– ఎన్. వేణుగోపాల్
ఒక పని చేస్తున్నామంటే అది మనం చేయగలం గనుకనో, చేయాలని ఎవరో ఆదేశించారు గనుకనో, ఆ పని చేయాలని మన బుర్రలో బుద్ధి పుట్టింది కనుకనో మాత్రమే చేయగూడదు. వ్యక్తిగత స్థాయిలోనైనా అవి కారణాలు కాగూడదు, ఇక సామూహిక, సామాజిక, ప్రభుత్వ నిర్వహణాస్థాయిలో, అందులోనూ ప్రజాస్వామ్యం అని చెప్పుకునే చోట, అవి ఎంతమాత్రం తగిన కారణాలు కావు. ఆ పని అవసరమేమిటో నిస్సందేహంగా తేల్చాలి. ఆ పని వల్ల ప్రయోజనాలేమిటో, నష్టాలేమిటో బేరీజు వేయాలి. ఆ ప్రయోజనాలూ, నష్టాలూ కూడా తాత్కాలిక స్థాయిలో, మధ్యంతర స్థాయిలో, దీర్ఘకాలిక స్థాయిలో ఉంటాయి. వాటిని ఎప్పటికప్పడు అంచనా వేయాలి. అంతిమ ఫలితం ప్రయోజనకరమా, హానికరమా తేల్చాలి. ఆ ప్రయోజనాలనూ, నష్టాలనూ పారదర్శకంగా, సమస్త సమాచారాన్నీ, అన్ని కోణాలనూ విశ్లేషించిన ప్రాతిపదిక మీద సమగ్రంగా బేరీజు వేయాలి. ఆ పనిలో ఇమిడిఉన్న అన్ని అంశాలనూ, ఆ పని వల్ల పర్యవసానాలనూ సంపూర్ణంగా, పారదర్శకంగా ప్రజల్లో చర్చకు పెట్టి నిగ్గు తేల్చిన తర్వాతనే, ఆ పని అవసరమైనదనీ, ప్రయోజనకరమైనదనీ, నష్టాలకన్న ప్రయోజనాలే ఎక్కువ అనీ శాస్త్రీయంగా, నిస్సందేహంగా నిర్ధారించిన తర్వాతనే ఆ పని మొదలుపెట్టాలి. అన్నిటికన్న ముఖ్యంగా ఆ పని వల్ల ప్రభావితులయ్యే ప్రజా సమూహం ముందర ఈ సమాచారమూ వివరణలూ విశ్లేషణలూ అన్నీ ఉంచి ఆ ప్రజా సమూహం నిర్ణయమే అంతిమ నిర్ణయంగా తీసుకోవాలి. అది ప్రజాస్వామిక పద్ధతి. వ్యక్తి తన ఇష్టారాజ్యంగా ఏ పని అయినా చేసుకోవచ్చు, రాచరికంలో, భూస్వామ్యంలో నిర్ణయాధికారం ఉన్నవాళ్లు తమ ఇష్టారాజ్యంగా ఏ పని అయినా చేశారు. కాని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనీ, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వల్ల అనీ అనుకున్నప్పుడు, అంటున్నప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన ప్రజాస్వామిక పద్ధతి ఇది. తప్పనిసరిగా ఏ చర్చలోనైనా, నిర్ణయంలోనైనా ప్రజలను భాగస్వాములు చేయవలసిన అవసరం ఉంది.
ఇటువంటి ఏ ప్రజాస్వామిక పాలనా పద్ధతినీ పాటించకుండా నల్లమల ప్రాంత జనజీవనంమీద, మొత్తంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అనేక ప్రాంతాల ప్రజల మీద, పర్యావరణం మీద, ఆర్థిక, సామాజిక వ్యవస్థల మీద పెను ప్రభావం వేసే యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. యురేనియం తవ్వకాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలోని అణువిద్యుత్ శాఖకు చెందిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ, ఆ తవ్వకాలు జరిగే ప్రాంతాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి గనుక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందులో భాగం ఉంటుంది. తవ్వకాలకు అవసరమైన వేరువేరు అనుమతుల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసి ఉంటాయి. నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలనే, పోరాడాలనే కోరిక ఉంటే తన పరిధిలోని అనుమతులు ఇవ్వకుండా ఉండడమో, యురేనియం గనుల తవ్వకానికి అభ్యంతరం చెప్పగల చట్టపరమైన కారణాలను ఉపయోగించుకోవడమో చేయవచ్చు. కానీ అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమూ కూడా నల్లమల యురేనియం విషయంలో కలిసికట్టుగా తోడుదొంగలుగా, నల్లమల ప్రజల మీద బందిపోట్లలా వ్యవహరిస్తున్నాయి. ప్రజాజీవితం మీద, పర్యావరణం మీద దారుణమైన దుష్ఫలితాలు చూపగల ఈ కార్యక్రమాన్ని సామదానభేద దండోపాయాలతో ముందుకు తీసుకుపోవడానికే ఈ తోడుదొంగలు ప్రయత్నిస్తున్నారు.
నల్లమలలో, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో అమ్రాబాద్ – ఉడిమల్ల – నారాయణపూర్ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం ”సూత్రప్రాయ” అనుమతి ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖకు సంబంధించిన సలహా మండలి మే 22న తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. అది సూత్రప్రాయ అనుమతి మాత్రమేనని, పూర్తిస్థాయి, అవసరమైన అనుమతులు ఇంకా రావలసే ఉందని రాష్ట్రప్రభుత్వ అటవీశాఖ అధికారులు అప్పటికి దాటవేయడానికి ప్రయత్నించారు. ప్రజాందోళన మొదలై ఎందరో రాజకీయ నాయకులు, పౌరసమాజ కార్యకర్తలు, రచయితలు, విద్యార్థులు, జర్నలిస్టులు నల్లమల వెళ్లి నిజనిర్ధారణ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. అక్కడి ప్రజల్లో ఉన్న ఆందోళనలను, నిరసనను బైటి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కొందరి పర్యటనల మీద ఆంక్షలు విధించి, అడ్డుకుని, కేసులు కూడా నమోదు చేసింది. ఈలోగా జూలై మూడో వారంలో కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వార్తలు వచ్చాయి. కానీ, ఆగస్ట్ 16న కూడా రాష్ట్ర అటవీ శాఖా మంత్రి తాము అటువంటి అనుమతులేవీ ఇవ్వలేదని అన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ జరుపుతున్న కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం నిజనిర్ధారణకు వెళుతున్న వారి మీద అమలు చేస్తున్న నిర్బంధం, చెపుతున్న ఆకుకు అందని పోకకు పొందని అబద్ధాలు చూస్తుంటే రెండు ప్రభుత్వాలూ చెపుతున్న విషయాల కన్న చెప్పని విషయాలే ఎక్కువనిపిస్తున్నది. ప్రజలకు అవసరమైన, ప్రజల హక్కు అయిన నిజాలు చెప్పడం లేదని స్పష్టమవుతున్నది.
వాస్తవానికి ఆరేడు సంవత్సరాల కిందనే తవ్వకాలు మొదలయ్యాయని, మంచినీళ్ల కోసం బోరు బావులు తవ్వుతున్నామనే పేరుతో యురేనియం నిక్షేపాల అన్వేషణకు బోర్లు తవ్వారని, అప్పుడు ప్రజలు అడ్డుకుంటే, ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాలకు ప్రభుత్వ కార్యాలయాల లోపలే బోర్లు వేసి నమూనాలు సేకరించి తీసుకుపోయారని, ఆ నమూనాల ఆధారంగానే ప్రస్తుత అనుమతులు ఇచ్చారని స్థానికులు అంటున్నారు. ఇది క్షేత్రస్థాయి అనుభవం గనుక ఇందులో సాంకేతిక పరిజ్ఞానం తగినంత లేకపోయినా, వాస్తవం ఎక్కువ ఉండి ఉంటుంది.
ఒకవైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోపల యురేనియం తవ్వకాల వల్ల రానున్న దుష్పరిణామాల గురించి చర్చ జరుగుతుండగానే, ప్రభుత్వం బహుశా ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించే ప్రకటనలూ వార్తాకథనాలూ ఎన్నో విడుదల చేస్తున్నది. అదే నల్లమలలో భారీగా క్వార్ట్జ్ ఖనిజం ఉన్నదని గుర్తించామనీ, పెద్దఎత్తున గిరాకీ ఉన్న ఈ ఖనిజం తవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామనీ ఒక వార్తాకథనం. నల్లమలలో బంగారం ముడి ఖనిజం, వజ్రాలు కూడా ఉన్నాయనీ వాటి తవ్వకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయనీ మరొక వార్తాకథనం. నల్లగొండలో ఎప్పుడో మొదలై మూలకు పడిన పథకం లంబాపూర్ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి మరొకసారి అమలులోకి రాబోతున్నదని మరొక వార్తాకథనం. నిజానికి ఈ వార్తల్లో ఏవి నిజమో, ఏవి నిజం కాదో చెప్పలేని ఒక గందరగోళ స్థితి సృష్టించి, ఆ గందరగోళాన్ని వాడుకుని తాను అనుకున్నచోట అనుకున్నట్టుగా తవ్వకాలు ప్రారంభించాలని ప్రభుత్వాలు కుటిల పన్నాగాలు పన్నుతున్నాయన్నది నిజం. వారు చేస్తున్నది నిజంగా మంచి పనీ, ప్రజా ప్రయోజనకరమైన పనీ అయితే ఇంత రహస్యమూ, ఇన్ని అబద్ధాలూ, ఇన్ని మాట మార్పులూ అవసరం లేదు.
కానీ వారు తలకెత్తుకున్న పని దుర్మార్గమైన పని గనుక ఈ పిల్లిమొగ్గలు తప్పవు. యురేనియం తవ్వకాలు అనే పని బహుశా పర్యావరణ విధ్వంసాలలోకెల్లా, జనజీవన విధ్వంసాలలోకెల్లా అత్యంత దుర్మార్గమైనది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదించడానికి వీలులేనిది.
యురేనియం వల్ల ఏకైక వినియోగం అణ్వాయుధాల తయారీ మాత్రమే. అంతకంతకూ ఎక్కువ యుద్ధ పిపాస ఉన్నవారికి తప్ప మరెవరికీ యురేనియం తవ్వితీసి, శుద్ధిచేయాలనే ఆలోచనే కలగదు. దాన్ని అణు విద్యుదుత్పాదనకు వినియోగిస్తామని ప్రజలను నమ్మించడానికి ఒక అబద్ధం చెపుతుంటారు గాని, ఆ అణువిద్యుత్తు ఉత్పాదనలో ఉప ఉత్పత్తిగా మిగిలే వ్యర్థ పదార్థాలన్నీ అణ్వాయుధాల తయారీకి మాత్రమే ఉపయోగపడతాయి. యుద్ధోన్మాదులైన సామ్రాజ్యవాదులకూ, వారి దళారీలకూ, అణు విద్యుత్ కేంద్రాల యంత్రసామగ్రి తయారు చేసే బహుళ జాతి సంస్థలకూ తప్ప మరెవరికీ యురేనియం అవసరం లేదు.
అసలు అణువిద్యుదుత్పత్తి అవసరమా, అది మిగిలిన ప్రత్యామ్నాయ వనరులకన్న చౌకనా, సురక్షితమా అని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఒకప్పుడు అణువిద్యుత్ వైపు వెళ్లిన దేశాలు కూడా దానినుంచి పక్కకు తప్పుకుంటున్నాయి. భవిష్యత్తంతా అణువిద్యుత్తుదేననీ, 2000 నాటికి ప్రపంచంలో వెయ్యి అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామనీ అణు విద్యుత్ కేంద్రాల యంత్ర సామగ్రి తయారు చేసే బహుళ జాతి సంస్థలు 1970లో ఆర్భాటంగా ప్రకటించాయి. కానీ, ఆ అంకెను 2000 నాటికి కాదుగదా, 2019 నాటికి కూడా చేరలేకపోయాయి. అణు విద్యుదుత్పాదన అంతగా విమర్శలకు పాత్రమైంది. తాజా గణాంకాలు దొరుకుతున్న 2016 నవంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న అణువిద్యుత్ కేంద్రాలు 450 మాత్రమే. అలా యురేనియం తవ్వకాలు అనవసరం అనే అంశం ఒకటయితే, ఆ తవ్వకాల వల్ల చిన్నాభిన్నమైపోయే జనజీవితం, భారీగా జరిగే పర్యావరణ విధ్వంసం వంటి కారణాలు మరింత తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవలసినవి.
ఈ తవ్వకాల తొలిదశ 76చ.కి.మీ ప్రాంతంలో (ఇరవై వేల ఎకరాల్లో) నాలుగు వేల లోతయిన గొట్టపుబావుల తవ్వకం ద్వారా జరగనుందని తొలి అంచనాలు చెపుతున్నాయి. ఈ విషయాల్లో ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడం వల్ల, తరచుగా అబద్ధాలు చెపుతుండడం వల్ల ఈ విస్తీర్ణం లక్ష ఎకరాల దాకా విస్తరించవచ్చునని ప్రజలు, ఆందోళనకారులు సందేహిస్తున్నారు.
ప్రభావిత ప్రాంతంలో వేలాదిమంది చెంచులు జీవిస్తున్నారు. తవ్వకాల వల్ల వాళ్లు నిర్వాసితులు కావడం ఒక ఎత్తయితే, ఆ తవ్వకాల వల్ల కలిగే అణుధార్మికత వల్ల మొత్తం నల్లమల ప్రాంతం, బహుశా పొరుగు జిల్లాల ప్రజల ఆరోగ్యాల మీద తీవ్రమైన దుష్పరిణామాలు కలుగుతాయి. ఈ తవ్వకాల అణుధార్మికత వ్యాప్తి పరిధిలోకి కృష్ణానది, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు వస్తాయి గనుక ఈ నీటిని తాగునీరుగా, సాగునీరుగా ఉపయోగించే ప్రాంతాలన్నిటా అణుధార్మికత వ్యాపిస్తుంది. అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోకెల్లా ముఖ్యమైన పులుల ఆవాస ప్రాంతం. తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు అక్కడ కనీసం 24 పులులు ఉన్నాయి. ఈ తవ్వకాలతో, తత్ఫలితంగా జరిగే రోడ్ల నిర్మాణం, హడావుడితో, అణుధార్మికత వ్యాప్తితో పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పులులు మాత్రమే కాక ఈ అరణ్యంలో చిరుతపులి, ఎలుగుబంటి, అడవి కుక్క, జింక, నీల్ గారు, నక్క వంటి వందలాది జంతు జాతులున్నాయి. అపారమైన జీవ వైవిధ్యానికి నెలవైన ఈ అరణ్యంలో 70రకాల స్తన్యజంతు జాతులు, 300రకాల పక్షి జాతులు, 60రకాల సరీసృపాలు, 600రకాల వృక్ష జాతులు ఉన్నాయని ఒక అంచనా. తవ్వకాల వల్ల, అణుధార్మికత వల్ల ఈ జీవవైవిధ్యమంతా నాశనమవు తుంది. అడవి నాశనమవుతుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రా ల ఊపిరితిత్తులు నాశనమవుతాయి. అణువిద్యుత్ కేంద్రాల యంత్ర సామగ్రి తయారు చేసే బహుళ జాతి సంస్థ లకు కొన్ని వేల కోట్ల రూపాయలు, వారి దళారీలకు, కంట్రా క్టర్లకు, రాజకీయ నాయకులకు కొన్ని వందల కోట్ల రూపాయలు దక్కుతాయేమో గాని, అందుకోసం ప్రజలూ పర్యావరణమూ ఈ మూల్యం చెల్లించవలసిందేనా?
(Courtacy Nava Telangana)