- 5.1 నుంచి 2 శాతానికి పడిపోయిన వ్యవసాయ జీడీపీ వృద్ధి
- మద్దతు ధర, ప్రభుత్వ రుణాల ప్రభావం
- ఈ గణాంకాలతో రైతుల ఆదాయం రెట్టింపా?: ఆర్థికవిశ్లేషకులు
దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మొన్నటి జీడీపీ గణాంకాలు బయటపెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయ జీడీపీ వృద్ధిరేటు కేవలం 2శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధిరేటు 5.1శాతం ఉందనీ స్వయంగా ‘కేంద్ర గణాంక కార్యాలయం'(సీఎస్ఓ) ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ రుణాలు దక్కకపోవటం వ్యవసాయ దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేసిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : సుదీర్ఘకాలంగా దేశ రైతాంగాన్ని సమ స్యలు చుట్టుముడితే.. ఎలాంటి ఫలితం వస్తుందో మొన్నటి ‘జీడీపీ గణాంకాలు’ తెలిపాయి. గతకొన్నేం డ్లుగా వ్యవసాయరంగంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పడుతోంది. 2017-18లో వ్యవసాయ జీడీపీ వృద్ధి 5శాతం నమోదైతే, ఆతర్వాతి ఏడాది(2018- 19)లో 2.75శాతం.. ఇప్పుడు 2019-20 మొదటి త్రైమాసికంలో 2శాతం జీడీపీ వృద్ధి నమోదైంది. వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల్లో వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. అయితే వ్యవసాయ సంక్షోభం తీవ్రతను ‘సీఎస్ఓ’ గణాంకాలు పూర్తిగా తెలుపలేదనీ, ‘వాస్తవ గణాంకాల్ని’ చాలావరకు దాచే ప్రయత్నం జరిగిందనీ ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమైన ఆహార పంటల, ఆహారేతర పంటల దిగుబడులు పడిపోయాయి. వీటికి సంబంధించిన గణాంకాలు ‘సీఎస్ఓ’ తెలుపులేదని వారు గుర్తుచేశారు.
ఆహారేతర పంటల విభాగంలో 2017-18లో వేరుశెనుగ దిగుబడులు 92.53లక్షల టన్నులు. 2018-19లో వేరుశెనుగ దిగుబడిపై కేంద్ర వ్యవసాయశాఖ వేసిన అంచనా 66.95 లక్షల టన్నులు. అలాగే 2017-18లో ఆముదం పంట దిగుబడి 15.68లక్షల టన్నులు. 2018-19లో వేసిన అంచనా 12.15లక్షల టన్నులు. పత్తి పంట దిగుబడిలోనూ ఇలాగే గణాంకాల్ని వ్యవసాయశాఖ తగ్గించేసింది. 2017-18లో పత్తి దిగుబడి 328 లక్షల బేళ్లు. 2018-19వచ్చేసరికి 287లక్షల బేళ్లకు దిగుబడి పడిపోయింది.
మార్కెట్ శక్తుల చేతుల్లో ‘మద్దతు ధర’
వ్యవసాయ మార్కెట్కు పంటను తీసుకొచ్చే సమయానికి ధర పడిపోతోంది. పంట దిగుబడి అంతా ప్రయివేటు మార్కెట్ శక్తులకు చేరగానే ధర పెరగటం మొదలవుతోంది. ప్రతి ఏటా జరుగుతున్న ఈ మోసాన్ని ప్రభుత్వాలు అడ్డుకోలేకపోతున్నాయి. మరోవైపు తాను పండించిన పంటకు న్యాయమైన ధర రాక రైతు అప్పుల పాలవుతున్నాడు. ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ ఎంతో డబ్బు ఖర్చుచేసి, శారీరకంగా ఎంతో శ్రమచేసి సాధించినదానికి విలువలేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నాడు. ఇలాంటి వాతావరణం పంటల దిగుబడి పడిపోవడానికి కారణమైందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.
భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సైతం పడిపోయింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.60,614కోట్ల విలువజేసే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఎగుమతుల్లో 5శాతం తగ్గుదల నమోదైంది. ధాన్యం, కాఫీ, తేయాకు…మొదలైనవి క్రితంసారికన్నా తక్కువ మొత్తంలో ఎగుమతి అయ్యాయి.
నగదు పథకంతో పరిష్కారమా?
వ్యవసాయ దిగుబడులు పెంచకుండా రైతుల ఆదాయం పెరగదు. రెట్టింపు కాదు. వ్యవసాయ జీడీపీ వృద్దిరేటు ఈ విధంగా కొనసాగితేగనుక ‘రెట్టింపు ఆదాయం’ సంగతి మరిచిపోవాల్సిందే.
ఏడాదికి రూ.5 వేలు లేదా రూ.6వేలు నగదురూపంలో రైతుకు లబ్దిచేకూర్చటం అసలు సమస్యను పరిష్కరించదని నిపుణులు తెలుపుతున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన ‘ఈనామ్’ పథకం రైతులకు మద్దతు ధర కల్పించలేకపోతోంది. ఇందులో ట కొనుగోలుకు ఎక్కువ సంఖ్యలో కొనుగోలుదార్లు రాకపోవటం పెద్ద మైనస్ పాయింట్.
- ఆహారపంటల విభాగంలో పప్పులు, మొక్కజొన్న, రాగులు, సజ్జ, తృణధాన్యాలు…అన్నింటిలోనూ (2018-19) పంట దిగుబడులు పడిపోయాయి.
- ఆహార, ఆహారేతర పంటల దిగుబడి పెరగటం 2017-18వరకే నమోదైంది. ఆ తర్వాత వృద్ధి అంతాకూడా క్రమంగా నేలచూపులు చూస్తోంది.
- యూపీఏ హయాంలో ఆహార, ఆహారేతర పంటల దిగుబడి 5శాతం వృద్ధిసాధించగా, ఎన్డీయే పాలనాకాలంలో వృద్ధి 3 శాతానికి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
- గత ఐదేండ్లకాలంలో నీటిపారుదలరంగంలో ప్రాజెక్టులు వచ్చినప్పటికీ పంటల దిగుబడి మాత్రం పెరగలేదు.
- తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, సాధారణంకన్నా తక్కువగా వర్షపాతం నమోదుకావటం కూడా వ్యవసాయరంగ వృద్ధిరేటును ప్రభావితం చేసిందని ఆర్థికవిశ్లేషకులు అంటున్నారు.
(COURTECY NAVA TELANGANA)