భారత్లో గత 24 గంటల్లో వెయ్యికిపైగా కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి.
సీఎంలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
దేశ ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ -19 ప్రభావం, లాక్డైన్ నేపథ్యంలో 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ప్రాణముంటే ప్రగతి అదే ఉంటుందని, ప్రాణం ఉండాలి. ప్రగతీ ఉండాలని అన్నారు. ముఖ్యమంతత్రులకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీయిచ్చారు. వచ్చే 3-4 వారాలు చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
లాక్డౌన్ పొడిగించాలి: కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమ్రంతి కేసీఆర్ కోరారు. లాక్డౌన్ సమయంలో రైతులు నష్టపోకుండా, నిత్యావసర సరుకులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆహారశుద్ధి పరిశ్రమలను కొనసాగేలా చూడాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
మహారాష్ట్రలో లాక్డౌన్ పొడిగింపు
మహారాష్ట్ర కూడా లాక్డౌన్ పొడిగించింది. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించాలని లేకుంటే ఏప్రిల్ 30 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగిస్తామని హెచ్చరించారు. ఒడిశా, పంజాబ్ ఇప్పటికే లాక్డౌన్ పొడిగించాయి.
రెడ్జోన్లకే లాక్డౌన్ పరిమతం చేయండి: ఏపీ
రెడ్జోన్లకే లాక్డౌన్ను పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద ప్రస్తుత పరిస్థితి కొనసాగించాలని కోరారు. కరోనా కట్టడికి ప్రధానమంత్రి సూచించే వ్యూహంతో ముందుకు సాగుతామని సీఎం జగన్ తెలిపారు.
బెంగాల్పై కేంద్రం మండిపాటు
పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. లాక్డౌన్ ఉల్లంఘనలపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలదీసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి శనివారంనాడు ఒక లేఖ రాసింది. రాజబజార్, నార్కెల్ డాంగ, టాప్సియా, మెతియాబ్రుజ్ వంటి ఏరియాల్లో పెద్ద స్థాయిలో లాక్డౌన్ ఉల్లంఘనలు, సామాజిక దూరం పాటించకపోవడం వంటివి జరుగుతున్నట్టు ఆ లేఖలో పేర్కొంది.
ఏపీ ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జి
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి. కనగరాజ్(75) నియమితులయ్యారు. శనివారం ఉదయం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. కొద్ది మంది అధికారులు సమక్షంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఈసీగా జస్టిస్ వి. కనగరాజ్పేరును ప్రతిపాదించగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వెంటనే ఆమోదించారు. దీంతో కనగరాజ్ నియామకానికి మార్గం సుగమం అయింది.
సింగరేణిలో మోడిన సమ్మె సైరన్
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 15వ తేదీ తర్వాత నిరవధిక సమ్మె చేపట్టాలని సింగరేణి కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక నిర్ణయించింది. ఈమేరకు సింగరేణి సీఎండీకి పారిశ్రామిక వివాదాల చట్టం(ఐడీ యాక్ట్)లోని 22(1) ప్రకారం నోటీసు ఇచ్చింది. కార్మికుల సమ్మతి లేకుండానే ఒక రోజు వేతనాన్ని కట్ చేయడం, వేతనాల్లో 50శాతం కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూజీలన్నీ మూసివేయాలనే డిమాండ్లను అందులో ప్రస్తావించింది.
భారత్లో కరోనా మృతులు 239
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో వెయ్యికిపైగా కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. శనివారం సాయంత్రానికి దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,447. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, 40 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కోవిడ్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 239కి చేరింది. మహారాష్ట్రలో సోకి అత్యధికంగా 110 మంది మృత్యువాత పడ్డారు.
ఇటలీలో మే 3 వరకు లాక్ డౌన్
కరోనా వైరస్ కారణంగా భారీ ప్రభావితమైన ఇటలీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కష్టమే అయినా.. తప్పడం లేదని ఇటలీ ప్రధాన మంత్రి గియుసేప్ కాంటే ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఏప్రిల్ 13న ముగియనున్ననేపథ్యంలో మినహాయింపులతో తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల కదలికలపై కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.