అస్పృశ్యతా దురాచారంపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించేందుకు భగత్సింగ్ ప్రయత్నించారు. ఒక్క అంబేడ్కర్ ని మినహాయిస్తే, భగత్ సింగ్ అర్థం చేసుకున్నట్లుగా కుల సమస్యను ఏ సంస్కర్త కూడా అర్థం చేసుకోలేదు.
మన దైనందిన జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు భగత్ సింగ్. స్వాతంత్ర్య పోరాటంలో వీర మరణం పొందిన యోధులలో ఆయన ప్రథముడు. భగత్సింగ్ పోరాటం స్వాతంత్ర్యోద్యమ స్వరూప స్వభావాలను నిర్దేశించడమే కాకుండా లౌకిక, జాతీయవాదాలకు నిర్దిష్టమైన నిర్వచనాలను నిర్దేశించింది. కమ్యూనిస్టులు అప్పటికి దేశంలో బలబడ లేదు. కాంగ్రెస్ దాని నాయకులు రాజీ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో పూర్తి స్వాతంత్ర్యం కోసం ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు.
సామ్రాజ్యవాదులను దేశం నుంచి వెళ్ల గొట్టడం, బూర్జువా, భూస్వామ్య శక్తుల నుంచి దేశ ప్రజలను విముక్తం చేయడం స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం అని చెప్పారు. దాని కోసం విప్లవాన్ని కోరుకున్నారు. వారి దృష్టిలో విప్లవం అంటే ప్రజల ద్వారా ప్రజల కోసం రాజకీయ అధికారాన్ని సాధించడమే… ప్రజలను సంఘటిత పరచడం, సిద్ధాంతాలకు సాన పట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని భగత్ సింగ్కి బాగా తెలుసు. బాంబులు, పిస్తోల్ ద్వారా విప్లవాన్ని తీసుకు రాలేమనే విషయం కూడ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం, శ్రామిక రాజ్యం, సమానత్వ సిద్ధాంతాల మీద ఆధార పడిన సామ్యవాద వ్యవస్థను స్థాపించే కార్యక్రమాన్ని భారత దేశ ప్రజలకు పరిచయం చేసిన గొప్ప యువ మేధావి భగత్ సింగ్. అట్లాగే మతం, మత తత్త్వం, దళితుల స్థితిగతుల గురించి వారి విశ్లేషణలు కూడ నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరం.
1928 జూన్ మాసంలో కీర్తి మ్యాగజైన్లో అస్పృశ్య సమస్య అనే శీర్షికతో ఆయన రాసిన వ్యాసం చాలా ముఖ్యమైనది. దళితుల దయనీయ స్థితికి దారి తీసిన చారిత్రిక, సామాజిక అంశాలను లోతుగా పరిశీలించడంతో పాటు దళిత సమస్యకు పరిష్కారాలను కూడ ఈ వ్యాసంలో చూపారు. దీన్ని రాసినప్పుడు ఆయన వయస్సు దాదాపు 20 ఏళ్లు. స్వాతంత్ర్యంతో పాటు దళిత సమస్యను కూడ పరిష్కరించాలనే ఆలోచన ఆ వయసులో రావడం వారి సిద్ధాంత పరిపక్వతను ఆవిష్కరిస్తుంది. దళితుల దయనీయ పరిస్థితులకు హిందూ మతమే కారణం అని చెప్పారు. దయానంద్, మాలవీయ వంటి సంస్కర్తలు ఉద్యమాలు నడిపినప్పటికీ అస్పృశ్యతను దూరం చేయలేక పోవడానికి మనువాద మనస్తత్వం నుంచి వారు బయట పడక పోవడమే ప్రధాన కారణం అని భగత్ అన్నారు. బ్రాహ్మణవాద ఫ్యూడల్, బూర్జువా భూస్వామ్య శక్తుల నిర్మూలనలోనే దళిత సమస్యకు పరిష్కారముందని ఆయన భావించారు. ఈ వ్యవస్థపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించే యత్నం చేశారు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని పుట్టించండి. రాజకీయార్థిక విప్లవం కోసం నడుం బిగించండి. దేశానికి పునాదులు, నిజమైన శక్తి మీరే అని పిలుపునిచ్చారు. ఒక్క అంబేడ్కర్ని మినహాయిస్తే, భగత్ సింగ్ అర్థం చేసుకున్నట్లుగా కుల సమస్యను ఏ సంస్కర్త కూడా అర్థం చేసుకోలేదు. భగత్ సింగ్ ఇంకో 10, 15 ఏళ్లు బతికి ఉంటే దేశ స్వరూప స్వభావాలే మారిపోయేవి.
Acharya V.Krishna