పోలీసులు ఫిర్యాదు మార్చి రాయాలన్నారు : బాధితురాలు
నిందితులను అదుపులోకి తీసుకున్నాం: ఏసీపీ
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ఓ మోడల్పై యువకుడు అత్యాచారానికి పాల్పడగా.. అతని స్నేహితుడు సెల్ఫోన్లో చిత్రీకరించిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు మార్చి రాయాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారని బాధితురాలు శుక్రవారం రాత్రి మీడియా ఎదుట వాపోయింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. మోడలింగ్ రంగంలో స్థిరపడేందుకు గతేడాది నగరానికి వచ్చిన ఓ యువతి(21) ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. హాస్టల్ యజమాని కుమారుడి(17)తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. నాలుగు నెలల క్రితం ఆ యువతి తన సోదరితో కలిసి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకొంది. డిసెంబరు 28వ తేదీ రాత్రి గంజాయి మత్తులో హాస్టల్ యజమాని కుమారుడు, అతని స్నేహితుడు నిఖిల్రెడ్డి (19) ఆమె ఉంటున్న గదికి వచ్చారు. ఆమెపై హాస్టల్ యజమాని కుమారుడు అత్యాచారానికి పాల్పడగా, నిఖిల్రెడ్డి సెల్ఫోన్తో వీడియో తీశాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లిపోయారు. అనంతరం తన సొంతూరికి వెళ్లిన ఆ యువతి తల్లిదండ్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించగా.. ఈ నెల 7న జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఎస్సై సుధీర్రెడ్డికి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదును మార్చి రాయాలంటూ ఠాణాలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్(డీఐ) ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. రెండు, మూడు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని.. నిందితులను కుర్చీలో కూర్చోబెట్టి ఎస్సై మాట్లాడుతున్నారని.. ఇలాగైతే తనకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించింది.
మరోవైపు ఈ వ్యవహారంలో శుక్రవారం నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కె.ఎస్.రావు తెలిపారు. నిందితులు తమ అదుపులో ఉన్నారన్నారు. ఫిర్యాదును మార్చాలని ఒత్తిడి చేయలేదని జూబ్లీహిల్స్ డీఐ, ఇన్ఛార్జి ఇన్స్పెక్టర్ రమేష్ పేర్కొన్నారు.
Courtesy Eenadu