పి. నిరూప్
సుప్రీం కోర్టు న్యాయవాది
జీవ పరిణామ వాస్తవాలను దృష్టిలో వుంచుకుని మనం లైంగిక నేరాలను సమగ్రంగా అర్థం చేసుకోవల్సిన అవసరమున్నది. ఇందుకు మనం లైంగిక నేరస్థులను తీవ్ర మనో విశ్లేషణకు లోను చేయాలి. వారికి మనోచికిత్స చేయాలి. వారు పుట్టి పెరిగిన సామాజిక పరిసరాలను లోతుగా విశ్లేషించాలి. అప్పుడే లైంగిక నేరాలను అర్థం చేసుకుని నిరోధించగలుగుతాం.
తెలంగాణలో గత కొద్ది రోజులుగా సంభవిస్తోన్న ‘విషాద- హాస్యయుత’ సంఘటనలకు ఫ్రాంజ్ కాఫ్కా సైతం అక్షరీకరణ చేయలేడేమో?! ఒక అమానుష లైంగిక నేరం పర్యవసానంగా చోటుచేసుకుంటున్న ఆ విషరీత పరిణామాలను బట్టి చూస్తే ఆ సరికొత్త రాష్ట్రంలో ఏ వ్యవహారాలూ సజావుగా లేవని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డిపై నలుగురు యువకులు పాల్పడిన రాక్షస కృత్యం ఎవరినైనా కలచివేసేదే. (బాధితురాలి పేరును అజ్ఞాతంగా ఉంచేందుకు పోలీసులు ఆమెను ‘దిశ’ అని వ్యవహరిస్తున్నారు).
మరో వారం రోజుల్లో జరుపుకోనున్న ‘నిర్భయ చేతన దివస్’ (2012 నుంచి డిసెంబర్ 16న ఈ ‘దివస్’ను పాటించడం జరుగుతోంది) లైంగిక హింసకు తావులేని వాతావరణాన్ని సృష్టించుకోవడం మన కర్తవ్యమని గుర్తు చేస్తోంది. 2012 డిసెంబర్ 16న న్యూ ఢిల్లీలో జ్యోతి సింగ్ అనే 23 ఏళ్ళ పారా-మెడిక్ నిపుణురాలు పైశాచిక అత్యాచారానికి గురై, మృత్యువుతో పోరాడుతూ కొద్ది రోజుల అనంతరం మరణించింది (ఆ ఘటన అనంతరం కూడా జ్యోతిని అదే పేరుతో వ్యవహరించడానికి ఆమె తల్లి సిగ్గు పడలేదు. అత్యాచారానికి పాల్పడిన వారే సిగ్గు పడాలిగానీ, బాధితురాలి తల్లిదండ్రులుగా తాము సిగ్గుపడనవసరం లేదని ఆ మాతృమూర్తి పేర్కొన్నారు). జ్యోతిని దేశవ్యాప్తంగా పౌర సమాజమూ, పోలీసులూ నిర్భయగా వ్యవహరించసాగారు.
నిర్భయ ఘటనపై ఆసేతుహిమాచలం వెల్లువెత్తిన నిరసనల ఫలితంగా మహిళలకు భద్రత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ లక్ష్యంతోనే జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీని నియమించింది. నేర విచారణా చట్టాలను సవరించాలని, రూ.1000కోట్లతో నిర్భయ నిధిని ఏర్పాటు చేయాలని వర్మ కమిటీ సిఫారసు చేసింది. ఇంకా జాతీయ పోలీస్ కమిషన్ సిఫారసులు, ప్రకాశ్ సింగ్ కేసు (2006)లో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా పోలీసు వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావాలని కూడా వర్మ కమిటీ సిఫారసు చేసింది. ఆ కమిటీ తన నివేదికను సమర్పించిన ఏడు సంవత్సరాల అనంతరం కూడా నేర విచారణా చట్టాలలో ఏవో కొన్ని మార్పులు మినహా మౌలిక మార్పులేవీ జరగలేదు. సమాజంలో స్త్రీలకు భద్రత సమకూర్చే విషయంలో పరిస్థితులు సైతం పెద్దగా మెరుగుపడలేదు. ఈ ఏడేళ్ళ కాలంలో అమానుష లైంగిక దాడులు వేల సంఖ్యలోనే చోటు చేసుకున్నాయి. మహిళలకు భద్రతా భావం మరింతగా లోపించిందనడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజలనందరినీ కలచివేసిన దిశ సంఘటనే ఇందుకొక తార్కాణం.
దిశ అత్యాచారం, హత్య సంఘటన దిగ్భ్రాంతి నుంచి దేశ ప్రజలు తేరుకోకముందే, ఆ రాక్షసనేరంలో నిందితులుగా వున్న నలుగురు యువకులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్న వార్త వెలువడింది. దీనికి ప్రజలు పలువిధాలుగా ప్రతిస్పందించారు. నేర దర్యాప్తులో భాగంగా నిందితులను నేర స్థలం వద్దకు తీసుకువెళ్ళినప్పుడు వారు తమపై తిరగబడడంతో ఆత్మరక్షణకు కాల్పులు జరపవలసివచ్చిందని, ఆ కాల్పుల్లో నలుగురూ మరణించారన్న పోలీసుల కథనం తెలుగు క్రైమ్-థ్రిల్లర్ సినిమా స్క్రిప్ట్ను తలపిస్తోంది.
దిశ ఘటన నిందితులను మట్టుబెట్టడంలో పోలీసులు వ్యవహరించిన తీరులో ఒక స్పష్టమైన ధోరణి కన్పిస్తోంది. నిందితులను అలా చంపివేయడం ద్వారా ఆ ఘోర కృత్యానికి పాల్పడిన నేరస్థుల మనస్తత్వాన్ని అధ్యయనం చేసే అవకాశం కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా 2008లో సంభవించిన ఇదే విధమైన ఒక ఘటనను గుర్తు చేసుకోవల్సిన అవసరమున్నది. 2008లో వరంగల్ నగరంలో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడులకు పాల్పడిన ముగ్గురు యువకులను కూడా తెలంగాణ పోలీసులు ‘ఆత్మరక్షణ’ పేరిట ఎదురు కాల్పులు జరిపి హతమార్చారు.
నిర్భయ కేసులో దోషులుగా నిర్ధారితమయిన వారికి విధించిన ఉరిశిక్షను ఇంకా అమలుపరచవలసివుండగా దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం చాలా విచిత్రంగా వున్నది (నిర్భయ నిందితులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నది). దిశ ఘటన అనంతరం కూడా, నిర్భయ ఘటనలో వలే పార్లమెంటు లోపలా వెలుపలా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. నేరానికి పాల్పడినవారిని తీవ్ర చిత్రవధతో హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇప్పటికీ నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను అమలుపరచలేదు. అయితే వారు ఆ హేయమైన నేరానికి పాల్పడడానికి కారణాలేమిటో మనకు ఇప్పటికీ సవివరంగా తెలియదు.
నిర్భయ కేసులోనూ, దిశ ఘటనలోనూ ఒక న్యాయవాది వివేచనాయుత మనస్సును కలవరపరుస్తున్నదేమిటంటే నిపుణులను సంప్రదించక పోవడం, నేరస్థుల మనో వైజ్ఞానిక/ మనో చికిత్స/ సామాజిక విశ్లేషణలను పరిగణనలోకి తీసుకోక పోవడమే. జస్టిస్ వర్మ కమిటీ కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. అత్యాచారం, లైంగిక దాడులకు సంబంధించిన ‘కేస్ – లా’ గురించి విపులంగా తర్కించినప్పటికీ, మనో వైజ్ఞానికుల, సామాజిక శాస్త్రవేత్తల నుంచి మేధో సహకారాన్ని తీసుకోలేదు. విద్యావేత్తల అధ్యయనాలు పరిగణనలోకి తీసుకుని వున్నట్టయితే జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు మరింత సమగ్రంగా వుండేవని కచ్చితంగా చెప్పవచ్చు. అటువంటి నేరాల గురించిన మన అవగాహన కూడా మరింతగా మెరుగుపడివుండేది. సమాజంలో విస్తృతంగా వున్న ఈ చెడును శాశ్వతంగా అంతమొందించేందుకు, లైంగిక నేరాలను, వాటి కారణాలను, పర్యవసానాలను సమగ్రంగా అర్థం చేసుకోవల్సిన అవసరమున్నది.
దురదృష్టవశాత్తు మానవుని నేర చరిత్రకు సంబంధించిన పుస్తకాలేవీ నేర ఘటనలను ప్రస్తావించడమే గానీ వాటిని అన్ని కోణాల నుంచి నిశితంగా పరిశీలించడం జరగలేదు. ఆ మాటకొస్తే సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ గుస్తావ్ జంగ్, ఆల్ఫ్రెడ్ అడ్లర్ లాంటి మనో వైజ్ఞానికుల అధ్యయనాలు కూడా లైంగిక నేరాలు, అత్యాచారం, లైంగిక దాడుల గురించి విపులంగా ప్రస్తావించలేదు. విప్లవ దార్శనికులు మార్క్స్, ఏంగెల్స్ కూడా ఈ అంశాలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అయితే విలియమ్ రీఖ్ అనే మనో వైజ్ఞానికుడు ఈ అంశాలపై గణనీయమైన పరిశోధనలు నిర్వహించాడు. నాజీ నియంత హిట్లర్ కాలంలో రీఖ్ తన సొంత పద్ధతిలో ఆ అధ్యయనాలు నిర్వహించారు. ఆ మార్గదర్శక కృషికిగాను మనం రీఖ్కు ఎంతైనా కృతజ్ఞతా బద్ధులమై వుండాలి.
లైంగిక నేరాలకు కారణాలను గుర్తించి, విశ్లేషించడంలో సామాజిక శాస్త్ర వేత్తలు. మనో వైజ్ఞానికులు విఫలమైన నేపథ్యంలో మానవులకు పరిణామ క్రమంలో అత్యంత సన్నిహిత జీవులైన ప్రైమేట్లు, చింపాంజీల గురించి విపులంగా అధ్యయనం చేసిన జంతుశాస్త్రవేత్తల లోచూపులు ఆ నేరాలను అర్థంచేసుకోవడానికి విశేషంగా దోహదం చేస్తున్నాయి. ప్రైమేట్లు, చింపాంజీలు అత్యాచారాలకు, వ్యభిచారానికి పాల్పడవని జంతు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వాస్తవానికి ప్రైమేట్స్లో లైంగిక సంగమం అనేది స్త్రీ జీవి ఆహ్వానం మేరకే జరుగుతుంది. స్త్రీ జీవులు వివిధ భౌతిక విన్యాసాల ద్వారా మగవాటిని ఆకట్టుకుంటాయి.
ప్రైమేట్స్’, హోమో సెపియన్స్’ల మధ్య శరీర నిర్మాణంలోని తేడాలు మానవులను, ఒక నాగరీక ప్రవర్తనను’ పెంపొందించుకునేందుకు పురిగొల్పుతున్నాయి. అయితే నాగరీక ప్రవర్తన అంటే ఏమిటి? సామాజిక, జైవిక పరిస్థితుల పరంగా మానవాళి తన పరిణామంలో ఒక అత్యున్నత దశకు చేరుకున్నది. మనుగడకు అవసరమైన ఆహారం, మైథునం, జనాభాను పెంపొందించుకోవడం మొదలైనవాటిని మానవాళి సంతృప్తికరంగా తీర్చుకోగలుగుతుంది. ఇక ఈ పరిణామంలో తదుపరి దశ మానసిక-–సామాజిక పరిణామం. ధరిత్రిపై జీవ పరిణామ పురోగతిలో ఇది నాల్గవ దశ.
ఈ పరిణామ వాస్తవాలను దృష్టిలో వుంచుకుని మనం లైంగికనేరాలను సమగ్రంగా అర్థం చేసుకోవల్సిన అవసరమున్నది. ఇందుకు మనం లైంగికనేరస్థులను తీవ్ర మనోవిశ్లేషణకు లోనుచేయాలి. వారికి మనోచికిత్స చేయాలి. వారు పుట్టి, పెరిగిన సామాజిక పరిసరాలను లోతుగా విశ్లేషించాలి. ఈ విపుల అధ్యయనాలలో వెల్లడయిన సత్యాలను సమాజానికి బహిర్గత పరచాలి. అప్పుడే లైంగికనేరాలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తద్వారానే వాటిని నిరోధించగలుగుతాము. ప్రభావశీలంగా వాటిపై పోరాడగలుగుతాము.
అలా కాకుండా రాజ్య యంత్రాంగం ద్వారా న్యాయప్రక్రియలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ నేరాలను అరికట్టడమనేది ఎప్పటికీ అసాధ్యమవుతుంది. దిశ ఘటనలో నిందితులను అంతమొందించడం ద్వారా పోలీసులు, లైంగికనేరాలకు సంబంధించిన అర్థవంతమైన సమాచారాన్ని సంగ్రహించడానికి వీలులేకుండా చేశారు. అది ఇక ఎప్పటికీ మనకు అందుబాటులోకి రాదు. నేరస్థులను నేరాలకు పురిగొల్పిన కారణాలకు సంబంధించిన భోగట్టా లభించి వుంటే ఆ నేరాలను శాశ్వతంగా రూపుమాపేందుకు ఒక దీర్ఘకాలిక వ్యూహ రూపకల్పనకు దోహదం జరిగేది. లైంగిక నేరాలకు ఆస్కారం లేని, స్త్రీలకు పూర్తి భద్రత వుండే సమాజాన్ని రూపొందించుకునేందుకు అవకాశముండేది. జస్టిస్ వర్మ నివేదిక నొక్కి చెప్పినట్టు పోలీసు సంస్కరణలను తక్షణమే అమలుపరచవలసిన అవసరం ఎంతైనా వున్నది. (సొంత లేదా పోలీసులను నుంచి లాక్కున్న) ఆయుధాలతో వున్న నేరస్థులతో తలపడేందుకు పోలీసులకు ప్రస్తుతం పూర్తి శిక్షణ, అవసరమైన సామర్థ్యాలు వున్నాయి. అయితే స్త్రీలకు వ్యతిరేకంగా తమ పురుషాంగాలనే ఉపయోగించే లైంగిక నేరస్థులతో వ్యవహరించేందుకు అవసరమైన శిక్షణ, శాస్త్రీయ సామర్థ్యాలు పోలీసులకు ఉన్నాయా? స్త్రీలకు సంపూర్ణ భద్రత సమకూరుస్తామనే హామీని నెరవేర్చేందుకు మన సమాజం ఇంకా చాలా దూరం పయనించవలసివున్నది.