ఒక సుసంపన్న పారిశ్రామిక పెట్టుబడిదారుడి కడుపున పుట్టి, సకల సంపదలతో తులతూగే అవకాశాలుండి కూడా, తన స్వంత వర్గమైన పెట్టుబడిదారీ వ్యవస్థను కూకటి వేళ్ళతో కూల్చివేసే విప్లవ లక్ష్యంతో అగ్గి బరాటాగా మారిన విప్లవ వైతాళికుడే ఫ్రెడరిక్ ఎంగెల్స్! అదే ఎంగెల్స్ రాజకీయ విశిష్టత!
వర్గరీత్యా చూస్తే మార్క్స్, లెనిన్ పెటీ బూర్జువావర్గం నుండి వచ్చారు. స్టాలిన్ అట్టడుగు శ్రామికవర్గం నుండి వచ్చాడు. మావో రైతు కుటుంబం నుండి వచ్చాడు. కానీ తద్భిన్నంగా ఎంగెల్స్ స్వయంగా పారిశ్రామిక పెట్టుబడిదారుడి కుటుంబం నుండి వచ్చాడు. ఆయన తండ్రి రెండు బట్టల మిల్లులకి ఓనరు. ఒక మిల్లు జర్మనీలో ఉంటే, మరో మిల్లు ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఉంది. రెండు శతాబ్దాల క్రితమే రెండు వేర్వేరు దేశాల్లో రెండు బట్టల మిల్లుల్ని కలిగిన బడా పెట్టుబడిదారుడి కడుపున పుట్టినోడే ఎంగెల్స్!
తన కొడుకు ఏ ఇతర శాస్త్ర విజ్ఞానాలు నేర్చుకోనక్కర లేదని, ఉన్నత విద్య కూడా అవసరంలేదనీ, వాటికి బదులు కేవలం వ్యాపార బుద్దులుంటే సరిపోతుందనీ, బూర్జువావర్గ బుద్ధితో ఎంగెల్స్ ని హైస్కూల్ చదువు పూర్తి కాక ముందే ఆ బూర్జువా తండ్రి స్కూల్ మానిపించాడు. (ఆ తర్వాత రెండేళ్లు సైనిక శిక్షణ కోసం మిలిటరీ శిక్షణాలయంలో చదివిన విషయం తెల్సిందే) హేతువాద భావోజ్వల మధుర పరిమళాలతో అప్పుడప్పుడే గుబాళిస్తోన్న తత్వశాస్త్రం జర్మనీ యువతని అలింగనం చేసుకుంటోన్న వాతావరణం ఆ తండ్రిని ఆనాడు భీతిల్లజేసింది. నిజంగానే దాని కౌగిలిలో తన కొడుకు కూడా పడే విషయం ఆ బూర్జువా తండ్రి పసిగట్టి తన కొడుకును జర్మనీ లోని బట్టల మిల్లు బాధ్యతలతో ఉంచితే, పాడు బుద్ధులతో చెడిపోయే ప్రమాదం ఉందనే అభద్రతకి గురయ్యాడు. ఆ బూర్జువా తండ్రి తనకొడుకు పట్ల అతిభద్రతతో ఎంగెల్స్ ని 22వ ఏట ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ మిల్లుకి పంపాడు. అది ఎంగెల్స్ జీవితాన్ని మలువు తిప్పింది.
బడా పెట్టుబడిదారుడి కొడుకుగా తమ ఫ్యాక్టరీలో పని చేసే శ్రామికుల నివాసాలైన మురికి వాడల్ని పరిశోధించి, వారి నికృష్ట బ్రతుకులపై 24వ ఏట ఎంగెల్స్ చరిత్రాత్మక గ్రంధం “ఇంగ్లాండ్ కార్మికవర్గ స్థితిగతులు” రచనకి అది కారణమైనది. అట్టి ఎంగేల్స్ లేకుండా మార్క్స్ లేడు. ఆ మార్క్స్ లేనిదే మార్క్సిజం లేదు. ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే, ముగ్గురు మూర్తుల సమాహారమే మార్క్సిజం! ఒకరు మార్క్స్, మరొకరు ఎంగెల్స్! ఇంకొకరు జెన్నీ! ఈ ముగ్గురి జీవితాల ఉత్పాదక ఫలమే మార్క్సిజం!
రెండేళ్ల క్రితం మార్క్స్ ద్విశత జయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈ ఏడాది 2020 మరో మహనీయుడు ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరం. కానీ కారోనా ఓ ఆటంకంగా మారింది. దాన్ని అధిగమించి ఆ మహనీయుడి రాజకీయ సిద్ధాంత కృషిని సృజిద్దాం. విప్లవ స్ఫూర్తిని పొందుదాం.
ఎంగెల్స్ 125వ వర్ధంతి మొన్న 5-8-2020కి వచ్చింది. 200వ జయంతి 28-11-2020న రానున్నది. మరో వంద రోజులకు పైగా వుంది. 125 కీ, 200 కీ ప్రత్యేకతలున్నాయి. మొదటిది, సరిగ్గా రెండు శతాబ్దాలు నిండిన ప్రత్యేక సందర్భం. రెండవది, సరిగ్గా ఒకటింబావు శతాబ్దం నిండిన సందర్భం. ఇవి రెండూ రెండు ప్రత్యేక సందర్భాలే. ఇలాంటి రెండు ప్రత్యేక సందర్భాలు ఒకే ఏడాది తటష్టించడం ఓవిశిష్టత. ఐతే కారోనా కారణంగా ఈసారి వాటి నిర్వాహణకు ఆటంకంగా మారింది. ఒకటి వారం క్రితం ఎలాగూ నిశ్శబ్దంగా గడిచి పోయింది. మరొకటి మిగిలి ఉంది. 125వ వర్ధంతి మన చేజారింది. 200వ జయంతి ఇంకా మన చేతుల్లో మిగిలి వుంది. మరో వంద రోజులకు పైగా ఉంది. నేడున్న ప్రతికూల భౌతిక స్తితిగతుల్లో వీలైనంత మేరకు ఎంగెల్స్ ద్విశత జయంతి కార్యక్రమాల నిర్వాహణకు ప్రయత్నిద్దాం. ఈ సందర్భంగా ఆయన సిద్ధాంత, తాత్విక, రాజకీయ పాత్రల అధ్యయనానికీ, బోధనలకూ, ప్రచార కార్యక్రమాలకూ వీలైన స్థాయిలో ప్రయత్నిద్దాం.
ధనస్వామ్య సంతతి అయివుండి ధనస్వామ్య వ్యవస్థను దగ్ధం చేసే పాత్రను పోషించిన మహనీయుడు ఎంగెల్స్ రాజకీయ సంస్మరణ విస్మరించరాని కర్తవ్యంగా ఎంచుకొని చేపడదాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఐఎఫ్టీయూ