* కార్పొరేట్ సామాజిక బాధ్యత ఖర్చుల్లో కేటాయింపు నాలుగు శాతమే
న్యూఢిల్లీ : దేశంలోని టాప్ 100 కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత(సిఎస్ఆర్)లో వెచ్చిస్తున్న నిధుల్లో మహిళల కోసం కేటాయించింది కేవలం నాలుగు శాతమే. బిఎస్ఇలో నమోదైన టాప్ 100 కంపెనీలు మహిళల ఆర్థిక సాధికారత కోసం చేస్తున్న ఖర్చుపై సంహిత అనే సిఎస్ఆర్ కన్సల్టింగ్ కంపెనీతో కలిసి యుఎన్డిపి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017-2018లో సిఎస్ఆర్ కార్యకలాపాల కోసం టాప్ 100 కంపెనీలు రూ.6314.30 కోట్లు ఖర్చు చేయగా వాటిల్లో 423.84 కోట్లు మాత్రమే మహిళల కోసం ఖర్చు చేస్తే అందులో రూ.250. 62 కోట్లు మహిళల ఆర్థికాభివృద్ధి కార్యకలాపాల కోసం వెచ్చించాయి. సర్వేలో హిందూస్థాన్ యూనీలివర్, టాటాస్టీల్, అంబుజాసిమెంట్, ఎల్అండ్టి, భారతీ ఎయిర్టెల్కు సంబంధించిన వెచ్చించిన ఖర్చుల వివరాలు అందుబాటులో ఉన్నట్లు సర్వే ప్రతినిధులు తెలిపారు. టాప్ 100 కంపెనీల్లో 70 శాతం కంపెనీలు వెచ్చిస్తున్న సిఎస్ఆర్ నిధులను మహిళల ఆర్థిక సాధికారితపై దృష్టిపెడితే చాలా వరకూ మార్పు తీసుకురావచ్చని నివేదిక సూచించింది. మహిళల ఆర్థికాభివృద్ది బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఉందని, అక్కడ మహిళలకు ఉపాధి తక్కువగా ఉందని, పనుల్లోనూ వారి సంఖ్య అత్యల్పమని, కంపెనీలు ఆయా రాష్ట్రాలపై దృష్టి సారించాలని సూచించింది. మహిళల జీవన పరిస్థితులపై దృష్టి సారించకపోవడం కూడా సిఎస్ఆర్ వెచ్చింపులు తగ్గడానికి ప్రధాన కారణంగా ఉందని సర్వే ప్రతినిధులు వివరించారు. మహిళలకు వృత్తిపరమైన శిక్షణపై అవగాహన కల్పించడం, కంప్యూటర్ శిక్షణ, సాంకేతిక అవగాహన కల్పించడం వంటివి చేయకపోవడం వల్ల ఉపాధి పొందలేకపోతున్నారని తెలిపారు. కంపెనీలకు సంబంధించి బోర్డు స్థాయిలోనూ మహిళల సంఖ్య తక్కువగా ఉందని, సిఎస్ఆర్లో మహిళలపై దృష్టి సారించకపోడానికి ఇదొక కారణమని తెలిపారు. బోర్డు స్థాయిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించొచ్చని, ఆర్థిక అసమానతలు తగ్గించొచ్చని నివేదిక వెల్లడించింది. పురుషుల ఆధిపత్యం ఉన్న తయారీ, ఆటోమొబైల్ రంగాల్లో మహిళల పాత్ర పదిశాతం కన్నా తక్కువగా ఉందని, అందువల్ల ఆయా రంగాల్లో మహిళలపై దృష్టి తక్కువగా ఉందని పేర్కొంది. ఆయా కంపెనీలు, ప్రభుత్వాలు మహిళల జీవనంపై దృష్టి సారించడంతోపాటు వారి కుటుంబ సామాజిక నేపథ్యంపైనా అధ్యయనం చేసి దానికి అనుగు ణంగా చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య కొంత వరకూ పరిష్కారమవుతుందని, వారికి మంచి జీవితాన్ని అందించినట్లు అవుతుందని నివేదిక సూచించింది. వెబ్సైట్లో దొరికే సమచారం, కంపె నీల వార్షిక నివేదికలు, సిఆస్ఆర్ నివేదికలను పరిశీలించి రూపొందించిన ఈ నివేదికను సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేశారు.
Courtesy Prajasakti