– మిడియం బాబూరావు
”భారత రాజ్యాంగం లోనే మరో రాజ్యాంగం ఇమిడివుంది, అదే 5వ, 6వ షెడ్యూల్ నిబంధనలు” -జస్టిస్ హిదయతుల్లా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి షెడ్యూల్డ్ గ్రామసభలకు రాజ్యాంగంలో విశిష్ట హక్కులు ఉన్నాయి. 6వ షెడ్యూల్లోని స్వయంపాలిత గిరిజన ప్రాదేశిక జిల్లా కౌన్సిల్స్కు పరిపాలనా పరమైన సర్వహక్కులూ ఉన్నాయి. ‘పీసా’ చట్టం, సమతాతీర్పు, నియమగిరి తీర్పు షెడ్యూల్ ప్రాంతాలలో షెడ్యూల్ తెగలకు గల సమిష్టి హక్కులను ధృవీకరిస్తున్నాయి. కానీ ఆచరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ ప్రాంతాలలో వ్యక్తిగత ఆస్తి సంబంధాలను అమలు చేశాయి. కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా వ్యక్తిగత లబ్దిదారుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి తమ రాజకీయ, ఆర్థిక బంట్లను (ఏజెంట్లను) తయారు చేసుకున్నారు. వీరు గిరిజన తెగల సమిష్టి సాంప్రదాయాలతో ఇమిడేవారు కాదు. పీసా చట్టంలో పేర్కొన్న వనరులపై సమిష్టి యాజమాన్యం వీరికి నచ్చదు.
నాడు నెహ్రూ గిరిజన పంచశీల చెప్పిందేమిటి? 1952లో కేంద్ర మొదటి క్యాబినెట్లో గిరిజన సమాజాల గురించి చర్చించి ఆమోదించిన సూత్రీకరణలనే నెహ్రూ గిరిజన పంచశీలగా పరిగణిస్తారు.
1. గిరిజనుల అభివృద్ధి వారి సొంత బుద్దికుశలత, మేధ ఆధారంగా జరగనివ్వాలి. వారిపై బయటివారి నిర్ణయాలు, అభిప్రాయాలు రుద్దరాదు. దేశ రాజకీయ, సామాజిక జీవితం నుంచి ఉద్భవించే ఉమ్మడి సంస్కృతిలోకి వారు వస్తారు. 2. భూమి, అడవి విషయంలో గిరిజన తెగల హక్కులను గౌరవిద్దాం. బయటివారు గిరిజన భూములను ఆక్రమించకుండా ఆపుదాం. కఠినమైన నియంత్రణ వ్యవస్థ లేకుండా మార్కెట్ ఆర్ధిక వ్యవస్థను గిరిజన ప్రాంతాలలోకి రానీయవద్దు. 3. గిరిజన భాషలను తప్పక ప్రోత్సహించాలి. వాటి రక్షణకు అన్ని విధాల సహాయపడాలి. వారి వికాసానికి దోహదపడే పరిస్థితుల్ని – పద్ధతుల్ని మనం తప్పనిసరిగా రక్షించితీరాలి. 4. గిరిజన ప్రజలపై విశ్వాసముంచాలి. వారి నుంచి ఎంపిక చేసిన అభ్యర్ధులకు శిక్షణనిచ్చి పరిపాలకులుగా నియమించాలి. గిరిజన ప్రాంతాలలో బయటివారి పెత్తనం కూడదు. వారి సామాజిక, సాంస్కృతిక సంస్థలను చెదరగొట్టకుండానే వారి అభివృద్ధి జరగాలి.5. గిరిజన అభివృద్ధి సూచికలు ఖర్చు పెట్టిన డబ్బుతో కొలవరాదు. వారి జీవన ప్రమాణాలలో వచ్చిన గుణాత్మక మార్పులతో కొలవాలి.
ఈ పంచశీల గొప్ప ఆశయాల ప్రకటనే తప్ప కార్యాచరణకు పనికి వచ్చే నిర్థిష్ట అంశాలు తక్కువ. అట్టి కార్యచరణకు ప్రయత్నం కూడా లేదు. వలస పాలనా కాలం నుంచి గిరిజన సమస్యను పాలకులు ఒక శాంతి భద్రతల సమస్యగానే చూశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సెప్టెంబరు 1985 వరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖలో ట్రయిబల్ డివిజన్ (టీడీ) అనే ఓ చిన్న విభాగం పర్యవేక్షించేది. 1985 సెప్టెంబరు నుంచి మే 1998 వరకు సంక్షేమ మంత్రిత్వ శాఖలోను తర్వాత మే 1998 నుంచి సెప్టెంబరు 1999 వరకు సాధికారత, సామాజిక న్యాయమంత్రిత్వ శాఖలోను గిరిజన వ్యవహారాలు నడిచాయి. జాతీయ గిరిజన విధానం పంచశీల ప్రకటించిన 47ఏండ్ల తర్వాత.. అంటే 1999 అక్టోబరులో కేంద్రంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏర్పడింది.
ప్రకటిత విధానాన్ని అమలు చేయకపోవటం తో పాటు గిరిజన తెగల అభివృద్ధి అవసరాలను, వారి అకాంక్షలను, ఆందోళనలను క్రూరంగా అణిచివేశారు. పెట్టుబడిదారీ మార్కెట్ శక్తుల దోపిడీకి గిరిజనుల్ని ఎరగావేశారు. చేసింది తక్కువ చెప్పేది ఎక్కువ. గిరిజనుల రిజర్వేషన్ల అమలులో పాలకవర్గాల వైఫల్యాలు యు.ఎన్.ధేబర్ కమిషన్, బ్రహ్మదేవ్శర్మ కమిషన్, దిలీప్ సింగ్ భూరియా కమిషన్ నివేదికలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కమిషన్లన్నీ భారత రాష్ట్రపతులు నియమించినవే. వీరు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి, పరిశోధించి, అధికార అనధికార భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ధృవీకరించిన అంశాలే నివేదించారు. లోపాలను ఎత్తిచూపి, సరి చేసుకోవలసిన అంశాలు ఈ నివేదికలు సిఫారసు చేశాయి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
భూరియా కమిషన్ చెప్పిన ఒక ఉదాహరణను ప్రస్తావిస్తాను. ”యుగాలుగా గిరిజన తెగలు అడవులలో జీవిస్తున్నారు. ఆదివాసుల బతుకు అడవితో పెనవేసుకుని ఉంది. 1927 నుంచి వచ్చిన చట్టాలన్నీ ఆదివాసుల నివాస ప్రాంతాలను, వారి సాగులో ఉన్న అటవీ భూములను చట్టాలలో చెప్పిన ప్రకారం మినహాయించి మిగతా ప్రాంతాన్ని రిజర్వు ఫారెస్టుగా లేదా రక్షిత అడవులుగా నోటిఫై చేయాలి. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను అకస్మాత్తుగా అక్టోబరు 1980లో ఆపేశారు. ఆరంభించకుండానే ఆపేసిన సందర్భం. కారణం అడవిలో ఆదివాసుల్ని ఆక్రమణ దారులుగా, చొరబాటు దారులుగా (జుఅషతీశీaషష్ట్రవతీర) ప్రభుత్వం పరిగణించింది.” (భూరియా కమిషన్ రిపోర్టు పేరా 7 పేజి 3, 4, పేరా 23 పేజి 272) నాటి కాంగ్రెస్ హయాంలో రూపొందిన ఈ ఆక్రమణ దారీ సిద్ధాంతం నేడు పరాకాష్టకు చేరింది. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చినా గిరిజనులకు పట్టాలు రాకుండా అటవీశాఖ అడుగడుగునా అడ్డుకుంటోంది. కొందరు పర్యా వరణ వేత్తలు, విశ్రాంత అటవీ అధికారులు ”వైల్డ్ లైఫ్ ఫస్ట్” అనే సంస్థగా ఏర్పడి సుప్రీం కోర్టుకెక్కి తమకు అనుకూలమైన తీర్పు తెచ్చు కోగలిగారు.
అదే ఫిబ్రవరి 13, 2019న వచ్చిన తీర్పు. అందులో 21 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కోర్టు ఏమని ఆదేశించిందంటే.. అటవీహక్కుల పత్రాల కోసం ధరఖాస్తు చేసి తిరస్కరించబడిన 42.19 లక్షలమంది ఆదివాసులను జూలై 2019 నాటికి భూముల నుంచి ఖాళీ చేయించాలని చెప్పింది. లేదా మీపై చర్యలు ఉంటాయని బెదిరించింది. తిరస్కరణల వైపుచూస్తే ప్రధాన కారణం మీరు రిజర్వు ఫారెస్టులో సాగు చేస్తున్నారు. హక్కు పత్రానికి అనర్హులు అని అటవీశాఖ అభ్యంతరం. కాని అటవీహక్కుల చట్టం సెక్షన్ 3(1) (ఎ) టు (జి) లో స్పష్టంగా చెప్పిందేమంటే సదరు భూమి రిజర్వు ఫారెస్టా, వన్యమృగ సంరక్షణా కేంద్రమా అన్నదికాదు. డిసెంబరు, 13, 2005 నాటికి ముందు సాగులో వున్నారా లేదా అన్నది ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయనిపుణుడు హాజరు కాలేదు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్తో సహా మరికొన్ని సంఘాలు అప్పీల్ వేయగా ప్రస్తుతం కోర్టు ‘స్టే’ విధించింది.
గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న చట్టాలను సవరించటం లేదా రద్దు చేయుట బీజేపీ ప్రభుత్వ ప్రత్యేకత. 1927 భారతీయ అడవుల చట్టానికి తలపెట్టిన సవరణలు చూస్తే ప్రభుత్వ ఆదివాసీ వ్యతిరేక స్వభావం తేటతెల్లం అవుతుంది. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు నాణ్యంగాలేవట, వీరు అడవులలో నివసించ రాదట. అటవీ భూములను ఖాళీ చేయాలట. ప్రయివేటు అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తారట. అందుకు అడవులను, అటవీ భూములను కంపెనీలకు లీజుకిస్తారట. భారతీయ అడవుల సవరణ చట్టం 2019ని ఆమోదిస్తే గిరిజనులు తేనె, చింతపండు సేకరిస్తే అది మైనర్ అటవీ నేరం అవుతుంది. దీనికి ఒక నెల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారు. అటవీ భూములను ఆక్రమించటం మేజర్ అటవీ నేరమట. అందుకు కేవలం రూ.20 లక్షల జరిమానా 12 ఏండ్లు జైలు శిక్ష మాత్రమే విధిస్తారట. ఈ చట్ట సవరణల సారం అర్థం చేసుకోవటం చాల సులభం.
పాలకవర్గాలు రిజర్వేషన్లు అనబడే తమ ఓటు బ్యాంకు రాజకీయ వ్యూహాలను కొనసాగిస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల ద్వారా తామే దళిత, గిరిజన ప్రజలను అభివృద్ధి చేశామనీ, వారిని అన్ని రంగాలలో ముందుకు తెచ్చిన ఘనత తమదేననీ నమ్మబలుకుతారు. కాని ఇది సత్యం కాదు. ఏ ప్రమాణం ప్రకారం చూసినా పేదరికం, ఆకలి, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం అన్నింటిలో వారే ముందున్నారు. కానీ దేశ రాజకీయ నాయకత్వం ఈ సత్యాన్ని చెప్పకుండా రిజర్వేషన్లను సర్వరోగనివారిణిగా ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నది.
”మీరు మాకు ఇస్తున్నది చాల తక్కువ. రాజ్యాంగం మీది. సరిహద్దులు మీవి. సార్వభౌమాధికారం మీది. జెండా మీది. మాకేం దక్కింది? రాజ్యాంగంలో ఆదివాసీ, భారతీయత రెండు కలిసివున్న విషయం ఒక్కటి చెప్పండి. పంచుకున్న వారసత్వం గాని, ఉమ్మడితనం గాని ఏముందో చెప్పండి. హక్కుల్ని, ఇజాలను, పరిశ్రమను, సైన్సును అన్నింటినీ మీరే నిర్వచించారు. మాదైన నిర్వచనం కూడా ఒకటి ఉంచండి” అంటారు జైపాల్ సింగ్ ముండా. ఆయన 1928లో అమ్స్టర్డాం ఒలంపిక్స్లో భారత్కు బంగారు పతకం తెచ్చిన క్రీడాకారుడు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుడు.
Courtesy: NT