రంగనాయకమ్మ
ఈ అబద్దపు కేసుల నైనా త్వరగా తెముల్చుతారా అంటే అదీ జరగదు. ఆ కేసు పెట్టి, రెండేళ్ళయినా, కేసు విచారణ మొదలే కాలేదు. బెయిలుకి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎంత క్రూరంగా అంటే, 80 ఏళ్ళొచ్చి, అనేక జబ్బులతో బాధపడుతోన్న వరవరరావు గారికి బెయిలు ఇవ్వడం లేదు. అప్పీలు ముందుకు కదలని ఒక కేసులో, 90 శాతం కాళ్ళు చచ్చు పడి, ఇతర జబ్బులతో బాధపడుతున్న సాయిబాబా గారి బెయిలుకి అడ్డుపడుతూ కక్ష కట్టింది ప్రభుత్వం. వృద్ధాప్యంలో, ఎంతో నిస్సహాయ, అనారోగ్య స్తితిలో ఒక ఉద్యమ కారుడు వుండడం, ఉద్యమ సానుభూతి పరులందరికీ ఎంతో దుఖ్ఖం కలిగించే విషయమే. కానీ, తప్పదు. దిటవు గుండెలతో నిలవాలి.
‘ప్రజాస్వామ్యం’ అంటే, ప్రజల కోసం, ప్రజల చేత, జరిగే పాలనా విధానం అని, స్కూలు పుస్తకాలనించీ, యూనివర్సిటీ స్తాయి దాకా వింటూ వుంటారు విద్యార్ధులు. అయితే, ‘ప్రజలు’ అంటే ఎవరో ఆ విద్యార్ధులకు ప్రభుత్వం చెప్పదు. పాలకుల దృష్టిలో భూములూ, గనులూ, ఫ్యాక్టరీలూ, లారీలూ, బస్సులూ వంటి ఉత్పత్తి సాధనాలను ఆస్తిగా కలిగిన యజమానులూ ప్రజలే! వాళ్ళ దగ్గిర జీతాలకి పని చేసే కార్మికులూ ప్రజలే. ఏ పనీ దొరకని నిరుద్యోగులూ ప్రజలే! ఉత్పత్తి సాధనాల మీదా, రాజకీయ నిర్ణయాల మీదా, సమాజంలో వున్న వారందరికీ ‘సమిష్టి స్వామ్యం’ వున్నప్పుడే, అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అలా లేకపోతే, అది కొద్దిమందికే కదా ప్రజాస్వామ్యం అయ్యేది? ఎవరైనా ఇలా అంటే, వారి వ్యతిరేకులు వూరుకోరు. ప్రజలందరికీ ఓటేసే హక్కుంది గదా? ఏ పార్టీలో, ఏ ప్రతినిధులకు ఎక్కువ ఓట్లు వస్తే, వాళ్ళే ప్రజల ప్రతినిధులు. అంటే, ప్రజలే వాళ్ళ ప్రతినిధుల ద్వారా తమని తాము పరిపాలించుకుంటున్నారు గదా?’ – అనే వాదన వుంది. ఈ వాదనని ఈ దేశంలో డెబ్బై ఏళ్ళగా వింటున్నాం. ఇప్పుడు అది తారాస్తాయికి చేరింది. అలా ఎన్నికైన పార్టీ, అధికారంలోకి వచ్చి, దౌర్జన్యాలు చేస్తూ వుంటే, వాటిని ఎవరైనా ప్రశ్నిస్తే, ‘‘ప్రజలు మాకు సర్వాధికారాలూ కట్టబెట్టారు. అంత పెద్ద తీర్పు తో (‘బహుత్ బడా జనాదేశ్’) పాలిస్తున్నాం’’ అంటారు పాలకులు. ఈ వాదన ఎప్పటినుంచో ఉన్నా, గత అయిదారేళ్ళగా మరీ శృతి మించింది.
గత ప్రభుత్వం, ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరుతో గిరిజనుల పక్షాన నిలిచిన ఉద్యమకారుల్ని అణిచివేస్తే, ఇప్పటి ప్రభుత్వం ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో అనేక మందిని అణిచివేస్తొంది. ‘‘గిరిజనుల సమస్యల్ని పరిష్కరించక పోవడం వల్లనే, వాళ్ళు నక్సలైట్ల వెంట పోతున్నారు’’ అని ప్రభుత్వంలో కొందరైనా అంటూ వుంటారు. కానీ, గిరిజనులు నివసించే, బ్రతికే, అడవులు, గనుల కంపెనీల పాలైపోతూ వుంటాయి. ప్రజాస్వామ్యం అనేది గిరిజనులకు వుండదు. గనుల కంపెనీలకైతే, కావాల్సినంత ప్రజా స్వామ్యం వుంటుంది. ఈ ప్రజాస్వామ్యం గనుల మీద స్వామ్యం! అడవుల మీద స్వామ్యం! ఇంకా చాలా వాటి మీద!
నిరుద్యోగమూ, మైనారిటీ మతస్తుల మీదా, దళితుల మీదా దాడులూ; పౌర హక్కుల ఉల్లంఘనలూ; ధరల పెరుగుదలలూ- వంటి సమస్యల మీద కొద్దిపాటి నిరసన తెలిపినా, ఆ నిరసనల మీద తీవ్ర స్తాయిలో, బల ప్రయోగం చేయడం, గత కొంత కాలంగా మరీ ఎక్కువైంది. ముఖ్యంగా, మేధా శ్రమలు చేస్తూ, వృత్తి పరంగాగానీ, రాజకీయ చైతన్యంతోగానీ, అన్యాయాల్నీ, అక్రమాల్నీ ప్రశ్నించే మేధావుల్ని అణిచి పెట్టే చర్యలు కూడా ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. లాయ ర్లూ, రచయితలూ, జర్నలిస్టులూ, సాంఘిక కార్యకర్తలూ, ప్రజలలో వేరు వేరు సెక్షన్ల తరఫున పని చేసే వారూ– వీరందరి మీదా అబద్దపు కేసులు పెట్టడం పెరుగుతోన్ది. రెండేళ్ళ కిందట, మహారాష్ట్రలో, పూనా నగరానికి దగ్గిరలో, భీమా కోరేగావ్ అనే చోట దళితులు నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా, అక్కడి ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర కేసు పెట్టింది. కుట్ర కేసులు పెట్టడం అనేది, వలసపాలకుల దగ్గిర్నించీ, స్వదేశీ పాలకులకు వర్గ-వారసత్వంగా వచ్చిన రాజకీయ-వ్యాధి.
భీమా కోరేగావ్ సంఘటనల్ని సాకుగా తీసుకుని, ఆ సభల్లో పాల్గొనని, ఎక్కడెక్కడో వున్న వాళ్ళమీద కూడా ప్రభుత్వం ఒక కుట్ర కేసు బనాయించింది. ప్రధాన మంత్రిని హత్య చేయడానికీ, ప్రభుత్వాన్ని కూల్చడానికీ, కుట్ర పన్నారని ఆరోపణలు! అలా పెట్టిన అబద్దపు కుట్ర కేసులో వరవర రావు గారు ఒక బాధితుడు. ఈయన మీద గతంలో పెట్టిన కుట్ర కేసులన్నీ అబద్దాలే అని కోర్టుల ద్వారానే తేలిపోయాయి. ఇప్పటి కుట్ర కేసు వివరాలు చూస్తే, దీనికి కూడా వీగి పోయే లక్షణాలే స్పష్టంగా వున్నాయి. కానీ, ఈ కేసుల పేరుతో, ప్రజల పక్షాన నిలిచిన మేధావులు, తమ విలువైన కాలాన్నీ, స్వేచ్ఛనీ, పోగొట్టుకుని దుర్భరమైన జైలు జీవితాలు గడపాలి. వాళ్ళు ప్రజల పక్షాన నిలిచింది, ఉద్యోగాల్లోనో, రాజకీయాల్లోనో పెద్ద పదవులు సంపాదించాలని కాదు.
ఎవరో ఇచ్చే డబ్బు సంచుల కోసమూ కాదు. ఒక ఉదాహరణగా, సుధా భరధ్వాజ్ అనే ఆమెని తీసుకుంటే, ఆమె చదివిన చదువుకి, 30 ఏళ్ళ కిందట పెద్ద, సుఖవంతమైన ఉద్యోగం వచ్చేది. కానీ, ఆ అవకాశాల్ని వదిలేసుకుని, చత్తీస్గఢ్లో గని కార్మికుల కోసం, పనిచేయడానికే ఆమె ఇంత కాలమూ వెచ్చించింది. ఇప్పుడు, ఈ తప్పుడు కేసులో జైలు జీవితం గడుపుతోంది. ఈ అబద్దపు కేసుల నైనా త్వరగా తెముల్చుతారా అంటే అదీ జరగదు. ఆ కేసు పెట్టి, రెండేళ్ళయినా, కేసు విచారణ మొదలే కాలేదు. బెయిలుకి ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఎంత క్రూరంగా అంటే, 80 ఏళ్ళొచ్చి, అనేక జబ్బులతో బాధ పడుతోన్న వరవరరావు గారికి బెయిలు ఇవ్వడం లేదు. అప్పీలు ముందుకు కదలని ఒక కేసులో, 90 శాతం కాళ్ళు చచ్చు పడి, ఇతర జబ్బులతో బాధ పడుతున్న సాయిబాబా గారి బెయిలుకి అడ్డుపడుతూ కక్ష కట్టింది ప్రభుత్వం. కానీ, ఢిల్లీలో 1984 లో, జరిగిన సిక్కుల ఊచకోతలో నేరస్తులుగానీ; గుజరాత్లో, 2002లో, మతోన్మాద దాడుల్లో శిక్షలు పడ్డ వాళ్ళుగానీ; హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ, భీమాకోరేగావ్ కుట్ర కేసులో, విచారణే మొదలు కాకుండా, బెయిలు కూడా రాకుండా, జైల్లో మగ్గే వాళ్ళు మగ్గి పోతూనే వున్నారు.
ప్రజల ప్రయోజనాల కోసం, తమకు తోచిన మార్గంలో మేధావులు కృషి చేయడం అంటే సహజంగానే ఏ ప్రభుత్వానికీ నచ్చదు. ప్రభుత్వం అనేది– పార్లమెంటూ, అసెంబ్లీలూ, మంత్రులూ, అధికారులూ, కోర్టులూ, మత గురువులూ, సైన్యమూ, పోలీసూ, ఇంకా ఇతర సాయుధ బలగాలూ, వగైరాలతో కూడిన-ఒక వ్యవస్త. ఇది, ప్రజలనీ, వారిలో భాగమైన మేధావుల్నీ అణిచి వుంచడానికే చరిత్రలో ఏర్పడింది. ఇది బానిస యజమానుల కాలం నించీ, వేల సంవత్సరాలుగా, ఇప్పటి దాకా సాగుతున్నదే.
అబద్దపు కేసుల మీద, మనం మన నిరసనలు తెలపవలిసిందే. కానీ, పాలక వర్గానికి చెందిన రాజకీయ నాయకుల పట్ల ఎటువంటి భ్రమలూ పెట్టుకోకూడదు. ఉదాహరణకి, వరవరరావుగారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కృషి చేశారు కాబట్టీ, ఆ కాలంలో కేసీఆర్ వరవరరావు సలహాలు కోరేవాడు కాబట్టీ, వరవరరావుగారి విడుదలకోసం కేసీయార్ ప్రయత్నించాలని కొందరు రచయితలూ, ఇతర మేధావులూ విగ్న్యప్తులు చేశారు. అలాగే, ఒకప్పుడు వరవరరావుగారికి శిష్యులుగా వుండిన ‘‘విప్లవ కారులు’’, ఇప్పుడు కేసీయార్ ఆస్తానంలో వుంటూ కూడా ఏమీ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన వారూ ఉన్నారు. కానీ, ఆ రకంగా విగ్న్యప్తులు చేయడం ఉద్యమకారుల రాజకీయ-ఆత్మగౌరవానికిభంగం! వృద్ధాప్యంలో, ఎంతో నిస్సహాయ, అనారోగ్య స్తితిలో ఒక ఉద్యమ కారుడు వుండడం, ఉద్యమ సానుభూతి పరులందరికీ ఎంతో దుఖ్ఖం కలిగించే విషయమే. కానీ, తప్పదు. దిటవు గుండెలతో నిలవాలి. చట్టపరంగా (ఆ చట్టాలు ప్రజలకు ఎంత తక్కువ మేలు చేసేవి అయినా) ప్రయత్నం చేస్తూనే, ప్రజాభిప్రాయాన్ని కూడగడుతూ సాగాలి. అలా కూడ గట్టే పనుల్లో ఖండన ప్రకటనలు కూడా భాగమే అయినా, అది సరిపోదు. కార్మిక సంఘాలూ, రైతు సంఘాలూ, వ్యవసాయ కూలీ సంఘాలూ, విద్యార్ధి సంఘాలూ, స్త్రీల సంఘాలూ కదిలి, ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేలా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయని కాదు. దీర్ఘ కాలం పాటు, నిరంతరం, నిలకడగా ప్రయత్నించినప్పుడు ప్రజలు నిజాలు గ్రహించక మానరు.
ప్రభుత్వాలు, అబద్దపు కుట్ర కేసులు పెట్టడానికి కొంచెం అయినా జంకడం లేదంటే, మన గత, ప్రస్తుత ఉద్యమాలలో ఏదో లోపం వుందన్న మాట! అందువల్లే, మేధావుల మీద అబద్దపు కేసులు పెట్టి నానా ఇబ్బందులూ పెడుతున్నా, ఎదురు కాల్పుల పేరుతో ఉద్యమ కారుల్ని పట్టుకుని కాల్చి చంపినా, ప్రజలలో నిరసన గానీ, ప్రతిఘటన గానీ కనిపించడం లేదు. రవాణా స్తంభించదు, గనుల్లో, ఫాక్టరీల్లో, ఇతర పని స్తలాల్లో ఉత్పత్తి కార్యాలు ఆగవు. సమ్మె అనే మాటే వుండదు. అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఇంకా ఏమేమి ప్రయత్నాలు చెయ్యాలో, వాటి గురించి ఆలోచించాలి. అప్పటిదాకా, ఉద్యమ కారులకు ఈ బాధలు తప్పవు.
Courtesy Andhrajyothi