వీటి పై అతి తక్కువ ఖర్చు పెడుతున్న తెలంగాణ రుణాల చెల్లింపులో ముందుముందు ఇబ్బందే రైతుబంధు పథకం భేష్: ఆరబీఐ గణాంకాల వెల్లడి.
దిల్లీ: విద్య, వైద్య రంగాల పై దేశంలో అతితక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. – రిజర్వ్ బ్యాంక్ మంగళవారం విడుదలచేసిన రాష్ట్రాల ఆర్థిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ – ప్రభుత్వం విద్యారంగంపై 6.6%, వైద్యరంగం పై 8.5% మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు తేలింది. వచ్చే మూడేళ్లలో రుణాల చెల్లింపు భారం నామమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత మూడేళ్లు మోయలేని విధంగా తయారవుతుంది. రుణమాఫీ కాకుండా రైతులకు ఆర్థిక మద్దతు (రైతు బంధు) ప్రకటించిన తొలి రాష్ట్రంగా తెలంగాణకు ప్రత్యేక ఘనత దక్కుతుందని, ప్రధానమంత్రి కిసాన్ పథకం కంటే ముందుగానే తెలంగాణ ఈ వినూత్న పథకాన్ని ప్రకటించిందని ఆర్ బీఐ ప్రశంసించింది. రుణమాఫీల వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని, ఆదాయ మద్దతు పథకం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోనివారూ ప్రయోజనం పొందుతారని వ్యాఖ్యానించింది.
* రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం (రెవెన్యూ రిసీట్స్) 2017-18లో రూ. 88,824 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ. 1,13,099కి చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ వ్యయం రూ. 85,364.7 కోట్ల నుంచి రూ. 1,11,055కి పెరిగింది. 2017-18లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు ఉండగా, 2019-20 నాటికి అది రూ. 2,044కి తగ్గింది.
* కేంద్రం నుంచి వచ్చే వనరుల నికర బదలాయింపు 2017-18లో రూ. 22,826.8 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ. 27,786.2 కోట్లకు చేరింది. 2018-19లో ఇవి రూ. 46,401 కోట్లకు చేరినప్పటికీ ఆ మరుసటి ఏడాదికల్లా దాదాపు 40% తగ్గిపోయాయి.
* 2019 మార్చి చివరికల్లా రూ. 1,44,590కోట్ల మేర ఉన్న తెలంగాణ అప్పులు 2020 మార్చికల్లా రూ. 1,68,124కోట్లకు చేరుతాయి. ఇందులో అంతర్గత రుణాల వాటా రూ. 1.40 లక్షల కోట్లు. 2015లో రూ. 12,658 కోట్లున్న రాష్ట్ర అప్పు 2020 నాటికి రూ. 1,68,724కోట్లకు చేరుతుంది.
* వచ్చే అయిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన అప్పులు రూ. 1,784.6 కోట్లు మాత్రమే. 2019-20 నుంచి 2021-22 మధ్యకాలంలో కాలపరిమితి ముగిసే అప్పులేమీ లేవు కాబట్టి ఈ మూడేళ్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రెండేళ్లు ఏటా రూ. 892 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. 2024-25 నుంచి 2021-28 మధ్యకాలంలో ఏటా రూ. 13,742 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా వచ్చే 20 ఏళ్లలోతెలంగాణ ప్రభుత్వం రూ. 1.04 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంటుంది.
* విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఈ ఐదేళ్లలో తగ్గుతూ వస్తోంది. 2014-15లో 11.2% మొత్తం ఖర్చుచేయగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో అది 10.9%, 10%, 10.4% 7.3%కి చేరి 2019-20 నాటికల్లా 6.6%కి తగ్గింది. దేశంలో అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ.
* వైద్యరంగంపై ఖర్చు తగ్గుతూపోతోంది. 2014-15లో 4.1% ఉండగా, 2019-20 నాటికల్లా 3.5%కి తగ్గింది.
- సామాజిక రంగాలపై చేసే ఖర్చు రూ. 2014-15లో రూ. 24,433 కోట్లు ఉండగా, 2019-20 నాటికి రూ. 52,319 కోట్లకు చేరింది. 2108-19లో అత్యధికంగా రూ. 69,000 కోట్లు ఖర్చుచేసింది.
* రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం 2018-19 నాటికి రూ. 11,314 కోట్లకు చేరింది. దేశంలో మరే రాష్ట్రమూ ఇంత పెద్ద ఎత్తున గ్యారెంటీలు ఇవ్వలేదు. దీని తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2018-19 సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ కలిపి రూ. 1.57 లక్షల కోట్లకు గ్యారెంటీలు ఇవ్వగా అందులో తెలంగాణా వాటా 49% ఉంది.
Courtesy Eenadu…