రచన: బి. భాస్కర్
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రిని కోరిన కోరిక ఫలించింది. రేపటి నుంచి రిజర్వు బ్యాంకు ప్రత్యేకంగా సమకూర్చిన హెలికాప్టర్లు మన రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలను చక్కర్లు కొట్టి ప్రజలపై నోట్లు వెదజల్లనున్నాయి.
తొలి ప్రాధాన్యత పాపం లాక్ డౌన్ వల్ల పన్లు లేకుండా పస్తులు ఉంటున్న వలస కార్మికులపై విసిరేయమని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఒక ప్రయారిటీ లిస్టును హెలికాప్టర్ చోదకులకు మన ప్రధాన కార్యదర్శి నుంచి జీవో అందింది. జాబితాలో రెండో ప్రయారిటీ వ్యవసాయ కూలీలు, ఇలా వరుసగా ఉపాధి కార్మికులు, అనాధలు, వృద్ధ మహిళలు, రోగిష్టి వారు, బాల కార్మికులు ఉన్నారు.
మరి తన సంగతి ఏమిటని ట్రాన్స్ జెండర్ కమిటీ, ఆశా వర్కర్ల సంఘం, జర్నలిస్టుల సంఘం ఇలా పలు అసోసియేషన్ల వారు జాబితాలో చోటు లేదని తమకు అన్యాయం చేస్తున్నారని ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు.
ప్రస్తుతానికి రేపటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పట్టిక ప్రకారమే డబ్బులు వెదజల్లు తామనీ ఇందులో సవరణలు, ఎడిషన్లు చేసే అధికారం తనకు లేదని హెలికాప్టర్ డ్రైవర్ చెప్పారు.
సరే ఇంతకీ చినిగిపోకుండా ఉన్న కొత్తగా ముద్రించిన నోట్లు వేస్తే బావుంటుందని అవి అయితే ఈ lockdown నెలలపాటు ఉన్న పాడైపోకుండా భద్ర పరచికోవచ్చని పలువురు ఈవిలేకరితో అన్నారు. మరికొందరేమో పది పది రూపాయల లాంటి చిన్న నోటు బదులు కనీసం డిమానిటైజేషన్ సమయంలో ముద్రించిన ₹2000 నోట్లు కట్టలు కట్టలుగా హెలికాప్టర్ మనీ వస్తే బావుంటుందని ఆశిస్తున్నారు. చెల్లని చిల్లర నాణేలను అసలు వద్దని కోరుతున్నారు. ఎప్పుడో ఏదో ఒకటి సలహాలు చెప్పందే ఏమీ తోచని సీనియర్ సిటిజన్ లో మాత్రం దక్కిందే వరమని సరిపెట్టుకొండయ్య ఈ గొంతెమ్మ కోరికలు ఏమిటి అంటూ విసుక్కున్నారు. ఇంతకీ హెలికాప్టర్ దేవుళ్ళు ఏం చేస్తారో రేపటిదాకా ఆగాలి మరి!