- కృష్ణా పరిసరాల్లో 2,618 పీపీబీ యురేనియం
- ఏఎండీ పరీక్షల్లో వెల్లడి
నాగార్జునసాగర్, దేవరకొండ, అక్టోబరు 15: నాగార్జునసాగర్కు వచ్చే మాంసాహార ప్రియులు ఈ జలాశయంలోని చేపల వేపుడు తినకమానరు. ఇక్కడ విధుల్లో ఉండే నావికాదళం అధికారులు కూడా ఏరికోరి చేపలతో వంటకాలు చేయించుకుంటారు. అయితే.. కొన్ని రోజులుగా నేవీ అధికారులు సాగర్లోని చేపల జోలికి వెళ్లడం లేదు. అలాగని మాంసాహారాన్ని మానేయలేదు. ఇతర చెరువుల్లోని చేపలను తెప్పించుకుంటున్నారు. ఇందుకు కారణమేంటో తెలుసా? యురేనియం మూలకాలే..! ఆటోమేటిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) అధికారులు ఇటీవల కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లోని 25 బోర్లలో భూగర్భ జలాలను పరీక్షించారు. సాధారణంగా నీటిలో 30 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకు యురేనియం మూలకాలుంటాయి. కానీ.. 21 బోర్లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒక్కో బోరులో గరిష్ఠంగా 2,618 పీపీబీ దాకా యురేనియం ఉంది. భూగర్భ జలాల్లో యురేనియం ఉండటం వల్ల.. నీటి ఊట రూపంలో అది సాగర్ జలాల్లోకి చేరే ప్రమాదముందని ఏఎండీ హెచ్చరించింది. అదే జరిగితే.. జలాశయంలోని చేపల్లోనూ యురేనియం మూలకాలు ఉండే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం తెలిశాకే నేవీ అధికారులు, సిబ్బంది సాగర్ చేపల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది.
మళ్లీ యురేనియం అలజడి …కొంతకాలంగా నల్లమలలో స్తబ్దుగా ఉన్న యురేనియం అలజడి మళ్లీ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిందనే ప్రచారం జరగడం.. దాన్ని బలపరుస్తూ నంభాపురం, పెద్దగట్టు గుట్టలపై హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు తిరుగుతున్నాయి. దీంతో.. ఏరియల్ సర్వేలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. యురేనియం తవ్వకాల కోసం తమ తండాలు, గ్రామాలను ఖాళీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
Courtesy Andhrajyothi..