వెలుగులోకి తెచ్చిన ‘ది వైర్’
దిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్బీఐ ఎట్టకేలకు విడుదల చేసింది. ఆంగ్ల వార్తాసంస్థ ‘ది వైర్’ ఈ ఏడాది మేలో ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేయగా 2019 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువుదాటిన 30 మంది అతిపెద్ద రుణ ఎగవేతదార్ల జాబితాను వెల్లడించింది. దాదాపు పదేళ్ల నుంచి ఆర్బీఐ ఈ జాబితాను వెల్లడిచేయడానికి నిరాకరిస్తూ వస్తోంది. దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఇది వ్యతిరేకంగా ఉంటుందని చెబుతూ వస్తోంది. కానీ, మరోపక్క బ్యాంకులు మాత్రం తమ డబ్బు వసూలు చేసుకోవాడానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కేసులు నమోదు చేయడం, బ్యాంకులతో వివాదాల కారణంగా ఎగవేత దారుల సమాచారం తరచూ బయటకు వస్తూనే ఉంది.
ఆర్బీఐ విడుదల చేసిన 30 కంపెనీల్లో వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన 3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం (ఇప్పటి వరకు బ్యాంకులు రద్దు చేసినవి కూడా కలిపి) రూ.50,000 కోట్లు దాటింది. ఈ డేటాను కేంద్రీకృత బ్యాంకింగ్ సమాచారమైన ‘ది సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్’ నుంచి తీసుకొని విడుదల చేసింది. దీనిలో రూ.5కోట్లకు పైగా రుణం తీసుకొన్న వారి సమాచారం ఉంటుంది. 2018లో ట్రాన్స్యూనియన్ సిబిల్ లెక్కల ప్రకారం 2018లో 11,000 వేల కంపెనీలు కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ.1.61 లక్షల కోట్లతో సమానం.
ఆర్బీఐ ప్రకారం ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటే..
ఆర్బీఐ నిర్వచనం ప్రకారం చెల్లించగలిగే స్థోమత ఉన్నా బకాయిలను చెల్లించని వారిని, ఏ అవసరానికైతే రుణాలను తీసుకున్నారో వాటికి కాకుండా ఇతరాలకు ఖర్చుపెట్టినా ఉద్దేశపూర్వగా ఎగవేతదారుగానే పరిగణిస్తారు.
Courtesy Eenadu…