– ఎస్. వినయకుమార్
చట్టంతో సంబంధం లేని మూకలు విధించే శిక్షను అరికట్టడానికి ఒక చట్టం అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. గతేడాది సుప్రీంకోర్టు ఈ అంశంపై వ్యక్తం చేసిన ఆందోళనను, చేసిన సూచనను పట్టించుకోనని మోడీ సర్కార్ చెప్పకనే చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సాగిన మూకశిక్షల (మాబ్ లించింగ్) పూర్వరంగంలో వాటిని అరికట్టడానికి ఒక చట్టం తేవాలని పార్లమెంట్కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ విషయాన్ని పరిశీలించడానికి కేంద్ర మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల బృందం సమావేశం కాకముందే ఓ ఉన్నతాధికారి సర్కార్ వైఖరిని వెల్లడించారు. ప్రస్తుత చట్టమే మూకశిక్ష నేరాన్ని అరికట్టడానికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి సరిపోతుందని చెప్పారు. కాకపోతే పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మూకశిక్ష విధించే నేరగాళ్లను అరికట్టడం, శిక్షించడంలో లోపం పోలీసు శిక్షణలో ఉందా? పాలకుల్లో ఉందా? పరిశీలించాల్సిన అంశం.
పాడిరైతు పెహ్లుఖాన్ మూక హత్యకేసు చూద్దాం. రెండేండ్ల క్రితం పెహ్లు హత్య జరిగిన నాటికి రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉంది. మూకహత్యలు ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగాయి. ఆ కేసుపై సెషన్స్లో తీర్పు వచ్చే నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సెషన్స్ కోర్టు నిందితులపై కేసు కొట్టేసి వారిని విడుదల చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుకు అప్పీల్ చేయాలని నిర్ణయించింది. కొత్త దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. పెహ్లుఖాన్ హత్యాకాండ అంతా వీడియోలో నమోదయింది. సోషల్ మీడియా లో, మీడియాలో అది ప్లే అయింది. మృత్యుదండన విధించినట్టు నేరగాడు గొప్పగా వీడియో ముందు చెప్పాడు. కానీ అల్వార్ సెషన్కోర్టు ఆ వీడియోను పరిగణించలేదు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం గతేడాది ఒక తీర్పు సందర్భంగా చెప్పినప్పటకీ ఫోరెన్సిక్ లాబ్ ధృవీకరణ లేదు కనుక ఆ వీడియోను పరిగనలోకి తీసుకోవడం లేదని అల్వార్ కోర్టు చెప్పింది. అయితే ఫోరెన్సిక్ లాబ్కు వీడియోను పంపకపోవడానికి బాధ్యులెవరు? కోర్టు తేల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే కొత్త దర్యాప్తు బృందం ఆ విషయం తేల్చుతుంది. హత్య జరిగింది నిజం. ఎవరో చేస్తేనే కదా ఆ నేరం జరిగింది. నేరం ఎవరు చేశారో నిర్థారించాల్సిన బాధ్యత కోర్టుకు లేదు. ఆ బాధ్యత పోలీస్ శాఖది. కానీ పోలీసుశాఖ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పని చేస్తోంది. ఆదేశాలన్నీ రాతపూర్వకంగా ఉండనవసరం లేదు. (మూకహత్యల కేసుల్లో ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేయాలని మూక శిక్షలపై మణిపూర్ గతేడాది తెచ్చిన చట్టం పేర్కొంది.) తీవ్ర గాయాలపాలై రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో చనిపోయిన పెహ్లుఖాన్ గాయాలవల్ల కాకుండా గుండెపోటు వల్ల చనిపోయాడని చెప్పించారు. ప్రభుత్వ డాక్టరు చెప్పిన దానికి భిన్నంగా ప్రయివేట్ డాక్టర్ చేత చెప్పించారు. నిందితులకు రాజస్థాన్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చేశారు. అలా క్లీన్చిట్ ఇచ్చిన వారిని ఇప్పుడు ఏర్పాటైన సిట్ బోనులో నిలబెడుతుందా?
గోరక్షణ పేరుతో మూకలు శిక్ష విధించే దుష్ట సాంప్రదాయాన్ని నిరోధించడానికి ఈ ఆగస్టులోనే రాజస్థాన్ ప్రభుత్వం ఒక బిల్లును తెచ్చింది. శాసనసభ ఆమోదం పొందింది. అది ఆ ప్రభుత్వం తనంతట తానుగా తెచ్చిన బిల్లు కాదు. ఏడాది క్రితం గోరక్షక దళాల అకృత్యాలపై ఒక తీర్పును ప్రకటిస్తూ సుప్రీంకోర్టు చేసిన సూచన నేపథ్యంలో తెచ్చిన బిల్లు అది. మొట్టమొదట మణిపూర్లో అలాంటి బిల్లు చేశారు. రాజస్థాన్ ఆ వరుసలో రెండవది. అయితే ఆ బిల్లు ఇండియన్ పీనల్ కోడ్కు సవరణ కనుక రాష్ట్రపతి ఆమోదం లభిస్తేగానీ అది చట్టం కాదు. రాష్ట్రపతి ఆమోదం కావాలంటే ముందుగా కేంద్ర హోంశాఖ ఆమోదం కావాలి. మాబ్ లించింగ్కు ప్రత్యేక చట్టం అవసరంలేదని ఒక ఉన్నతాధికారి చెప్పారు కాబట్టి రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన బిల్లు చట్టమయ్యే అవకాశం కన్పించడంలేదు. ఆ బిల్లు ప్రకారం ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన నేరం కూడా మాబ్ లించింగ్ కిందికి వస్తుంది. ఇలాంటి హత్యలు రాజస్థాన్లో ఎక్కువగా జరిగాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన మూకహత్యల్లో 60శాతం రాజస్థాన్లోనే జరిగాయి. విచిత్రమేమిటంటే కేంద్ర హోంశాఖ దగ్గర మాబ్ లించింగ్ గణాంకాలు లేవు. బీజేపీ పాలనలో మూక హత్య రాజస్థాన్లో ఓ ఘనకార్యంలా సాగింది. తాము విధించిన తీర్పును, దాని అమలును మూకలు వీరోచిత కృత్యంగా వీడియోల ముందుకొచ్చి చెప్పుకొన్నాయి. ఆ దారుణ దృశ్యాలు మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రాజస్థాన్ ఇటీవల తెచ్చిన బిల్లు ప్రకారం మూక హత్య నేరస్తులకు జీవితఖైదుతో పాటు 5లక్షల నగదు జరిమానా విధిస్తారు. బాధితుడు కేవలం గాయాల పాలైతే శిక్ష తక్కువగా ఉంటుంది. పోలీసులు తన ముందించిన సాక్ష్యాలను బట్టి కోర్టులు తీర్పులు చేస్తాయి. పోలీసు శాఖ పని తీరులో పాలకుల రాజకీయ దృక్పథం, ప్రయోజనం ఉండి తీరుతుంది.
న్యాయం ఖరీదు
ఇక మూక శిక్షకు గురై ప్రాణం పోగొట్టుకొన్న పెహ్లుఖాన్ కుటుంబం స్థితి చూద్దాం. మన వ్యవస్థలో అన్యాయం జరిగిన వాడికి న్యాయం అన్నది ఎంతో ఖరీదుపైగానీ దక్కదు. పెహ్లు హత్యపై పోలీసులే కేసు పెట్టి ఉండవచ్చు. ప్రభుత్వ న్యాయవాది ఆ కేసును వాదించి ఉండవచ్చు. కానీ అంతటితో సరిపోదు. ఇతర ఖర్చుల మాటేమిటి? హత్యకేసు విచారణ సందర్భంగా పెహ్లు కుటుంబానికి ఉన్న ఆర్థిక వనరులు హరించుకుపోయాయి. ఆ కుటుంబం పెంచుకొన్న పశువులు పోయాయి. హత్య జరిగిన నాడు అల్వార్ జిల్లా ఎస్పీ ప్రకటించిన రూ.5లక్షలు అందలేదు. దేశం నలుమూల నుంచి పెహ్లు కుటుంబానికి న్యాయం కోసం పంపిన రూ.12లక్షలు వారిని కొంతవరకు ఆదుకొన్నాయి. హర్యానాలోని తమ గ్రామం నుంచి అల్వార్కు రాకపోకలు, తదితర ఖర్చులతో పాటు పెహ్లు పెద్ద కొడుకుకు కోర్టు చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది. 2017 ఏప్రిల్ 1న జైపూర్లో పెహ్లు ఒక ఆవునుకొని తీసుకెళ్తుండగా జైపూర్ – ఢిల్లీ హైవేపై ఆయనను గోరక్షక మూక హత్య చేసింది. ఖాన్ తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆవును లారీలో తోలుకెళ్తండగా దాడి జరిగింది.
కేసు దాదాపు రెండేండ్లు సాగింది. ఖాన్ ఇద్దరు కొడుకులతో పాటు 44మందిని సాక్షులుగా విచారించారు. పోలీస్ దర్యాప్తునకు ప్రాసిక్యూటర్ ప్రవేశ పెట్టిన సాక్ష్యానికి మధ్య తేడా ఉందని న్యాయవాదులు చెపుతున్నారు. వీడియోలో కనిపిస్తున్నది నిందితులేనని ప్రాసిక్యూటర్ రుజువు చేయలేకపోయినట్టు కోర్టు భావించింది. నిందితులను ఖాన్ కుమారుడు గుర్తుపట్టలేక పోయాడని కూడా కోర్టు భావించింది. నిందితుల పేర్లను గుర్తు పెట్టుకొన్నవాడు మొహాలు ఎందుకు గుర్తు పెట్టుకోలేదన్న ప్రశ్న తలెత్తింది. రెండేండ్ల తర్వాత 30మందిని నా ఎదురుగా నిలబెట్టి అందులో దాడి చేసినవారెవరో గుర్తించమంటే ఇంతకాలం తర్వాత ఎలా గుర్తించగలను అని పెహ్లుఖాన్ కొడుకు ప్రశ్నిస్తున్నాడు. పెహ్లుఖాన్ కుమారుల న్యాయవాది ఖాసింఖాన్ చెపుతున్నదాని ప్రకారం ఆ కేసులో రాష్ట్ర పోలీసు, సీఐడీ – సీబీ ఇచ్చిన నివేదికలు పరస్పర భిన్నంగా ఉన్నాయి.
పెహ్లు భార్య చెప్పిన దాని ప్రకారం, ఒక ఆవుతో కలిపి ఓ అరడజను గేదెలను పెంచుకొని ఆ ఆదాయంతో కుటుంబం బతికేది. కేసు ఖర్చుల కోసం కుటుంబం గడవడానికి పశువులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక దశలో నిందితుల బెయిల్ అప్లికేషన్కు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక అపియరెన్స్ కోసం లాయర్ రూ.55 వేలు ఫీజు అడిగితే ఒక గేదెను అమ్మి ఆ డబ్బు చెల్లించినట్టు, పెహ్లు కొడుకు చెప్పాడు. అతని ఇద్దరు తమ్ములు అత్తెసరు జీతాలపై లారీల మీద పని చేస్తున్నారు. త్రిపుల్ తలాఖ్పై సుప్రీం చెప్పిందంటూ చట్టం తెచ్చిన మోడీ ప్రభుత్వం మాబ్ లించింగ్పై సుప్రీం చెప్పినదాన్ని పెడచెవిన పెట్టింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ప్రస్తుత చట్టమే మాబ్ లించింగ్ నేరాన్ని అరికట్టడానికి సరిపోతుంది. కాని ప్రస్తుత చట్టం ఎలా లోప భూయిష్టంగా ఉందో పెహ్లుఖాన్ కేసులో చూశాం. అయితే చట్టమున్నంత మాత్రాన సరిపోదు. అది ఏపాటిగా అమలవుతుందనేది ఆ ప్రభుత్వ దృక్పథాన్ని బట్టే ఉంటుంది.
(Courtacy Nava Telangana)