్షల అడ్మిట్ కార్డులు డౌన్లోడ్: విద్యాశాఖ
న్యూఢిల్లీ : ఇంజినీరింగ్ (జేఈఈ), వైద్య విద్యా (నీట్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్ష వ్యవహారం పూర్తిస్థాయి రాజకీయ రంగు పులుముకుంది. దేశవ్యాప్తంగా కొవిడ్ ఉధృతి దృష్ట్యా పరీక్షల నిర్వహణ వాయిదా వెయ్యాలని విద్యార్థిలోకం గళమెత్తడంతో విపక్షాలు వారికి బాసటగా నిలిచాయి. కేంద్రంపై దాడి తీవ్రం చేశాయి. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ బుధవారంనాడు చొరవ తీసుకుని- విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై ఉమ్మడిగా కదులుదామని ప్రతిపాదించారు. దీనికి వారు సరేననడంతో ఈ అంశం వేడెక్కింది. పరీక్ష వాయిదా కుదరదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినప్పటికీ- విద్యార్థుల కోసం మనమే మరోసారి సుప్రీంలో రివ్యూ వేద్దామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనిపై … ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఏడు రాష్ట్రాల సీఎంలు తమ సమ్మతి తెలియజేశారు. అటు ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్ణయం మార్చుకునేది లేదని సంకేతాల్నిచ్చింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఓపెన్ చేసిన తొలి మూడు గంటల్లోనే దాదాపు 14 లక్షల మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారని, విద్యార్థులంతా పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ పేర్కొంది.ఎన్టీఏ కూడా పరీక్షల నిర్వహణ ఆగదని తేల్చిచెప్పింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఇబ్బంది లేకుండా వెళ్లేందుకు రవా ణా, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. దీంతో పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలు తప్పనిసరిగా స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విపక్షాల సంఘీభావం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కెప్టెన్ అమరీందర్సింగ్, భూపేశ్ బాఘేల్, వి.నారాయణస్వామి, అశోక్ గెహ్లోత్, బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సొరెన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా పరీక్ష వాయిదా వేయాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరారు. విపక్ష వీడియో కాన్ఫరెన్స్కు విజయన్ను ఆహ్వానించాలని సోనియా భావించినా స్థానిక కాంగ్రె్సవాదుల నుంచి వ్యతిరేక త వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్కు ఆహ్వానం పంపినా హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మాత్రం కాంగ్రె్సకు సంఘీభావం ప్రకటించారు.
‘పరీక్ష జరిపితే విద్యార్థుల ఆరోగ్యానికి దెబ్బ’
‘రైళ్లు లేవు, బస్సులు తక్కువ. ప్రజా రవాణా ఇబ్బందిగా ఉంది. సిబ్బందీ విముఖంగా ఉన్నారు. విద్యార్థులంతా భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనా పరీక్షలు నిర్వహించేది? నిర్వహిస్తే విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది’ అని మమత అన్నారు. ‘విద్యార్థుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. వారి ఆరోగ్యం, భద్రతపై చింతలేదు. నూతన విద్యావిధానమే అశాస్త్రీయంగా ఉంది. లక్షల మంది కోరుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు’ అని సోనియా దుమ్మెత్తారు. ‘పరీక్షలు జరపాల్సిం దే. కానీ ఎలా? విద్యార్థుల కోసం అనేక లాడ్జ్లు, నివాస స్థలా లు సిద్ధం చేయాలి? ఈ పరిస్థితుల్లో ఎలా సాధ్యం?’ అని సొరెన్ ప్రశ్నించారు. అందరం కలిసి ప్రధానికి విజ్ఞాపన చేద్దామని అమరీందర్ సింగ్ అన్నారు. ‘బిహార్, అసోం, యూపీల్లో వరదలు ముంచెత్తాయి. విద్యార్థులకు, తలిదండ్రులకు పరీక్ష జరిగే నగరాలకు వెళ్లడమే కష్టం. నగరాల్లో లాడ్జి సౌకర్యాలూ ఇబ్బందే. వీటిని గుర్తుపెట్టుకుని తగిన పరిష్కారం ఆలోచించండని’ రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
విద్యాసంవత్సరం కాపాడ్డానికే: ఎన్టీఏ
‘అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ అయ్యాక మాకు విద్యార్థుల నుంచి రెండు రకాల విజ్ఞాపనలు వచ్చాయి. వాయిదా వేయాలని కొందరు, వద్దని మరికొందరు.. అన్నింటినీ పరిశీలించాక వాయిదా వద్దనే నిర్ణయానికే వచ్చాం. లాక్డౌన్ ఎత్తివేత నాలుగోదశ సెప్టెంబరు 1 నుంచి మొదలవుతోంది. అనేక రంగాలు పనిచేస్తున్నాయి. ఈ దశలో పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్ష నిర్వహణ సబబేనని తీర్మానించాం. వాయిదా వేస్తే విద్యాసంవత్సరం మొత్తం పోతుంది. నీట్కు 16లక్షల మంది, జేఈఈ మెయిన్స్కు మరో 9 లక్షల మంది హాజరవుతారు. ఇంత మందిని ఇబ్బందిపెట్టలేం’’ అని ఎన్టీఏ తెలిపింది.
వాయిదాతో ఇబ్బందులు: ఐఐటీ డైరెక్టర్
జేఈఈ పరీక్షను ఇంకా వాయిదావేస్తే అది విద్యాసంవత్సరం మీదే కాకుండా ప్రతిభ గల వేలాది మంది విద్యార్థుల భవితపై పెను ప్రభావం చూపుతుందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వీ రామగోపాల రావు అన్నారు. ‘ ఇప్పటికే ఆరు నెలల నష్టపోయాం. వాయిదా వేస్తే విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం పూర్తిగా పోయినట్లే. రెండు బ్యాచ్ల విద్యార్థులను, రెండు విద్యా సంవత్సరాలను సంయుక్తంగా ఒకేసారి నడపడం విద్యాసంస్థలకీ కష్టం. మేం నడపలేం. కరోనా ఇప్పట్లో తగ్గేది కాదు. మరో ఏడాది పట్టవచ్చు. అంతవరకూ ఆగగలమా?’ అని ఆయన ప్రశ్నించారు. కాగా, నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
షెడ్యూల్ ప్రకారమే: కేంద్రం
పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ దాకా జేఈఈ మెయిన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ‘సెంటర్ల సంఖ్య జేఈఈకి 570 నుంచి 660కి, నీట్కు 2546 నుంచి 3843కి పెంచుతున్నాం. జేఈఈ మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు షిఫ్టుల సంఖ్యను 8 నుంచి 12కు పెంచాం. ఒక్కో షిఫ్టుకు విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85,000కు తగ్గించాం. సెంటర్లకు వచ్చి రాసే వారి విషయంలో ఒక గదిలో పరీక్ష రాసే వారి సంఖ్యను 12కు కుదించాం. దూరదూరంగా కూర్చునేట్లు చూస్తున్నాం. ప్రవేశ, నిర్గమాలు కూడా నింపాదిగా, కొద్దికొద్ది మంది వచ్చేట్లు, వెళ్లేట్లు చేస్తాం. భద్రతా చర్యలన్నీ తీసుకుంటాం’ అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Courtesy Andhrajyothi