దాసు సురేష్
భారత స్వాతంత్ర్య పోరాటంలో ‘విదేశీ వస్త్రదహనం- స్వదేశీ స్వావలంబన’ అనే నినాదంతో దేశాన్నంతటినీ ఒక్కతాటిపై నిలిపిన మహత్తర ఘట్టానికి నాందిగా నిలచింది మన భారతీయ సంప్రదాయ చేనేత కళ… అంతటి ఘనకీర్తి గల ఈ స్వదేశీ వారసత్వ సంపద నేడు అనూహ్యమైన పరిణామాలతో, అలవికాని నిర్వేదంతో కొట్టుమిట్టాడుతుంది. భారత స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో చెరగని ముద్రను వేసిన చేనేత నేడు తీవ్ర సంక్షోభంలో ఉంది.
తెలంగాణ అస్తిత్వానికి ఒక బలమైన ప్రతీక చేనేత వస్త్రమాలిక.. ఇక్కడి ప్రజల కళాత్మక శక్తికి, సాంకేతిక నైపుణ్యానికి, చేనేత కళ ఒక అద్భుతమైన భావ వ్యక్తీకరణ. అలాంటి చేనేత పరిరక్షణకు, చేనేతవ్యవస్థను బలోపేతం చేయడానికి ఆశించిన స్థాయిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు కానరాక పోవడం బహు బాధాకరం. తెలంగాణ అస్తిత్వానికి ఆధారమైన దుబ్బాక గొల్లభామ చీరలు, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల పట్టు జరీ చీరలు, ఓరుగల్లు తివాచీలు క్రమంగా పాలకుల నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్నాయి.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చేనేత, నేత కార్మికుల ఆత్మహత్యల అంశంతో అప్పటి పాలకులను ప్రశ్నించి రాజకీయంగా వారిని ఇరుకున పెట్టిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఇవ్వాళ చేనేత కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 430 పైచిలుకు ఉన్న చేనేత సహకార సంఘాలు నేడు 160కి పడిపోయి చేనేత సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్య మయ్యింది. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టక పోవడంతో మిగిలిన కాస్త మగ్గాలూ మరుగునపడుతున్నాయి.
కరోనా కష్టాలతో కుదేలైన నేతన్నలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించక పోగా నేతన్నలు వారి దీర్ఘకాలిక అవసరాలకు పొదుపు చేసుకున్న 93 కోట్ల రూపాయలను, ఇంకా రెండు నెలల్లో ముగియనున్న థ్రిఫ్టు ఫండ్ పథకపు ప్రయోజనాన్ని (నేతన్నల సొంత సొమ్మునే) ప్రభుత్వ సహాయంగా ప్రకటన చేయడం అందునా బ్యాంకులు, ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఈ కష్ట కాలంలో అప్పుల నిమిత్తం జప్తుచేయడం, పాలకులు ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకపోవడం నేతన్నలను పూర్తిగా ఇరుకునపెట్టాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన ఆరు సంవత్సరాల వ్యవధిలో 325 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్నీ సంబంధిత చేనేత జౌళి శాఖ ఈ మధ్యనే హై కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. 2018 ఎన్నికల సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ప్రకటన చేసిన విధంగా రైతుల మాదిరిగా చేనేత, నేత కార్మికులకు ఐదు లక్షల రూపాయల ఉచిత జీవిత బీమాను కల్పిస్తానన్న హామీ మాటలకే పరిమితమైంది. కేటీఆర్ సిరిసిల్ల వేదికగా ఇచ్చిన హామీ నాటి నుండి నేటి వరకు దాదాపు 70 మంది నేతన్నలు ఆత్మహత్యల కారణంగా, అనారోగ్యం వల్ల మరణించారు. మరి వీరి కుటుంబాల బాధ్యత తీసుకునే నాథుడెవ్వరో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చెయ్యలేదు. ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న ఒక్క చేనేత కుటుంబాన్ని కూడా సంబంధిత మంత్రి పరామర్శించిన పాపాన పోలేదన్న బాధ క్షేత్రస్థాయిలో దావానాలంగా వ్యాపించింది.
మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు! ఈపార్క్ ఇప్పటికే ప్రారంభమయి ఉంటే తెలంగాణ నుండి పక్క రాష్ట్రాలకు వలసపోయిన రెండు లక్షల మంది నేత కార్మికులు ఈ రోజు కరోనా కష్టకాలంలో పక్క రాష్ట్రాల్లో ఇరుక్కు పోయే పరిస్థితి దాపురించేది కాదు.
కరోనా కారణంగా చేనేత వ్యవస్థలో జరిగిన నష్టా న్ని అంచనా వేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత నెలకొని ఉంది. ప్రస్తుత విపత్కర తరుణంలో రానున్న డిసెంబర్ వరకు ప్రతి నెల 10 వేల రూపాయల జీవన భృతిని నేతన్నలకు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. రైతాంగం తర్వాత తెలంగాణలో అత్యధిక మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్న చేనేత వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం దళితులకు ప్రకటించిన మూడు ఎకరాలను ప్రామాణికంగా తీసుకుని రైతులకు అందించినట్లు 36 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని నేతన్నలకూ అందించాల్సిన అవసరముంది. చేనేత కళాకారులు ప్రస్తుత పరిస్థితులలో వృత్తిని కొనసాగించడానికి వారి కూలీ రేట్లను ప్రభుత్వం రెండింతలు పెంచడం, నేతన్నలకు సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించడం, లోపభూయిష్టంగా ఉన్న 50శాతం యార్న్ సబ్సిడీ పథకాన్ని పక్కాగా అమలు చేయడం లాంటి అనేక అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా నేతన్నలకు వెయ్యి కోట్ల రూపాయలతో రెండు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం, నేతన్నలకు 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు, ఉచిత ఇన్సూరెన్సు అందించడం, పేరుకుపోయిన 300 కోట్ల చేనేత వస్త్ర నిల్వలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయడం, ప్రతి కార్మికుడికి ఈ ఆపద కాలంలో థ్రిఫ్టు పథకానికి అయ్యే నేతన్న వాటా ధనాన్ని ప్రభుత్వమే చెల్లించడం, ప్రతి కార్మికుడికి 200 గజాల ప్రభుత్వ భూమిని ఉచితంగా అందజేయడం, చనిపోయిన చేనేత కార్మిక కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం వంటి ఉద్దీపన చర్యలు చేపడితే కాని చేనేత వ్యవస్థ తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా తమ మూస పద్ధతులను మానుకోవాలి. తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి చేనేత వర్గపు సమస్యల శాశ్వత పరిష్కా రాన్ని తమ ఎజెండాగా మార్చుకోనంతవరకూ ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి సమీకృత చేనేత విధానాలు రూపొందించితేనే తప్ప సమకాలీన వ్యవస్థలో చేనేత మనుగడ కొనసాగించలేదన్నది అక్షరసత్యం.
చైర్మన్- జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ
Courtesy Andhrajyothi