- అస్సోంలో ఎన్ఆర్సి తుది జాబితా విడుదల
- పేర్లు లేని వారిలో ప్రజాప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు
- బాధితుల హక్కులపై కేంద్రం మౌనం
- న్యాయం చేయండి : సిపిఎం డిమాండ్
అస్సోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ఆర్సి) తుది జాబితా విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేనివారి పేర్లను మాత్రమే శనివారం ఆన్లైన్లో ఉంచారు. దీని ప్రకారం 3.11 కోట్లమంది భారత పౌరులుగా తేలారు. 19.06 లక్షల మంది పౌరసత్వం గల్లంతైది. వీరిలో ప్రజా ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు కూడా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల పౌరసత్వం గల్లంతు కావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాబితాలో పేర్లు లేని వారి తక్షణ హోదా,హక్కులపై కేంద్రం పెదవి విప్పడం లేదు. దీంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. జాబితాలో పేర్లు లేని వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ట్రిబ్యునళ్లలోనూ, అవసరమైతే హైకోర్టులోనూ అప్పీల్ చేసుకోవచ్చని మాత్రమే కేంద్రం తెలిపింది. ఇప్పటికే 100 ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయగా, మరో 200 ట్రిబ్యునళ్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఆఅనధికారికంగా బాధితుల పౌరసత్వానికి తక్షణమే వచ్చిన ఇబ్బంది లేదని, సంక్షేమ పథకాలు కూడా అందుతాయని బిజెపి కొందరు బిజెపి నేతలు చెబుతున్నప్పటికీ, స్థానికులు ఆ మాటలను విశ్వసించడం లేదు. మరోవైపు ముందు జాగ్రత్తచర్యగా అస్సోం అంతా పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మొహరించారు. జాబితాలో పేర్లు లేని వారికి న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. వారికున్న హక్కులను, కల్పిస్తున్న సౌకర్యాలను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్రం విడుదల చేసిన లోపభూయిష్టంగా ఉందని అస్సాం పబ్లిక్ వర్క్స్ అనే ఎన్జిఓ పేర్కొంది.
Assam, NRC, Senior, muslims , exclusion, foreigners, tribunal, citizenship, detention, centres