చైనా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణకొరియాలతో పాటు ఆసియాన్కు చెందిన మరో పదిదేశాలు ఈ ఒప్పందంలో భాగం కనుక, సుంకాలు బాగా తగ్గించుకోవడం లేదా ఎత్తివేయడం ద్వారా వీటి ఉత్పత్తులను మనం స్వాగతించవలసి ఉంటుంది. కేవలం చైనా ఉత్పత్తులే మరో 80 మనదేశంలోకి అదనంగా వచ్చిపడతాయట. ప్రపంచవాణిజ్యంలో మూడోవంతు, స్థూల ఉత్పత్తిలోనూ, విదేశీపెట్టుబడుల్లోనూ నాలుగోవంతు ఆర్సీఈపీలో ఉన్న దేశాలన్నీ నియంత్రిస్తున్నందున భారతదేశానికి ఈ కూటమిలో చేరడం ఒక పెద్ద వాణిజ్య, ఎగుమతి అవకాశంగా ప్రచారం జరుగుతున్నది. కానీ, ప్రస్తుతం ఈ దేశాలకు మనం చేస్తున్న ఎగుమతుల కంటే దిగుమతులే ఎంతో అధికం. చైనాతో మనకు నాలుగులక్షలకోట్ల పైచిలుకు వాణిజ్యలోటు ఇప్పటికే ఉన్నది. వాణిజ్యావకాశాల మాట అటుంచితే, దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల ఆ లోటు మరింత పెరుగుతుందన్నది వాస్తవం. ఈ పరిస్థితిని కాస్తంత సరిదిద్దడానికే ఆర్సీఈపీ చర్చలు ఆరంభమైన 2013ను కాక, 2019ను తగ్గించిన సుంకాలకు ‘బేస్ ఇయర్’గా తీసుకోవాలని భారత్ కోరుతున్నది. 2014తరువాత భారతదేశం వివిధ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 17శాతం వరకూ పెంచింది. అలాగే, ఈ ఒప్పందం కారణంగా దిగుమతులు అనూహ్యంగా పెరిగిపోయినప్పుడు, కొన్ని ఉత్పత్తులపై అవే మినహాయింపులు, రాయితీలు కొనసాగించననే హక్కు తనకుండాలని కూడా భారత్ అంటున్నది. అతిపెద్ద భారత మార్కెట్ను ఎవరూ వదులుకోరు కనుక, ఈ ప్రతిపాదనల్లో కొన్నింటికి కూటమి తలూపినప్పటికీ, అందులో చేరికవల్ల మనకు లాభం కంటే నష్టమే ఎక్కువని అనేకుల అభిప్రాయం. ఈ దేశాల్లో అనేకం తమ స్థానిక ఉత్పత్తి దారులకు భారీ రాయితీలు ఇచ్చి ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉండేట్టు చూడటం వల్ల, అవి మన ఉత్పత్తులకంటే తక్కువ ధరలో ఉండటం సహజం. న్యూజిలాండ్లో వెయ్యి పశువులతో, భారీ దిగుబడితో పాలవ్యాపారం చేస్తున్న ఓ రైతుతో మనదేశంలో ఒకటీరెండు పశువులను పోషించుకొనే బక్కరైతు ఎంతమాత్రం పోటీపడలేడు. ఈ కారణంగానే, పెద్ద పెద్ద సహకార డైరీలు సైతం ఈ ఒప్పందాన్ని చూసి భయపడుతున్నాయి. ఇప్పటికే, మలేషియా పామాయిల్ దేశీ రైతులను దెబ్బతీసినట్టుగా, ఇకపై అనేక పంట ఉత్పత్తులు మన రైతులను దెబ్బతీయవచ్చు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే వ్యవసాయం, ఇతర రంగాల్లో కనీసం 5కోట్లమంది జీవనోపాధి కోల్పోతారన్న ఆర్థిక నిపుణుల హెచ్చరికను ప్రభుత్వం లక్ష్యపెడుతుందని ఆశిద్దాం.
Courtesy Andhra Jyothy