అశ్వని దేశ్పాండే
కోవిడ్ వలన వచ్చిన మార్పులన్నిటిలోకి ఇంటి నుంచి పని చేయడం అన్నది ప్రపంచవ్యాప్తంగా అమలయింది. ఎక్కువ మంది ఉద్యోగాలు వదులుకోవలసిన అవసరం లేకుండా జీతాలు తీసుకుంటూ ఇంటి నుండి పని చేసే అవకాశం కలగడం అదృష్టం. ప్రతిఫలం పొందుతూ ఇంటి బయట చేసే పని ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చింది. ఆ పని ప్రతిఫలం లేని ఇంటి పనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? నేను భారతదేశం లోని పరిస్థితుల ఆధారంగానే ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాను. అయితే అంతర్జాతీయంగా వ్యక్తమౌతున్న అనుభవాలను కూడా ప్రస్తావిస్తాను. అయితే ఈ సమస్యలపై చర్చ కేవలం మధ్య తరగతి ఉద్యోగులను దృష్టిలో పెట్టుకునే చేయడం లేదు. అన్నిరకాల వృత్తులలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను. మహిళల పనిలో ఉన్న అనేక పార్శ్వాలను గమనంలో ఉంచుకునే చేస్తున్నాను. తద్వారా మహిళలు చేస్తున్న ‘ఇంటి నుండి పని’ అంశంపై చర్చను విస్తృత పరచాలనుకుంటున్నాను. పరిహారం పొందే వృత్తి పని, పరిహారం లేని ఇంటి పనులు, పిల్లల పెంపకం ఇంట్లో కలగలసి పోవడం వలన ఆ రెంటికి మధ్య ఉన్న సంబంధాలలో వచ్చిన మార్పును ఒకసారి పరిశీలిద్దాం.
పరిహారం లేని పని…ఇంటి పని ఒకటేనా?
అవును. కాదు కూడా. అభివృద్ధి చెందిన దేశాలలో పని అంటేనే ప్రతిఫలం చెల్లించేదని అర్థం. వంట, అంట్లు తోమడం, బట్టలుతకడం, ఇల్లు సర్దుకోవడం, బజారు పని, పెద్దలను చూసుకోవడం, పిల్లల సంరక్షణ వగైరాలకు పరిహారాన్ని నిర్ణయిం చటం సాధ్యం కాకుండా ఉంది. ఎందుకంటే ఈ ఇంటిపనులు ప్రతిరోజూ చేయాల్సినవి. ఇందులో అధికభాగానికి ఏ రకమైన పరిహారం ఉండదు. పైగా ఈ పనులకు ద్రవ్యరూపంలో విలువ కట్టాలన్న సూచన అసాధ్యమైనదిగాను, అనవసరమైనదిగాను పరిగణించ బడుతున్నది. కానీ వాస్తవంలో ఈ పనుల వల్లనే (పునరుత్పత్తి శక్తి అని ఫెమిని స్టులు దీనినే అంటుంటారు) మహిళలు అసమానతల లోకి నెట్టబడుతున్నారు. ఇంట్లో పురుషులు చేసే పనికి మహిళలు చేసే పనికి హస్తిమశకాంతరం ఉంటుంది. ఈ ఇంట్లో పనుల మూలంగానే మహిళలకి బయట చేసే పనికి తక్కువ వేతనాలు చెల్లిస్తుంటారు. వేతనాలలో తేడాను మహిళల సమర్ధతలో తేడాగా భావిస్తుంటారు. అదే పురుషులైతే ఆయా స్థాయిలలో తాము చేసిన పనికి ప్రతిఫలం పొందుతుంటారు. అమ్మతనం పొందడానికి అమెరికా మహిళలు ఏడాదికి 16,000 డాలర్ల వేతన నష్టం భరించవలసి వస్తుందని అంచనా వేయబడింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళలు పరిహారం లేని పునరుత్పత్తి పనికి తోడుగా ‘ప్రతిఫలం’ ఇవ్వని ఉత్పత్తి పనిని కూడా చేయవలసి వస్తున్నది. ‘ఉత్పాదక’ పని అంటే ఏమిటి? ‘ఉత్పాదక పని’ అంటే జాతీయ గణాంక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిని లెక్క కట్టేందుకు తీసుకునే పనులు. మహిళలు పరిహారం చెల్లించబడని ఉత్పాదక పనులు (సాధారణమైన ఇంటి పని , సేవలు కాక చేసే పనులు) గృహ పరిశ్రమలు, పొలం పనులు, పశుపోషణ కోళ్ల పెంపకం, మార్కెట్లో అమ్మకానికి చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం, కుటుంబం నడుపుతున్న కొట్లలో పనిచేయడం, కుటుంబానికి సంబంధించిన పండ్లతోటల్లో చేసే పని వగైరా. ఈ పనులన్నీ కుటుంబానికి ఆర్థికంగా ఆదాయాలు సమకూర్చి పెట్టేవే. ఈ పనులన్నీ మహిళలు చేస్తారు.వీటికి వారికి ఏవిధమైన ప్రతిఫలం ముట్టదు సరికదా గుర్తింపు కూడా ఉండదు. ఇవే పనులు బయటి మనిషిని పెట్టుకుంటే ఎంత అవుతుందో అంచనా వేసుకుంటే మహిళలు చేసే పని విలువ అర్థం అవుతుంది.
ప్రతిఫలం లేని పని
భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మహిళలు ‘ఇంటి నుండి చేసే పని’ ప్రతిఫలం లేని పనే. వారు సాధారణంగా గృహ పరిశ్రమలలో, ఇంట్లో పని చేస్తుంటారు. మహిళలు చేసే ఇంటిపనికి అదనంగా కుటుంబం నడిపే ఇతర ఉత్పాదక కార్యక్రమాలలో వారూ భాగస్వాములే. కానీ ఎవరినయినా ‘మీరు ఏమయినా పని చేస్తారా అని అడిగితే ‘లేదనే’ సమాధానం చెపుతారు. అందుకు కారణం సమాజం మహిళల శ్రమకు తక్కువ స్థానం ఇవ్వటమే. నేను ఈ పనినంతటినీ ‘గ్రే జోన్’ గా పిలుస్తాను. ఈ పనులు చేసేవారిని ప్రభుత్వం గాని, విధాన నిర్ణేతలు గాని శ్రామికులుగా గుర్తించరు. వారు పనిచేసినా పనిచేసేవారిగా గుర్తించబడరు. ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలేవీ వీరికి వర్తించవు.
ఇంటి నుండి ప్రతిఫలంతో కూడిన పని
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంటి నుండి పనిచేయడం తరతరాలుగా అలవాటులో ఉన్నదే. ప్రపంచవ్యాప్తంగా లేదా దేశమంతటా ఆ పని సరఫరా గొలుసులో అంతర్భాగంగా ఉంటుంది. వారే ఇంటి నుండి పని చేసే వారు. కొన్ని సంస్థలు వారిని సంప్రదిస్తాయి (దేశీయ, లేదా విదేశీ). పీస్ రేటుకు బేరాలు కుదుర్చుకుంటారు. వస్త్ర పరిశ్రమ ఇందుకు ఉదాహ రణ. అత్యంత తక్కువ చెల్లింపులు చేసేది ఈ పరిశ్రమే. బొత్తాలు కుట్టడం, చేతులు కుట్టడం, చేతిపని చేయడం, ఎంబ్రాయిడరీ చేయడం వగైరా. మరో గృహ పరిశ్రమ అప్పడాలు, పచ్చళ్ళు, బీడీలు, బొట్టు బిళ్ళలు, నేత వగైరా ఆహార పదార్ధాలు, ఇతర నిత్యావసరాలను తయారు చేయడం. ఇటువంటి పనులు చేసే మహిళలు 3.7 కోట్ల మంది ఉంటారని అంచనా. ఆర్థిక కార్యకలాపాలు బాగా తగ్గిపోవడంతో ఈ రకమైన పనులు చేసేవారికి ఆ కాస్త పనులు కూడా దొరకని పరిస్థితులు ఏర్ప డ్డాయి. వారి ఆదాయాలు పడిపోతాయి. ఇప్పుడీ మహమ్మారి తెచ్చిపెట్టిన మాంద్యంతో పనులు దొరకడం మరింత కష్టమవు తుంది. ముఖ్యంగా వారు పని చేసి పెడుతున్న పరిశ్రమలు నష్టాలలో కూరుకుపోతే పరిస్థితి మరింత విషమిస్తుంది.
కొత్తగా ఇంటి నుండి పని
కోవిడ్ మహమ్మారి రావడం, తద్వారా లాక్డౌన్ ప్రభావా నికి గురైన పనివారి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. వీరంతా నియత ఉద్యోగులే. కార్పొరేట్ లేదా ప్రభుత్వ సంస్థల లోనో పనిచేస్తున్నవారు. విద్యా సంస్థలలో, చిల్లర వ్యాపారాలలో, రవాణాలో, ఆర్థిక రంగం వగైరా రంగాలలో పనిచేస్తున్న వారు. ఇంటి నుండి పని చేయవలసి రావడంతో భారతదేశంలో లింగం ఆధారంగా జరిగే అణచివేత ఏ విధంగా మార్పు చెందిందో అధ్యయనం చేయవలసి ఉంది. దక్షిణ ఆసియాలో, ముఖ్యంగా భారతదేశం, పాకిస్థాన్లలో ఇంటి పనులు చేసే అలవాటు మగవారికి లేదు. ఇంటి పనులను మగవారు పంచుకోవడం చాలా తక్కువ. ఇప్పుడీ లాక్డౌన్లో పనివారు లేనికారణంగా మధ్య తరగతిలో నయినా, ఇంటి నుంచి పని చేయవలసి రావడంతో ఇంతకు ముందు ఇంటిపని చేయని మగవారు కొంత అదనంగా ఇంటిపని బాధ్యతను తీసుకుంటారేమో!
భారతదేశంలో ఇందుకు సంబంధించిన గణాంకాలు రాలేదు. కాని అమెరికాలోవి అందుబాటులో ఉన్నాయి. 2020 ఏప్రిల్ 9-10 తేదీల మధ్య అమెరికాలో ఒక సర్వే చేయబడింది. ఇందులో 2,200 మంది పాల్గొన్నారు. తల్లితండ్రులిద్దరూ ఇంటి నుండే పని చేస్తున్నప్పటికీ ఇంటిపని బాధ్యత సమానంగా పంచుకోడం జరగలేదని ఈ సర్వేలో తేలింది. 70 శాతం మంది మహిళలు ఇంటి బాధ్యత అంతా తమదే అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 66 శాతం పిల్లల పెంపకంలో ప్రధాన బాధ్యత తమదే అన్నారు. తండ్రి కూడా ఇంటి నుండే పని చేస్తున్నందు వలన తల్లి పనులేవీ తగ్గలేదు. ఇంటి నుండే స్కూల్ నడపడం వలన తల్లిపై పిల్లల చదువు బాధ్యత అదనంగా పడింది. 80 శాతం మహిళలు తమ భర్తల కన్నా తామే పిల్లల చదువుకు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుందని చెప్పారు. 46 శాతం మగవారు తాము అదనపు బాధ్యతలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కానీ 3 శాతం మంది మహిళలే ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.
చాలా సమాజాలలో మహిళలు పిల్లల పెంపకానికి, సంరక్షణకు ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఇదివరకు వచ్చిన మహమ్మారుల కాలంలో బడులు మూసివేయడం వలన ఆ ప్రభావం స్త్రీ పురుషుల మీద వేరువేరుగా ఉంటుందని గమనించాము. పిల్లల బాధ్యత పెరగగానే ఉత్పత్తిలో వారి భాగస్వామ్యం తగ్గిపోతుంటుంది. చేసే పని గంటలు తగ్గుతాయి. లేదా ఆదాయాలు పొందే పని నుండి వైదొలగు తారు. మహమ్మారిని నియంత్రించే కాలంలో బడులు మూత పడడం వలన ఆ ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంటుంది. భారతదేశంలో ఆరోగ్యశాఖలో మహిళలే ఎక్కువగా ఉంటారు. బడులు మూత పడడం వలన వారు గనక ఇంట్లో పిల్లలను చూసుకోడానికి సెలవులు తీసుకుంటే, ఎంతో అవసరమైన పరిస్థితులలో వారి సేవలు అందుబాటులో ఉండకపోవడం వలన ఆ ప్రభావం మొత్తం ఆరోగ్య వ్యవస్థపై పడుతుంది. మాంద్యం ప్రభావం ఉద్యోగాలపై ఉంటుంది. ఇది సర్వ సాధారణంగా వివక్షతో కూడి ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్ లాంటి పెద్ద పెద్ద వ్యాపారాలు, ఇతర చిల్లర కొట్లు, వినోదాన్నందించే సంస్థలు మూతపడుతున్నాయి. ఇళ్లలో పని చేసేవారిని, ఆయాలను, ఇల్లు శుభ్రపరిచేవారిని మాన్పిస్తు న్నారు. ఈ అన్ని రంగాలలో ఎక్కువగా పని చేస్తున్నది మహిళలే.
భారతదేశంలో మహిళల పని
ఈ మహమ్మారి రాక మునుపు కూడా భారతదేశంలో మహిళా శ్రమశక్తి వినియోగం క్షీణించడం చూశాం. సరఫరా వైపు నుండి వస్తున్న సమస్యలను పరిశోధించవలసిన అవసరం ఉన్నా గిరాకీ వైపు నుండి ఎదురౌతున్న సమస్యలను తెలుసుకోవలసిన అవసరం ఎక్కువగా ఉంది. క్షీణిస్తున్న మహిళల పరిస్థితులను ఈ మహమ్మారి మరింత దిగజార్చింది. భారతదేశంలో ఆరోగ్యరంగంలో ప్రధానంగా పనిచేసేది మహిళలే. ఆషా వర్కర్లు, అంగన్వాడీలకు వేతనాలు తగినంతగా ఉండవు. విపరీతమైన దోపిడీకి గురవుతుంటారు. వారికి స్వయం రక్షణ పరికరాలు కూడా లేవు. వైరస్ వ్యాప్తిని గుర్తించటం కోసం సర్వే జరపడానికి వెళ్ళేటప్పుడు వారిపై దాడులు జరుగుతున్నాయి. ఈ పని అత్యంత ప్రమాదకర మైనది. పైగా దీనికి ఏ రకమైన పరిహారం కూడా లేదు.
మధ్యతరగతి ఉద్యోగులయినా, కింది తరగతి ఉద్యోగులయినా…కోవిడ్ వ్యాప్తి వలన మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారన్నది స్పష్టం. ఈ సంక్షోభాన్ని అధిగమించేట ప్పుడు ప్రస్తుతం ఉన్న మహిళల పని పరిస్థితులు సమూలంగా మార్పు చెందాలి. శ్రామికశక్తిలో వారి భాగస్వామ్యం పెరగాలి. అదే సమయంలో వారు పనికి తగిన ప్రతిఫలం పొందగలగాలి. ప్రతిఫలం లేని ఇంటి చాకిరీ స్త్రీ పురుషులు సమానంగా పంచుకొనే పరిస్థితులు రావాలి. చైతన్యవంతమైన, వివక్ష లేని విధానాలు రూపొందించబడాలి. ఇటువంటి మార్పులు వస్తే ఇంటి పనులలో కూడా మరింత సమానత్వం వైపునకు మారే అవకాశాలు ఏర్పడతాయని ఆశిద్దాం.
(రచయిత్రి సోనేపట్లోని అశోకా యూనివర్శిటీలో ప్రొఫెసర్)
Courtesy Prajashakti