– కాశ్మీర్లో కర్ఫ్యూ, నాయకులపై నిర్బంధాలను ఎత్తేయాలి
– 30 దేశాల్లోని వివిధ రంగాల ప్రముఖుల ఉమ్మడి పక్రటన
న్యూఢిల్లీ : కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. సైనికబలంతో అమలవుతున్న కర్ఫ్యూ, నాయకులపై నిర్బంధాల్ని ఎత్తేయాలని వారంతా భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఉమ్మడి ప్రకటన ఒకటి విడుదలచేశారు. కాశ్మీర్లో మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వారికి సంఘీభావం ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కల్పించాలనీ, సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలనీ వారంతా ఆ ప్రకటనలో భారత్ను కోరారు. వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది మహిళా హక్కులు, ప్రజాస్వామ్య కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, విద్యార్థులు, రచయితలు సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధాని మోడీ ప్రసంగించడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన విడుదలగావటం గమనార్హం.
బంధువుల్ని కలుసుకోనివ్వండి… : ఆగ్రా జైలు అధికారికి జమ్మూకాశ్మీర్ హైకోర్టు ఆదేశాలు
శ్రీనగర్ : వివిధ కారణాలతో ఆగ్రా కేంద్ర జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ బంధువుల్ని కలుసుకోవచ్చునని జమ్మూకాశ్మీర్ హైకోర్టు తెలిపింది. రాష్ట్రానికి చెందిన ఇష్ఫాక్ అహ్మద్ గనీ, అకద్ మట్టాన్లు ఆగ్రా కేంద్ర జైలులో ఖైదుగా శిక్ష అనుభవిస్తున్నారు. తమవాళ్లను కలుసుకోవడానికి ఆగ్రా జైలు అధికారులు అనుమతివ్వటం లేదని ఖైదీల బంధువులు జమ్మూకాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ అలీ మహ్మద్ మాగ్రే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పై ఆదేశాలు జారీచేసింది. దగ్గరి బంధువులు జైలులోని ఖైదీల్ని కలుసుకోవటంపై ఎలాంటి ఆంక్షలూ లేవనీ, రాష్ట్ర హోంశాఖ కూడా దీనిపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదనీ ధర్మాసనం పేర్కొన్నది. తనను నిర్బంధించటాన్ని సవాల్ చేస్తూ అహ్మద్ గనీ వేసిన హేబియస్ కార్పస్ పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
జమ్మూకాశ్మీర్లో గోమాంసంపై నిషేధం !
– రాష్ట్ర న్యాయ కమిషన్ ప్రతిపాదన
జమ్మూకాశ్మీర్, లడఖ్లలో గోమాంసం వినియోగంపై నిషేధాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర న్యాయ కమిషన్ ప్రతిపాదించింది. గోవులు, ఇతర జంతువులను వధించటాన్ని నిషేధిస్తే రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి జరుగుతుందని కమిషన్ అభిప్రాయపడింది. రిటైర్డ్ జస్టిస్ ఎం.కె.హంజూరా నేతృత్వంలోని కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యంకు అందజేసింది.
జనాభాలో దాదాపు 70శాతం ముస్లింలున్న ఈ రాష్ట్రంలో 1862లో డోగ్రా పాలకుడు మహారాజా రణబీర్ సింగ్ గోవధపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రణబీర్ పీనల్ కోడ్(ఆర్బీసీ)గా పేర్కొనే బ్రిటీష్కాలం నాటి చట్టంలోని వివిధ సెక్షన్లను ప్రభుత్వ అధికారులు అమలుజేయటం లేదు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన చేపట్టడం ద్వారా 153 రాష్ట్ర చట్టాల్ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆర్బీసీ కూడా ఉంది. దీంతో గోవధను నిషేధించే ఇండియన్ పీనల్ కోడ్లోని పలు సెక్షన్లు జమ్మూకాశ్మీర్, లడఖ్లలో అమల్లోకి వచ్చాయి. అయితే ఐపీసీలోని వివిధ సెక్షన్ల అమలు రాష్ట్రాల ఇష్టానికే వదిలేశారు. ఈనేపథ్యంలో ఆర్బీసీలోని వివిధ సెక్షన్లను తిరిగి అమల్లోకి తీసుకురావటం ద్వారా గోమాంసం వినియోగాన్ని కచ్చితంగా అడ్డుకోవచ్చునని కమిషన్ నివేదికలో తెలిపింది.
Courtesy Navatelangana..