కోవిడ్-19 నిర్దారణ అయిన కేసుల సంఖ్యలో ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్, భారతదేశాలు ముందంజలో ఉంటే, రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశాలన్నిటికీ ఉమ్మడిగా ఒక లక్షణం ఉంది, అదేమంటే ఈ దేశ అధ్యక్షులు, ప్రధానులు పెత్తందారీ వ్యక్తిత్వాలున్న పురుషహంకార నాయకులు. కోవిడ్-19కి ఈ దేశాలు స్పందించిన విధానాలలో గమనించదగిన తేడాలున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్లు కరోనా వైరస్ ముప్పు తీవ్రతకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, నివారణా చర్యలు తీసుకునేందుకు తిరస్కరించారు.
ఇటీవల కాలంలో తనను ఆమోదించే రేటు నిస్సందేహంగా పడిపోతుందన్న కారణంతోనే డోనాల్డ్ ట్రంప్ తన వైఖరిని కొంతవరకు మార్చుకున్నాడు. ఉదాహరణకు, అంతకు ముందు మాస్క్లు ధరించే వారిని ఎగతాళి చేసి, మాస్క్ ధరించడానికి తిరస్కరించిన కొన్ని నెలల తరువాత ఇప్పుడు బహిరంగంగా మాస్క్ ధరించడం ధరిస్తున్నాడు. కానీ తప్పుదోవ పట్టించే వాదనలతో ఆరోగ్య నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని బలహీన పరచడం ట్రంప్ కొనసాగిస్తూనే ఉన్నాడు. బొల్సనారో మాత్రం కోవిడ్-19 నుంచి కోలుకున్న తరువాత నిర్లక్ష్యంగానే ఉన్నాడు.
దీనికి భిన్నంగా భారత ప్రధాని నరేంద్రమోడీ, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ప్రపంచంలో అత్యంత కఠినమైన, ఆకస్మికమైన లాక్డౌన్ను విధించారు. భారతదేశం, బ్రెజిల్ దేశాల్లో అధికారికంగా ప్రకటించిన పాజిటివ్ కేసుల సంఖ్య వాస్తవ పాజిటివ్ కేసుల సంఖ్య కన్నా తక్కువగా ఉన్నాయని స్వతంత్ర పరిశోధన ఒకటి తెలిపినప్పటికీ, ఒక మిలియన్ ప్రజలలో వ్యాధి సోకే రేటు అమెరికా, బ్రెజిల్ దేశాల కన్నా ఎందుకు తక్కువగా ఉందో బహుశా భారత ప్రధాని లాక్డౌన్ ప్రకటన చర్య పరోక్షంగా తెలియజేస్తుంది.
కానీ మోడీ లాక్డౌన్ ప్రకటనతో పాటు ముఖ్యమైన సామాజిక రక్షణలేక ఆదాయ హామీలు ఏవీ లేవు, కాబట్టి మిలియన్ల సంఖ్యలో ప్రజలను ఆకలి, పేదరికంలోకి నెట్టివేసిన ఫలితంగా పెద్ద మానవ విషాదం సంభవించింది. మరోవైపు వైరస్ వ్యాప్తి తీవ్రత బాగా పెరుగుతూ ఉంది, అంటే లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు పేద కార్మికులు మరింతగా ఎక్కువ నష్టపోయారు.
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత పట్ల అమెరికా, బ్రెజిల్, భారత దేశాలు స్పందించిన తీరులో తేడాలు ఉండవచ్చు, కానీ ఫలితం మాత్రం ఒకే విధంగా ఉంది, అంటే వ్యాధి సోకిన పాజిటివ్ కేసులు ఈ మూడు దేశాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. ఐదు మిలియన్ల సంఖ్యతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే, మూడు మిలియన్లకు పైగా బ్రెజిల్ రెండవ స్థానంలో, రెండు మిలియన్లకు పైగా భారతదేశం మూడవ స్థానంలో ఉన్నాయి, అంటే ఈ దేశాల నాయకులు నిర్వర్తించాల్సిన బాధ్యత చాలా ఉంటుంది.
అహంభావ ప్రదర్శనలో, బడాయి పోవడంలో, విమర్శను తిరస్కరించడంలో ట్రంప్, బొల్సనారో, మోడీలు సుప్రసిద్ధులు. వీరంతా పాక్షిక మత భక్తులను ఆకర్షించ గలిగే ద్వంద వ్యక్తిత్వం గల వారిని రెచ్చగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వీరంతా తమ స్నేహితులకు, నియోజకవర్గ ప్రజలకు ఎంతో శ్రద్ధగా సేవలందించారు. ఇంకా వీరు తమ ప్రజాదరణ కొరకు, తమ కథనాలను ముందుకు తీసుకొని వెళ్ళేందుకు అబద్ధాలను సష్టించి, దష్టి మళ్ళించడం ద్వారా నిజాలను ధిక్కరించే వరుస ప్రదర్శనలు చేశారు. అంతకన్నా ముందు జరిగిందేమంటే కేంద్ర, రాష్ట్ర లేదా ప్రొవిన్షయల్ ప్రభుత్వాల మధ్య జరిగిన బాధ్యతల పంపిణీలో సమతౌల్యత, హేతుబద్ధత, సమన్వయాలు లోపించాయి.
కేంద్ర ప్రభుత్వాలు నిపుణుల శాస్త్రీయమైన సలహాలను పరిగణనలోకి తీసుకోకుండా హేతుబద్ధతలేని, తరచుగా మార్చే నియమాలను, విధానాలను విధించాయి.
రాష్ట్ర, ప్రొవిన్షయల్ ప్రభుత్వాలు వైరస్ను నిరోధించడంలోనే కాక, ప్రజారోగ్యానికి మద్దతు ఇవ్వడం, మహమ్మారి కారణంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కూడా వాటి వంతుగా చాలా భారాన్ని మోస్తూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు క్రింది స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వాటి మధ్య సమన్వయానికి అవసరమైన హామీ కోసం ఏమీ చేయలేదు.
పైనుంచి సమర్థవంతమైన మార్గదర్శకాలు లేకపోవడం కన్నా కూడా, రాష్ట్ర, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు తగినన్ని వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడానికి నిరాకరించిన భారతదేశంలో ఆర్థిక అసమతుల్యత ఎక్కువగానే ఉంది. ఇదే విధానం బ్రెజిల్, అమెరికా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా మొత్తం ప్రజారోగ్యంపైన చేయాల్సిన ఖర్చును పెంచలేదు. ఒకవైపు ప్రభుత్వాలు దెబ్బతిన్న కంపెనీలకు ఆర్థిక మద్దతు ఇవ్వజూపితే, ప్రయోజనాలు పొందింది మాత్రం పెద్ద కార్పొరేట్ సంస్థలు. మరోవైపు పేదలు మాత్రం ముఖ్యంగా భారతదేశంలో అత్యంత తక్కువ సహాయాన్ని పొందినారు. ప్రాణాలకు తెగించి ఆరోగ్య సేవలు అందించడం, ఆహార ధాన్యాలను సరఫరా చేయడం లాంటి సమాజ అవసరాలను తీర్చే ప్రాముఖ్యత ఉన్న కార్మికులు కూడా చాలా తక్కువ మద్దతు, రక్షణ పొందారు. అనేక మంది కార్మికులకు చాలినంత వేతనాలు, సరిపడా సంరక్షణా పరికరాలు, కనీసం మహమ్మారి వ్యాప్తి కాలంలోనైనా ఆరోగ్య భీమా సౌకర్యాలు సమకూర్చలేదు.
అయినా నాయకత్వ ప్రమాదకరమైన వైఫల్యాలను చక్కదిద్దడానికి బదులుగా, ట్రంప్, బోల్సనారో, మోడీలు దష్టి మళ్ళించే చర్యలు సష్టిస్తున్నారు. ట్రంప్ సమర్థవంతంగా ప్రతిస్పందించకుండా, చైనా తప్పుడు సమాచారం ఇస్తుందన్న నెపంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి విరమించుకుంటున్నట్టు, చైనాపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాడు. భారతదేశంలో మోడీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా హిందూ జాతీయవాద ప్రేరేపిత చర్యలతో ముస్లింలను బలిపశువులను చేస్తూ ఉంది. ఈ మూడు దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కంటే ముందు నుంచే, ఆధిపత్య సమూహాల భౌతిక దాడులను ప్రోత్సాహించడం, సామాజిక విభజనను మరింతగా వేగవంతం చేసే చర్యలు ఉన్నాయి. బొల్సనారో కు జాత్యహంకారిగా, స్త్రీ ద్వేషిగా, మైనారిటీల హక్కులను బలహీన పరిచిన చరిత్ర ఉంది. శ్వేతజాతి ఆధిపత్యవాదాన్ని విస్తరించడం, జాతి అన్యాయానికి, పోలీసుల అనాగరిక చర్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న నిరసనల ఖండనలను ట్రంప్ విభజన చరిత్రకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ఇది మన వద్దకు మరొక ఉమ్మడి లక్షణాన్ని తీసుకొని వచ్చింది. ముగ్గురు నాయకులు కూడా భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని అణచడానికి ఈ వైరస్ మహమ్మారిని ఒక సాకుగా ఉపయోగించుకున్నారు. శాంతి యుతంగా నిరసన తెలిపే వారిని అణచడానికి కేంద్ర బలగాలను (తరచుగా మామూలు దుస్తుల్లో) ఉపయోగించి నందుకు ట్రంప్ పట్ల ప్రజలు కేకలు, అరుపులతో నిరసించారు. కానీ భారతదేశంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. శాంతియుతంగా నిరసనలలో పాల్గొన్న ప్రజలను నిర్భందిస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న భారతదేశ జైళ్ళు ఇప్పుడు అనేక మంది మానవహక్కుల కార్యకర్తలకు, న్యాయవాదులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇళ్ళుగా ఉన్నాయి.
అనాగరిక బలప్రయోగం వైరస్ ను నిలువరించలేదు. అదేవిధంగా మోసం, తారుమారు చేసే విధానం, బెదిరింపులు కూడా వైరస్ ను అడ్డుకోలేవు. ఇతర దేశాలు (మహిళలే నాయకురాళ్ళుగా ఉన్న) ప్రజల భాగస్వామ్యం, సహకారం, సామాజిక సంఘీభావాలు మాత్రమే కోవిడ్-19ను ఓడించే ఏకైక మార్గం అని మనకు రుజువు చేసి చూపాయి. కోవిడ్-19 వలన నష్టపోయిన ప్రపంచంలోని పెద్ద దేశాలు ఒక భిన్నమైన మార్గాన్ని అనుసరించడం ప్రమాదమేమీ కాదు.
”ప్రాజెక్ట్ సిండికేట్” సౌజన్యంతో
అనువాదం :బోడపట్ల రవీందర్, సెల్:9848412451
జయతీఘోష్