* సిఎంకు నన్నయ విద్యార్థినుల లేఖ
* విచారణకు ఆదేశం
– రాజమహేంద్రవరం ప్రతినిధి:
స్పెషల్ క్లాసుల పేరుతో తమను లైంగికంగా వేధిస్తున్న ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి తమను కాపాడాలని కోరుతూ కొందరు విద్యార్థినులు ఏకంగా ముఖ్యమంత్రికి లేఖరాయడం కలకలం రేపింది. ఈ లేఖపై తక్షణమే విచారణ జరపాలని, బాధిత విద్యార్థినులకు రక్షణ కల్పించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ సంఘటన జరిగింది. ఎంఎ (ఇంగ్లీషు) చదువుతున్న తమను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సూర్య రాఘవేంద్ర వేధిస్తున్నారని విద్యార్థినులు సిఎం కార్యాలయానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక క్లాసుల పేరుతో తమను ఆయన ప్లాటుకు రమ్మంటున్నారని తెలిపారు. ఇన్ఛార్జి విసితో పాటు అధికారులంతా తనకు స్నేహితులని, ఎవరికి ఫిర్యాదు చేసినా మీకే నష్టమంటూ బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాపాడాలని అభ్యర్థించారు. ఈ లేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య మంత్రి ఆదేశించడంతో విశ్వవిద్యాలయ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ టేకి, ఉమెన్స్ సెల్ కన్వీనర్ ప్రొఫెసర్ నూకరత్నం శుక్రవారమే ప్రాథమిక విచారణ చేపట్టారు. తాజా లేఖతోపాటు నాలుగు సంవత్సరాల కాలంలో ఇంగ్లీషు డిపార్ట్మెంట్లో చోటుచేసుకున్న పరిణామాలు, మార్కుల పేరుతో గతంలో ఎవరినైనా ప్రలోభ పెట్టారా అన్న అంశంపై కూడా దృష్టి సారించారు. ఈ నెల 14న బాధిత విద్యార్థినుల తోనూ, ఆరోపణలకు గురైన ప్రొఫెసర్తోనూ ముఖాముఖి విచారణ నిర్వహించనున్నారు. తమపై వేధింపులు జరిగిన విషయం వాస్తవమని విద్యార్థి నులు చెబుతుండగా, ఆరోపణలకు గురైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్. సూర్య రాఘవేంద్ర వాటిని తోసిపుచ్చుతున్నారు. ప్రత్యేక తరగతులకు కచ్చితంగా రావాలని ఆదేశించామని, వాటిని యూనివర్శిటీలో ఉదయం ఎనిమిది గంటలక నిర్వహిస్తు న్నామని రాఘవేంద్ర చెప్పారు. తాను రాజమహేంద్రవరంలో నివాసముంటున్నా నని, అక్కడికి రావాలని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. క్లాసులకు రావడానికి ఇబ్బందిపడుతున్న వారే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
Courtesy Prajasakti