ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సోమవారం భారీగా పతనమయ్యాయి. కరోనా ప్రభావానికి తోడు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధరలు బాగా తగ్గాయి. ముడి చమురు ధరలు ఆసియాలో సోమవారం 20 ఏళ్ల కనిష్టస్ధాయికి చేరి దాదాపు 30 శాతానికి పడిపోయాయి. కోవిడ్-19 కారణంగా డిమాండ్ బాగా పడిపోవడంతో ఉత్పత్తిలో కోత విధించాలనే ఒప్పందంపై ఒపెక్, భాగస్వామ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ముడి చమురు ధరలను భారీగా తగ్గిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది.
దీని ప్రకారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 36 డాలర్లు, అమెరికన్ డబ్ల్యుటీఐ ఆయిల్ బ్యారెల్ ధర 32 డాలర్లకు దిగివచ్చింది. ఓపెక్(చమురు ఉత్పత్తి దేశాల సంఘం), అనుబంధ దేశాల మధ్య ఉత్పత్తి తగ్గింపుపై జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం డిమాండ్ లేని కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించుకుందామన్న ప్రతిపాదనకు రష్యా అంగీకరించలేదు. అయితే ఏప్రిల్ నెలలో ఆసియా దేశాలకు ముడి చమురును తగ్గించిన ధరలకు విక్రయిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది.
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతన్న నేపథ్యంలో మున్ముందు ముడి చమురు ధరలు మరింత దిగి వస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, ముడి చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే వాహనదారులకు ఊరట లభించనుంది. అయితే ధర తగ్గడంతో ఒనగూడే ప్రయోజనాన్ని లబ్ధిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమేరకు బదిలీ చేస్తాయో చూడాలి.