– దరఖాస్తులు 70 లక్షలు.. కుదిరిన కొలువులు 7,700
– ఉపాధికి దూరమయ్యారని కేంద్ర ప్రభుత్వ పోర్టల్ గణాంకాలు
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగుల సంఖ్య భారీగానే పెరుగుతున్నది. లాక్డౌన్ సమయంలో నిరుద్యోగ రేటు ఆకాశాన్ని తాకుతూ.. పరిస్థితి మరింతగా దిగజారింది. దేశంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇటీవల ప్రధాని మోడీ వలస కార్మికులతో పాటు నిరుద్యోగుల కోసం ప్రారంభించిన ఓ ప్రభుత్వ పోర్టల్ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉన్నదో తెలియజేయజేస్తున్నది. వివరాల్లోకెళ్తే.. గత నెల జులై 11న కేంద్ర ప్రారంభించిన ”అసీమ్” (అత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయి ఎంప్లాయర్ మ్యాపింగ్) పోర్టల్లో 69 లక్షలకు పైగా నిరుద్యోగులు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. మొదటి 40 రోజుల్లోనే ఈ స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఈ నెల 14 నుంచి 21 మధ్య ఏడు లక్షల మందికి పైగా తమ పేర్లను అసీమ్లో నమోదు చేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోపెరుగుతున్న నిరుద్యోగానికి అద్దం పడుతున్నది.
అయితే, ఈ సమయంలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య కేవలం 691గా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. అసీమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న 3.7 లక్షల మంది అభ్యర్థులలో కేవలం 2 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని ఓ జాతీయ ఛానెల్ వెల్లడించింది. ఈ పోర్టల్లో నమోదుచేసుకున్న మొత్తం 69 లక్షలకు పైగా వలస కార్మికుల్లో 1.49 లక్షల మందికి జాబ్ ఆఫర్ లభించగా.. వారిలో ఉపాధి (ఉద్యోగం) లభించింది కేవలం 7,700 మందికి మాత్రమే.
ఈపోర్టల్ కేవలం వలస కార్మికుల కోసం మాత్రమే కాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జాబితాలో స్వయం ఉపాధి టైలర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫీల్డ్-టెక్నీషియన్లు, కుట్టు మిషన్ ఆపరేటర్లు, కొరియర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, నర్సులు, అకౌంట్స్ ఎగ్జి క్యూటివ్స్, మాన్యువల్ క్లీనర్స్, సేల్స్ అసోసియేట్స్ ఉన్నారు. డేటా ప్రకారం.. కర్నాటక, న్యూఢిల్లీ, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరడంతో ఆయా రాష్ట్రాల్లో కార్మికుల కొరత ఉన్నట్టు తెలుస్తున్నది. వలస కార్మికులలో పని డిమాండ్ కేవలం ఒక వారంలో 80 శాతం పెరిగింది (ఆగస్టు 14-21 మధ్యకాలంలో 2.97 లక్షల నుండి 3.78 లక్షలు). అయితే, వారి ఉపాధిలో కేవలం 9.87 శాతం పెరుగుదల చాలా తక్కువగానే ఉంది(7,009 నుండి 7,700 వరకు). ఆగస్టు 21 తో ముగిసిన వారంలో పోర్టల్లో నమోదైన వారి సంఖ్య 11.98 శాతం పెరిగి 61.67 నుంచి 69 లక్షలకు పెరిగింది. కాగా, దేశంలో ఈ నెల 23 నాటికి నిరుద్యోగం రేటు 8.23 శాతంగా ఉండగా, అర్బన్ ప్రాంతాల్లో 9.59, రూరల్ ప్రాంతాల్లో 7.60 శాతంగా ఉన్నది.
Courtesy Nava telangana