ఖరీదైన మందులు, పీపీఈ కిట్లకు ఎమ్మార్పీ ధరలే వేయాలి
- బిల్లులు కాగితాలపై ఇవ్వడానికి వీల్లేదు
- దేనికెంత వసూలు చేస్తున్నారో చెప్పాలి
- లేకుంటే కఠిన చర్యలు..
- వైద్య ఆరోగ్య శాఖ ఉతర్వులు
- నేడు ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో
- ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: కరోనా పేషెంట్లకు అందించే చికిత్సకు సంబంధించిన ధరల పట్టికను ఆస్పత్రి ఆవరణలో అందరికీ కనిపించేలా ప్రముఖంగా పెట్టాలని ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోగులకు ఇచ్చే బిల్లు వివరంగా ఉండాలని, ఏయే మందులు వాడారు? వాటికి ఎంత చార్జ్ చేశారు తదితర వివరాలను బిల్లులో చూపాలని ఆదేశించింది. అలాగే.. జూన్15న జారీ చేసిన ఉత్తర్వుల్లో.. ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీలో లేని ఖరీదైన మందులు (రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ వంటివి), అదనంగా వసూలు చేసుకోవచ్చని సూచించిన సంగతి తెలిసిందే. ఆ మందులకు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్వి్పమెంట్ (పీపీఈ)కిట్లకు ప్రైవేటు ఆస్పత్రులు గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో.. వాటికి ఎమ్మార్పీ మాత్రమే వసూలు చేయాలని తాజా ఉత్తర్వుల్లో సర్కారు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేయకున్నా, బిల్లులు సరైన వివరాలతో రోగికి ఇవ్వకున్నా కఠిన చర్యలు తప్పవని ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు హెచ్చరించారు.
మరింత జవాబుదారీతనం కోసమే..
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ప్యాకేజ్ ధరలను నిర్ణయించి దాని అమలు కోసం సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటుఆస్పత్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు. మెజారిటీ ఆస్పత్రులు.. సర్కారు ఖరారు చేసిన ధరలకు కరోనా చికిత్స చేయట్లేదు. వాటి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు కేటాయించిన పడకలు, అందులో ఖాళీల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించినా పట్టించుకోలేదు. ఆస్పత్రుల తీరుపై, భారీగా బిల్లులు వేస్తుండడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు రెండు ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. దీంతో, ప్రైవేటు ఆస్పత్రులు రూటు మార్చి.. కాగితాలపై బిల్లులు వేసి రోగులకు చూపి వసూలు చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకల్ని స్వాధీనం చేసుకుంటామని సర్కారు ప్రకటించింది. ఆ ప్రకటనతో ప్రైవేటు ఆస్పత్రులు వైద్య మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్మెంట్ కోరాయి. గురువారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మంత్రితో భేటి కాబోతున్నాయి.
Courtesy Andhrajyothi