జైలు నిర్బంధంలో ఉన్నవారి జీవితానికి ఆరోగ్య పరంగా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉన్నప్పుడు, వారిని తమ ఇంటికి పంపించడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా తీసుకునే సర్వసాధారణమైన చర్య. ఇటాలియన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన ఆంటోనియో గ్రామ్క్సీ ఆరోగ్యం బాగా దిగజారిన సమయంలో కూడా మొదట ఫార్మియాలోని ఆస్పత్రికి, తరువాత రోమ్లోని ఆస్పత్రికి, చివరగా 20ఏండ్ల జైలు శిక్షకుగాను ఆయన 11ఏండ్లు కారాగారశిక్షను అనుభవించిన తరువాత విడుదల చేయమని బెనిటో ముస్సోలినీని అంతర్జాతీయంగా ఒత్తిడి చేశారు. కానీ అప్పటికే బాగా ఆలస్యం కావడంతో గ్రామ్క్సీ విడుదల అయిన వారం రోజుల లోపే మరణించాడు.
మన దేశంలో 1948లో కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ రెండవ మహాసభ జరిగిన తరువాత కమ్యూనిస్ట్లను పెద్ద సంఖ్యలో నిర్బంధించారు. ఆ మహాసభలోనే పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంతో వాదనలకు దిగాలని తీర్మానాన్ని ఆమోదించారు. కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఖైదీలంతా జైలు పరిస్థితులను మెరుగు పర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగినారు. ఈ నిరాహారదీక్ష కారణంగా ఆరోగ్యాలు దెబ్బ తిన్న ఖైదీలను నెహ్రూ ప్రభుత్వం విడుదల చేసింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఉన్న నా తండ్రి కూడా విడుదల అయిన వారిలో ఒకరు. ఆయన 43రోజుల పాటు నిరాహారదీక్ష చేశాడు.
ఇప్పుడున్న పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే, ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం దెబ్బతిని, ఇబ్బంది పడుతున్న ఖైదీలను విడుదల చేయాల్సిన అవసరం గురించి కూడా ఆలోచించడం లేదు. భీమా-కోరేగావ్ కేసులో నేరారోపణ చేయబడిన 79ఏండ్ల వరవరరావును రెండు సంవత్సరాలుగా జైల్లోనే ఉంచుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కంటే ముందే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇప్పుడు ఆయనకు కరోనా సోకడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. అయినా నేటికి కూడా ప్రభుత్వం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఆయనను విడుదల చేసేది, లేనిది ఇంత వరకు ప్రకటించలేదు. ఇంత జరిగినా, వాస్తవం ఏమిటంటే ఆయనను కేవలం విచారణ కోసమే జైల్లో ఉంచుతున్నారు. ఆయన పైన మోపిన ఏ నేరం ఇంత వరకు రుజువు కాలేదు. నేరం చేశాడని రుజువు అయ్యేంతవరకు ఏ వ్యక్తినైనా నిరపరాధిగానే పరిగణించడం ప్రాథమిక నియమం. నిరపరాధి అయిన ఆయనను ఆరోగ్యం క్షీణించినప్పటికీ, ఈ వయస్సులో అనేక ఇతర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకినప్పటికీ జైల్లోనే ఉంచుతున్నారు.
భీమా-కోరేగావ్ కేసులో నేరారోపణ చేయబడిన వారి గురించి కూడా ఇదే విధంగా చెప్పవచ్చు. వారిపై మోపబడిన నేరాలు ఏవీ రుజువు కాలేదు, కాబట్టి వారంతా ఏ నేరం చేయని నిరపరాధులు. వారంతా వయసు మళ్ళి, వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ వారిని ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన జైల్లో నిర్బంధించారు.
చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం కింద పూర్తిగా ఒక నిరపరాధిని ఎక్కువ కాలం పాటు జైల్లో పెట్టడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించాలి. ఇంతకు ముందు ఎన్నడూలేని ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయాన ఆ చట్టం ప్రకారం వారిని జైలు నిర్బంధంలో ఉంచడం అమానవీయతను సూచిస్తుంది. ఈ అమానవీయతలో న్యాయస్థానం యొక్క భాగస్వామ్యం కూడా ఉందన్న ఆరోపణ నిజమైతే, అది తన పిరికితనానికి సాక్ష్యంగా ఉంటుంది.
ఈ ఖైదీలకు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్లు ముందుకు తీసుకొని వచ్చిన వాదనల తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. జైల్లో ఉంటే వారికి తగిన విధంగా, సరియైన ఏర్పాట్లు చేస్తున్నట్టు, ఖైదు నుంచి తప్పించుకునేందుకు వైరస్ మహమ్మారిని సాకుగా చూపుతున్నారని వారిపై ఆరోపణలు చేస్తున్నారు. వారు ఉపయోగించిన భాష ‘నేరం రుజువయ్యేంత వరకు ఎవరైనా నిరపరాధే’ అని అందరూ (నేరాన్ని మోపిన, నేరం మోపబడిన వారిరువురూ) అంగీకరించే ప్రాథమిక నియమాన్ని తిరస్కరిస్తున్నట్టుగా ఉంది.
ఈ నియమం ప్రకారం భీమా- కోరేగావ్ కేసులో ఆరోపణలు చేయబడిన వారంతా ఇప్పుడు నిరపరాధులు. ఒక నిరపరాధి జైలు నుంచి విడుదల కావాలని కోరుకోవడం అతని హక్కు, అవకాశవాద వ్యూహం కాదు. ఒక నిరపరాధి కోరిన స్వేచ్ఛ నిజాయితీలేని, ఖండించదగిన చర్యగా చూడటం అంగీకరించబడే ఒక ధర్మశాస్త్రానికి ప్రమాణంగా మారుతుంది. దాని వల్ల ‘రుజువు అయ్యేంతవరకు నిరపరాధి’ అనే నియమాన్ని తిరస్కరించినట్టు అవుతుంది. అంటే మానవ హక్కులను కూడా నిరాకరించినట్టుగా భావించాలి.
ఆరోపణలు సష్టించిన తరువాత బెయిల్ మంజూరును నిరాకరించడానికి సాధారణంగా వారు చూపించే చట్టపరమైన కారణాలు ఏమంటే, బెయిల్పై విడుదల అయిన వ్యక్తి సాక్ష్యా ధారాలను మార్చే అవకాశం ఉంటుంది, ఆ వ్యక్తి సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని. భీమా-కోరే గావ్ కేసులో పోలీసులు తమకు అవసరమైన సాక్ష్యా ధారాలను ఇప్పటికే తీసుకున్నారు కాబట్టి సాక్ష్యాలను మార్చే అవకాశమే లేదు. దానితో పాటు పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు లాప్టాప్ రూపంలో ఉన్నాయి. లాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఎటువంటి సాక్ష్యాధారాలను మార్చే అవకాశమే లేదు.
ఇటువంటి కేసులో సాక్ష్యులను ప్రభావితం చేసే సమస్యే ఉత్పన్నం కాదు. ఎందుకంటే పోలీసులు వారిపై మోపిన నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఇక్కడ సాక్షిగా లేడు. కాబట్టి భీమా-కోరే గావ్ కేసులో నిందారోపణలు చేయబడిన వారికి బెయిల్ మంజూరు చేయకపోవడం అనేది, న్యాయానికి భంగపాటు కలిగే అవకాశం ఉందని నిష్కల్మషమైన ఆందోళన కన్నా ద్వేషపూరితంగానే బెయిల్ నిరాకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ న్యాయవ్యవస్థను, కార్యనిర్వహక వర్గంతో కలిసి వెళ్ళేందుకు సమయం ఇవ్వకుండా తొందర పెడు తున్నారా?
ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రభుత్వం దేనిని జైలు అని అంటుందో అదే జైలు. పూణేలో గాంధీజీని నిర్భంధించిన అఘాఖాన్ రాజభవనం చారిత్రాత్మకంగా ఒక జైలు కాదు. గాంధీజీని అక్కడ ఉంచేందుకు దానిని జైలుగా పిలిచారు. అదే విధంగా, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను నిర్భంధించి ఉంచిన అహ్మద్నగర్ కోట ఒక ప్రఖ్యాతమైన జైలు కాదు. అయినప్పటికీ వర్కింగ్ కమిటీ సభ్యుల సౌకర్యార్థం దానిని జైలుగా మార్చారు. అదేవిధంగా ఇటీవల కాశ్మీర్లో అనేక మంది నాయకులను నిర్భంధించి ఉంచిన భవనాలేవీ సాధారణ జైళ్ళు కాదు. కేవలం ఆ నాయకుల కోసం వాటిని జైళ్ళుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వమే కాక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దేనిని జైలుగా మార్చాలనే విచక్షణ ఉంటుంది.
ఒకవేళ భీమా-కోరేగావ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కోర్టులు బెయిల్ మంజూరు చేయకుంటే, సాధారణ కరోనా వైరస్ సోకిన జైళ్ళ లాంటివి కాకుండా, కరోనా వైరస్ సోకని ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంగణాలను జైళ్ళుగా పరిగణిస్తూ వారిని అక్కడే ఉంచే నిర్ణయాన్ని చేసే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ ఉంది. వారిని తిరిగి ఇంటికి పంపి పోలీసుల పహారా మధ్య ‘హౌస్ అరెస్ట్’లో ఉంచవచ్చు. లేదా ‘హౌస్ అరెస్ట్’లో ఉంచి ప్రతీ రోజూ ఒక నియమిత సమయానికి స్థానిక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవచ్చు. (నా తండ్రి దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిరాహారదీక్ష తరువాత జైలు నుంచి విడుదల అయినప్పుడు పోలీసుస్టేషన్కి వెళ్ళి వచ్చిన విధంగా).
రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో కొంత వరకు విచక్షణ ఉంది. కనీసం వాటికి ఈ విచక్షణ ఉందో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉంది. దానిలో కనీసం ఒకటైనా ఖైదీల హక్కుల కోసం నిలబడి కేంద్ర ప్రభుత్వ ఆజ్ఞల రేఖ దాటి బయటకు రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వారు అటువంటి పని చేయలేదన్న నిజం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ పిరికితనం వ్యాపించిందని సూచిస్తున్నది. ప్రజా స్వామిక హక్కులను కాపాడాలంటే ఆ పిరికితనాన్ని అధిగమించాలి.
భీమా-కోరేగావ్ కేసు యొక్క ప్రాధాన్యత దీనిలోనే ఇమిడి ఉంది. దృష్టి పెట్టవలసిన కేసులు అనేకం ఉన్నప్పుడు భీమా-కోరేగావ్ కేసు గురించే ఎందుకు అంత కలత చెందడం అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. దానికి జవాబు, అనేక కేసులలో భీమా- కోరేగావ్ కేసు ఒక్కటే ఒక నమూనా కేసు అనే వాస్తవంలోనే ఇమిడి ఉంది. ‘ఎవరికైనా జరిగేది ప్రతీ ఒక్కరికీ జరుగవచ్చు’. కాబట్టి భీమా- కోరేగావ్ కేసులో న్యాయానికి ఇచ్చే హామీ, ఇతర కేసుల్లో కూడా న్యాయానికి హామీ ఇచ్చే సాధనంగా ఉంటుంది.
ప్రభాత్ పట్నాయక్
”ది టెలిగ్రాఫ్” సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్
Courtesy: NT