అమరావతి: విశాఖ మన్యంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి కేటాయించిన బాక్సైట్ గనుల లీజును రాష్ట్రప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. మన్యంలో వివిధ చోట్ల ఉన్న బాక్సైట్ గనులను ఉపయోగించుకుని అల్యూమినియం కర్మాగారాలు నెలకొల్పాలని నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 2005లో అన్రాక్, జిందాల్ అనే రెండు కంపెనీలతో కర్మాగారాల స్థాపనకు ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలకు బాక్సైట్ సరఫరా చేసేందుకు ఏపీఎండీసీకి 30ఏళ్లపాటు బాక్సైట్ గనులను లీజుకిస్తూ ఉత్తర్వులిచ్చింది.
విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని జెర్రెల బ్లాక్-1లో 85 హెక్టార్లు, బ్లాక్-2లో 617 హెక్టార్లు, బ్లాక్-3లో 460 హెక్టార్లు; అరకు మండలంలోని రక్తకొండ రిజర్వు ఫారె్స్టలో 113 హెక్టార్లు, చిట్టంగొండి ప్రాంతంలో 152 హెక్టార్లు, గాలికొండ గ్రామంలో 93 హెక్టార్లు కేటాయించింది. ఈ గనుల నుంచి ఏపీఎండీసీనే బాక్సైట్ తవ్వి.. దాన్ని ప్రైవేటు కంపెనీలకు సరఫరా చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా సరఫరా చేసేందుకు 2008లో ఏపీఎండీసీ-అన్రాక్, ఏపీఎండీసీ-జిందాల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది.
దీనిపై నాటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దుచేసింది. 2016లో ఏపీఎండీసీ-అన్రాక్, ఏపీఎండీసీ-జిందాల్ మధ్య ఉన్న బాక్సైట్ సరఫరా ఒప్పందాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఆ రెండు కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. తాజాగా ఏపీఎండీసీకి కేటాయించిన ఆరు బ్లాకుల్లోని బాక్సైట్ గనులను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
గిరిజనులకు పండుగరోజు: పుష్పశ్రీవాణి
గిరిజనులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం శుభపరిణామమని.. ఇది గిరిజనులకు పండుగ రోజని సచివాలయంలో విలేకరులకు చెప్పారు. సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Courtesy AndhraJyothy…