-ప్రొ. జి. హరగోపాల్
మతం రాజకీయాలలో నైతికత పెంచుతుందని గాంధీ భావిస్తే, ఇవ్వాళ రాజకీయాలు మతంలో ఉండే నైతిక ప్రమాణాల మీద దాడి చేస్తున్నాయి. గాంధీ మనసారా మత సామరస్యాన్ని కోరుకున్నాడు, దాని కొరకు నిరంతరం శ్రమ పడ్డాడు. దేశ విభజన సందర్భంలో జరిగిన మత ఘర్షణలను చూసి ఎంతో ఆవేదన చెందాడు. అలాంటి ఆయన నేటి పరిణామాలకి చాలా బాధపడి పోరాడేవాడే!
దాదాపు మూడు దశాబ్దాల క్రితం షిల్లాంగ్లో నెహూ విశ్వవిద్యాలయంలో గాంధీ ‘ఎండోమెంట్’ ప్రసంగాలు చేశాను. వాటిని ‘గాంధీ ప్రాపంచిక దృక్పథం: పౌర హక్కులు’ పేర పుస్తక రూపంలో కూడా విశ్వ విద్యాలయమే ప్రచురించింది. ఈ ప్రసంగాలు గాంధీ ఆలోచనా విధానం మీద చాలా విమర్శనాత్మకంగా జరిగినవి. అలా ఉండడానికి నాకుండే వయసు, అప్పుడు దేశంలోని సామాజిక ఆర్థిక సందర్భం ప్రధాన కారణం కావచ్చు. మారుతున్న, మారిన సామాజిక సందర్భం వలన గాంధీని పునరంచనా వేయవలసిన అవసరమేర్పడింది.
అప్పుడప్పుడే నూతన ఆర్థిక విధానం రూపు దిద్దుకుంటున్నది. ఇంకా రాజకీయాలు మతంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించలేదు. మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంత కాలం దానితో పెద్ద పేచీ ఉండదు. మత స్వేచ్ఛను ఒక విలువగా కూడా పరిగణింపవచ్చు. సమాజ పరిణామ క్రమంలో, ప్రకృతి మీద మనిషి తన ఆధిపత్యాన్ని పెంచుకునే క్రమంలో మూఢ విశ్వాసాల స్థానంలో హేతువు పాత్ర పెరిగిన కొద్దీ మనిషి మత స్వేచ్ఛ నుండి, మతం నుండి స్వేచ్ఛ వైపు ప్రయాణం చేస్తాడు. అందుకే గురజాడ ‘మతములన్నియూ మాసిపోవును జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును’ అన్నాడు. పాశ్చాత్య దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి భౌతిక అవసరాలు తీరిన కొద్దీ తమ మీద తమకు విశ్వాసం కలగడంతో మతం పాత్ర క్రమేణా తగ్గుతూ అది చాలా వరకు వ్యక్తిగత విశ్వాసంగా మిగిలింది. రాజకీయ, ఆర్థిక రంగాల నుండి మతం దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. రాజ్యం వేల సంవత్సరాలు తన సాధికారతను మతం నుండే పొందింది. పారిశ్రామిక విప్లవాల ప్రభావం వలన రాజ్యసాధికారత మతం మీద కాక ప్రజల కేంద్రంగా అధికారం లేదా ప్రజల నుండి అధికారం అన్న మార్పు చరిత్రలో ఒక కీలక మలుపు. ఈ క్రమంలోనే సెక్యులరిజం ఒక ఉదాత్త భావజాలంగా అభివృద్ధి చెందింది.
మూడవ ప్రపంచ దేశాలు వలసవాద దోపిడీ వలన పారిశ్రామిక విప్లవంలో వెనకబడిపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వైపు మనిషిని తన మౌలిక భౌతిక అవసరాల నుండి విముక్తి చేస్తూ, మానవ సంబంధాలను తీవ్ర సంక్షోభానికి గురి చేయడం వల్ల వ్యక్తి ఒంటరి కావడం, కుటుంబ వ్యవస్థ స్వభావం పూర్తిగా మారిపోవడం, శ్రమను అమ్ముకోవడం వల్ల తన స్వంత శ్రమ మీద మనిషి తన స్వేచ్ఛను కోల్పోవడంతో మనిషి తన సమిష్టి సామూహిక మనిషత్వాన్ని కోల్పోయాడు. మనిషి కేవలం తన భౌతిక అవసరాలే కాక సంపూర్ణ, సమగ్ర సామూహిక మనిషిగా జీవించాలనే ఆశయం నుండి సోషలిస్టు దృక్పథం అభివృద్ధి చెందింది. మార్క్స్ ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు కూడా సామాజిక సంబంధాలు సంకెళ్ళుగా మారుతాయని ఈ సంకెళ్ళు తెంచుకుని ముందుకు పోయే క్రమంలో ఒక నూతన మానవుడి ఆవిర్భావం జరుగుతుందని సూత్రీకరించాడు. మూడవ ప్రపంచ దేశాలుగా పిలువబడే దేశాలలో అటు పారిశ్రామిక విప్లవం కాని, లేదా సోషలిస్టు విప్లవానికి కాని కావలసిన చారిత్రక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇవి ఒక దిశానిర్దేశం లేని సమాజాలుగా మిగిలిపోయాయి.
ఈ చారిత్రక సందర్భంలో స్వాతంత్రోద్యమాలు భిన్న రూపాల్లో, భిన్న మార్గాల్లో వెల్లివిరిసాయి. ఏ కారణం వల్లనైతే ఏమి, ఏ స్వాతంత్ర్యోద్యమం కూడా తమ దేశాల్లో పెట్టుబడిదారీ విధానాన్ని ప్రవేశపెడతామని అనలేదు. అనలేకపోయాయి. అన్ని ఉద్యమాలలో స్వేచ్ఛ, స్వావలంబన, సమానత్వ భావన అంతర్లీనంగా ఆకాంక్షలుగా ఎదిగాయి. ఉద్యమ నాయకులు కూడా ఒక సమ సమాజ భావనను ప్రత్యేకంగానో, పరోక్షంగానో మాట్లాడుతూ వచ్చారు. ఆ నినాదం మీదే ప్రజలను సమీకరించారు. ఈ రాజకీయ సందర్భం నుండే భిన్నమైన దృక్పథాలు, మార్గాలు ముందుకు వచ్చాయి. భారత స్వాతంత్ర్యోద్యమంలో, గాంధీ, డా.అంబేడ్కర్, భగత్సింగ్, నెహ్రూల ఆలోచనా విధానాలు ముందుకు వచ్చాయి. సోవియట్ విప్లవంతో స్ఫూర్తిపొందిన వామపక్ష శక్తులు కూడా ఎదిగాయి. భగత్సింగ్ సోషలిస్టు ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందడమే కాక ఒక సమ సమాజాన్ని స్వప్నించాడు. దీంట్లో భాగంగానే తనకుతాను ఒక హేతువాదిగా ప్రకటించుకున్నాడు. సమాజం మతాన్ని దాటిపోవాలని ఆశించాడు. డా. అంబేడ్కర్ భారత సమాజానికుండే సంక్లిష్ట సమస్యలను, సామాజిక నిర్మాణాన్ని విశ్లేషిస్తూ సామాజిక సంబంధాలు ముఖ్యంగా మతపర, కులపర సంబంధాలు మౌలికంగా మారితే తప్ప దేశ స్వాతంత్య్రానికి అర్థం లేదు అని కుల నిర్మూలన గురించి చరిత్రాత్మకమైన ఆలోచనని సమాజానికి అందించారు. డా.అంబేడ్కర్ కూడా సోషలిస్టు ఆలోచనని ముందుకు తీసుకపోయే ప్రయత్నంలో భాగంగా భూమిని జాతీయం చేయాలని, సామాజిక మార్పులో రాజ్యం కీలకమైన పాత్ర నిర్వహించాలని భావించే రాజ్యాంగాన్ని ఒక సంక్షేమ రాజ్యాంగంగా రూపొందించే కృషి చేసారు. నెహ్రూ కూడా ఇదే ఆలోచనా విధానంలో మొదటి ప్రధాన మంత్రిగా తన వంతు పాత్ర నిర్వహించారు.
గాంధీ ఆలోచనా ధోరణి ఒక భిన్న మార్గంలో ఉంది. ఆయన సోవియట్ విప్లవంతో స్ఫూర్తి పొందడం అటుంచి బోల్షెవిజాన్ని వ్యతిరేకించారు. అట్లని ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించడమటుంచి దాన్ని సమూలంగా వ్యతిరేకించడమే కాక ఆ అభివృద్ధి క్రమాన్నే సవాలు చేస్తూ వ్యవసాయక విప్లవం మనిషి కనీస అవసరాలు తీర్చడానికి సరిపోతుందని, దాని తర్వాత వచ్చిన పారిశ్రామిక విప్లవం ఒక అనవసరమైన వికృతమైన అభివృద్ధి అని వాదిస్తూ వ్యవసాయక విప్లవం మనిషి అవసరాల నుండి జరిగితే పారిశ్రామిక విప్లవం మనిషి అత్యాశ నుండి పుట్టిందని బలంగా భావించాడు, వాదించాడు. ఆయన ప్రాపంచిక దృక్పథం చాలా వరకు ఈ భావన చుట్టే పరిభ్రమించింది. దాంట్లో భాగంగానే ఒక వైపు ప్రైవేటు ఆస్తిని వ్యతిరేకిస్తూ సంపన్నుల దగ్గరి ఆస్తి పేదల దగ్గరి నుండి దొంగిలించబడింది అని సూత్రీకరిస్తూ, ధనికులు పేదల ఆస్తికి ధర్మకర్తలుగా నడుచుకోవాలని ప్రతిపాదించారు. దీని చారిత్రక సాధ్యాసాధ్యాలు పక్కకు పెడితే ఆస్తి పట్ల గాంధీకుండే దృక్పథం చర్చించవలసిందే. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో, విపరీతమైన నగలు ధరించి, అతి విలువైన దుస్తులు ధరించి వచ్చిన ప్రిన్సెస్ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ తమ చుట్టూ ఉండే పేదలవైపు ఎందుకు చూడడం లేదని ఆగ్రహంతో మాట్లాడుతుంటే, సభకు అధ్యక్షత వహిస్తున్న అనిబిసెంట్ గాంధీ ప్రసంగానికి తీవ్ర అభ్యంతరం చెపుతూ మధ్యలోనే ఆయన ప్రసంగాన్ని ఆపింది. ఆస్తి పట్ల, అసమానతల పట్ల గాంధీకి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ఆస్తి ఉన్న వాళ్ళు తమ ఆస్తిని వదులుకుంటారనీ, ధర్మకర్తలుగా ప్రవర్తిస్తారనే గాంధీ సదాశయం హర్షించవలసిందే, కాని తమకు తాముగా స్వంత ఆస్తిని వదులుకుంటారా, అలా వదులుకున్న సంఘటనలు చారిత్రక అనుభవంలో ఉన్నవా అనే ప్రశ్న జోలికి గాంధీ పోలేదు.
అయితే ఏ సమాజంలోనైనా ఆస్తి పంపిణీ గాంధీ చెప్పిన మార్గంలో కాక దాన్ని ఎలా పంచాలి, ఎవరు పంచుతారు అనే సవాలుకు ప్రజాపోరాటాలే మార్గమన్న ప్రత్నామ్నాయం చరిత్ర ముందు ఉంది. ఆర్థిక అంతరాలను, అసమానతలను రాజ్యం తగ్గిస్తుందన్న భావనను గత ఏడు దశాబ్దాల అనుభవం నుంచి చూస్తే అది ఆ మార్గం ద్వారా సాధ్యమయ్యేది కాదనేది స్పష్టంగానే మన అనుభవంలోకి వచ్చింది. మన రాజ్య వ్యవస్థ సంపద పంపిణీకి పూర్తి తిలోదకాలనిస్తూ ఇవ్వాళ సంపన్నుల సంపదకు రక్షకులుగా మారారు. సంపద పెంచుకునే క్రమంలో గాంధీ ఏ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడారో ఆ వలస దోపిడీని ఆహ్వానిస్తూ దేశ దేశాలు తిరిగి వాళ్ళకు ఎర్ర తివాచీలు పరుస్తున్నారు. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానం వల్ల ఇవ్వాళ మనదేశంలో గతంలో ఎప్పుడూ లేనన్ని అసమానతలు పెరిగాయి. ఈ అసమానతలకు రాజ్యం అండగా నిలువడమే కాక ప్రజలపై విపరీతమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. గాంధీకి రాజ్యం పట్ల, రాజ్యాధికారం పట్ల ఎప్పుడూ భ్రమలు లేవు. ఈ రెంటి విషయంలో అనుమానమే కాక వ్యతిరేకతే ఉండేది. రాజ్యం బలప్రయోగం చేయడానికి ఆయన పూర్తి వ్యతిరేకం. అందుకే స్వాతంత్ర్యానంతరం ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘పోలీసులను, సైన్యాన్ని ఉపయోగించి పాలించే ఏ పాలనైనా అది పరాయి పాలనే’ అంటూ, ‘పాలకులు ఎవరు అనేది కాదు పాలన ఎలా ఉన్నదనేది ప్రధానం’ అని వ్యాఖ్యానించారు. రాను రాను ఈ భావన ప్రాసంగికత పెరుగుతున్నది. పాలించడం కష్టతరమైనకొద్దీ పోలీసు నిర్బంధం విఫలమవుతున్న కొద్దీ పాలకులు ఏమీ తోచని స్థితిలో రాజకీయాలను మతంలోకి లాగారు. మతం రాజకీయాలలో నైతికత పెంచుతుందని గాంధీ భావిస్తే, ఇవ్వాళ రాజకీయాలు మతంలో ఉండే నైతిక ప్రమాణాల మీద దాడి చేస్తున్నాయి. గాంధీ మనసారా మత సామరస్యాన్ని కోరుకున్నాడు, దాని కొరకు నిరంతరం శ్రమ పడ్డాడు. దేశ విభజన సందర్భంలో జరిగిన మత ఘర్షణలను చూసి ఎంతో ఆవేదన చెంది ‘తాను 120 సంవత్సరాలు బ్రతకాలని అనుకున్నానని ఈ మత ఘర్షణలు చూసి తాను ఇంకా బ్రతికున్నందుకు సిగ్గుపడుతున్నానని’ వాపోయాడు. అలాంటి ఆయన నేటి పరిణామాలకి చాలా బాధపడి పోరాడేవాడే!
దేశంలో ఇవ్వాళ పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజ్యం, మతం కలిపి మారణహోమం సృష్టిస్తున్నవి. పెట్టుబడిదారీ పంథా ఇలాంటి విపరీత వికృత పరిణామాలకు దారి తీసినప్పుడు, గాంధీ సూత్రీకరణ ప్రాయోజికతను చర్చించవలసిందే. అలాగే రాజ్యం ఎన్నడూ మానవీయంగా ఉండదని భావించి ఒక రాజ్యం లేని సమాజం కావాలని గాంధీ వాదిస్తే, అది అరాచకానికి దారి తీస్తుందని అంటే– జవాబుగా తన రాజ్యరహిత సమాజంలో మనుషులు అత్యంత జ్ఞానవంతులని అది చైతన్యపూరిత అరాచకం (enlightened Anarchy) అని వాదించాడు. ఇక మతోన్మాదం పెరుగుతున్న ఈ దశలో, పెట్టుబడిదారీ వ్యవస్థ గుప్పిట్లో చిక్కుకు పోయినప్పుడు, రాజ్యం నియంతృత్వం వైపు వెళుతున్నప్పుడు మత సామరస్యం కొరకు ప్రాణాలే ఇచ్చిన గాంధీ ఆలోచనలు, ఆచరణ స్ఫూర్తిదాయకమే.