– మహారాష్ట్రలో 23, హర్యానాలో 9 మంది గెలుపు
-న్యూఢిల్లీ బ్యూరో
తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఓటర్లు అనూహ్య తీర్పు ఇవ్వడంతో బిజెపి కంగుతింది. దీంతో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం 10 శాతం కూడా మహిళా ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. మరోవంక రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు లోక్సభలో పెండింగ్లో ఉంది. మహిళా రిజరేషన్లు అమలు చేస్తామని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి కూటమి 2014 ఎన్నికల్లోనే హామీ ఇచ్చింది. అయితే లోక్సభలో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ ఆ బిల్లును ఆమోదించకుండా గత ఆరేళ్లుగా నాన్చుతూ వచ్చింది. ఆ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీల్లో కనీసం పది శాతం కూడా మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు.. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కేవలం 23 మంది మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. ఇందులో 9 మంది బిజెపికి చెందిన వారు ఉన్నారు. మిగిలిన వారు కాంగ్రెస్, ఎన్సీపి, శివసేనకు చెందిన సభ్యులు. ఈ ఎన్నికల్లో బిజెపి నుంచి పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కేవలం 17 మంది మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. అందులో తొమ్మిది మంది మహిళలు విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి పంకజా ముండే, బిజెపి సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే కుమార్తె రోహిణి ఓటమి చవిచూశారు. శివసేన 8, కాంగ్రెస్ 11, ఎన్సీపి 9 మందికి టిక్కెట్లు ఇచ్చాయి. స్వతంత్రులుగా పోటీ చేసిన మహిళా అభ్యర్ధుల సంఖ్య కూడా తగ్గింది. 2014 ఎన్నికల్లో 33 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయగా, ఈసారి కేవలం 25 మంది మాత్రమే పోటీ చేశారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కృషిచేసే న్యాయవాద బృందం ‘శక్తి’ సహ వ్యవస్థాపకులు తారా కృష్ణస్వామి మాట్లాడుతూ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి పార్టీలు సిద్ధపడటం లేదని అన్నారు.
హర్యానాలో కేవలం తొమ్మిది మంది మహిళలే
ఇక హర్యానా అసెంబ్లీలోనూ మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే వుంది. రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలుండగా, తాజా ఎన్నికల్లో కేవలం 9 మంది మంది మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. ఇందులో నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు కాగా, బిజెపి నుంచి ముగ్గురు, జెజెపి నుంచి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వారిలో శకుంతల ఖతక్, గీతా భుక్కల్ కాంగ్రెస్ తరపున ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన కలనైర్, ఝాజ్జర్లో గెలిచారు. ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగాట్ బిజెపి అభ్యర్థిగా చార్కి దాద్రి నుంచి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సోంబిర్ చేతులో ఓటమి చెందారు. గత ఎన్నికల్లో గెలిచి హర్యానా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి కవితా జైన్కు కూడా ఈసారి ఓటమి తప్పలేదు. అలాగే బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే లతికా శర్మ కల్కా నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బిజెపి అభ్యర్థి, టిక్టాక్ స్టార్ సోనాలి పోగాట్ ఆడంపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోరుపై 30 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ 10, ఐఎన్ఎల్డి 15, జెజెపి 7 మంది మహిళలను ఎన్నికల బరిలో దింపాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది మహిళలు గెలుపొందగా, . అయితే ఈసారి ఆ సంఖ్య మరింత పడిపోయింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం 2014-17 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్, హర్యానా, రాజస్థాన్ల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 14 శాతం మాత్రమే. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Courtesy Prajasakti