వాషింగ్టన్: కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్లు, పాఠశాలల మూసివేత నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది పిల్లలు ప్రభావితమయ్యారు. దీనికి తోడు విద్యార్థులు దూర విద్యను (ఆన్లైన్ విద్య) పొందే ప్రాప్యతలో భౌగోళిక వ్యత్యాసాలను తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైన విద్యార్థుల్లో కనీసం మూడింట ఒకవంతు మందికి ఆన్లైన్ విద్య అందుబాటులో లేదని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఐరోపాలో ఈ ప్రభావం తక్కువగా ఉండగా.. ఆఫ్రికా, ఆసియాలోని ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని పేర్కొంది. మొత్తం మీద 463 మిలియన్ల మంది పిల్లలకు ఆన్లైన్ (దూరవిద్య) అభ్యసించడానికి పరికరాలు, ఎలక్ట్రానిక్ సదుపాయాలు లేవని నివేదిక తెలిపింది. ”నెలల తరబడి ప్రపంచవ్యాప్తంగా పిల్లలు విద్యకు దూరంగా ఉంటున్నారు. ఇది పిల్లల విద్య అత్యవసర పరిస్థితి” అని యుఎన్ చిల్డ్రన్స్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే దశాబ్దాల పాటు ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు ఈ పరిణామాలను అనుభవించవచ్చు” అని ఆమె చెప్పారు.